ఆరు గ్యారెంటీలపై సర్కార్ ఫోకస్.. ఇవాళ సీఎం కీలక సమావేశం!

by GSrikanth |
ఆరు గ్యారెంటీలపై సర్కార్ ఫోకస్.. ఇవాళ సీఎం కీలక సమావేశం!
X

దిశ, తెలంగాణ బ్యూరో: వంద రోజుల్లో సిక్స్ గ్యారెంటీస్‌ అమలు చేస్తామన్న కాంగ్రెస్ ప్రభుత్వం వాటి అమలే లక్ష్యంగా ముందుకు సాగుతున్నది. ఇందుకు అవసరమైన మార్గదర్శకాలను రూపొందించే పనిలో నిమగ్నమైంది. గ్యారెంటీల అమలు, మార్గదర్శకాలతో పాటు పలు అంశాలపై చర్చించేందుకు సీఎం రేవంత్‌రెడ్డి నేడు కలెక్టర్లతో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. ఇందులో కౌలు రైతుల గుర్తింపు ప్రామాణికం, కొత్త రేషన్ కార్డుల జారీ ప్రక్రియ, రైతు భరోసాకు మార్గదర్శకాలు, ‘ధరణి’తో వస్తున్న ప్రాబ్లమ్స్‌ను ఎలా పరిష్కరించాలి ? వంటి కీలక అంశాలు వారితో డిస్కస్ చేయనున్నారు.

తొలి సారిగా..

సీఎంగా రేవంత్‌రెడ్డి బాధ్యతలు చేపట్టిన తర్వాత ఫస్ట్ టైమ్ అన్ని జిల్లాల కలెక్టర్లతో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. ‘ప్రజాపాలన’ ప్రధాన ఎజెండాగా ఉన్నప్పటికీ అనుబంధంగా పై నాలుగు కీలక అంశాలపై దృష్టి కేంద్రీకరించనున్నట్లు తెలిసింది. ఇప్పటికే రెండు గ్యారెంటీలను అమల్లోకి తెచ్చిన ప్రభుత్వం మార్చి 17వ తేదీలోగా మిగిలిన వాటిని అమలు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నది.

అర్హతలపైనే ఫోకస్

సిక్స్ గ్యారెంటీస్ అమలుకు భారీ స్థాయిలో నిధులు ఖర్చవుతాయని ఆర్థిక నిపుణులతో పాటు అధికారులూ అంచనా వేశారు. వాటి అమలుకు అవసరమైన వనరులను సమీకరించుకోవడంతో పాటు అర్హులైన వారిని గుర్తించడం ఇప్పుడు కీలకంగా మారింది. గ్యారెంటీలకు రూపకల్పన చేసే సమయంలోనే ఏ మేరకు నిధులు అవసరం అవుతాయనే దానిపై కాంగ్రెస్ లోతుగా అధ్యయనం చేసింది. మహిళలకు ప్రతి నెలా రూ.2,500 ఆర్థిక సాయం ఇవ్వనున్నట్లు మహాలక్ష్మి స్కీమ్ (గ్యారంటీ)లో పేర్కొన్నందున అర్హతలను ఫిక్స్ చేయడంపై ప్రభుత్వం దృష్టి పెట్టింది. ఏ వర్గానికి చెందిన మహిళలకు అమలు చేయాలన్నది చర్చనీయాంశంగా మారింది.

కలెక్టర్ల నుంచి అభిప్రాయాలు

కలెక్టర్లతో కాన్ఫరెన్స్ నిర్వహించనున్న సీఎం వారితో అభిప్రాయాలు తీసుకోనున్నారు. చాలా పథకాలకు లబ్ధిదారుల ఎంపికలో రేషన్ కార్డులు కీలకంగా ఉన్నాయి. దీన్ని దృష్టిలో పెట్టుకుని ప్రస్తుత ప్రభుత్వం కూడా గ్యారెంటీల పేరుతో అందుకునే సాయానికి నిర్దిష్టమైన అర్హతలను ఫిక్స్ చేయడం అనివార్యమవుతున్నది. ఇందులో భాగంగానే రేషన్ కార్డుల కోసం ఇప్పటివరకు వచ్చిన దరఖాస్తులు, వాటిలో అప్రూవ్ అయినవి, ఇంకా పరిశీలనలో ఉన్నవి, కొత్తగా దరఖాస్తులను ఆహ్వానించడం.. తదితర అంశాలన్నింటిపైనా కలెక్టర్ల నుంచి సీఎం ఫీడ్‌బ్యాక్ తీసుకుని స్పష్టమైన దిశానిర్దేశం చేయనున్నట్లు సచివాలయ వర్గాల సమాచారం. అనేక పథకాలకు రేషన్ కార్డు కనీస అర్హతగా ఉన్నందున ఈ అంశాన్ని కొలిక్కి తేవడం తప్పనిసరిగా మారింది.

కౌలు రైతుల గుర్తింపుపై ఫోకస్

కౌలు రైతులకు ‘రైతుభరోసా’ పేరుతో ప్రతి ఏటా రూ.15 వేల చొప్పున పంట పెట్టుబడి సాయం చేయనున్నట్లు ప్రకటించినందున వారిని గుర్తించడానికి నిర్దిష్ట క్రైటీరియాను రూపొందించాలని ప్రభుత్వం భావిస్తున్నది. లీగల్ చిక్కులకు ఆస్కారం లేకుండా పకడ్బందీ విధానాన్ని రూపొందించాలని అనుకుంటున్నది. అదే టైంలో రైతు కూలీల (ఉపాధి హామీ జాబ్ కార్డు హోల్డర్లు)ను గుర్తించి వారికి ఏటా రూ.12 వేలు ఇచ్చేందుకు అర్హతలను నిర్ధారించాల్సి ఉన్నది. కొద్దిమంది రైతులు ఒక వైపు పట్టాదారులుగా ఉంటూనే కౌలు రైతులుగానూ ఉంటున్నందున రెండు రకాల మధ్య నిర్దిష్టమైన విభజన రేఖ విషయంపైనే ప్రభుత్వం ఎక్కువ కసరత్తు చేస్తున్నది.

Next Story

Most Viewed