ఆ జిల్లాలో 'గులాబీ'కి పట్టు శూన్యం

by Disha Web Desk 2 |
ఆ జిల్లాలో గులాబీకి పట్టు శూన్యం
X

దిశ, తెలంగాణ బ్యూరో: ముఖ్యమంత్రి కేసీఆర్‌కు కొత్త తలనొప్పులు మొదలు అయ్యాయి. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మొదటి నుంచీ బీఆర్ఎస్ పార్టీకి పట్టు దొరకడం లేదు. ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా ఫలితం కనిపించడం లేదు. ఫాలోయింగ్ ఉన్న ఇతర పార్టీ ఎమ్మెల్యేలను బీఆర్ఎస్‌లో తీసుకున్నా.. ప్రజలు పట్టం కట్టడం లేదు. ఏం చేస్తే ఖమ్మంలో పూర్తి స్థాయిలో పట్టు సాధించొచ్చనే విషయంపై సీఎం కేసీఆర్ ఆలోచిస్తున్నట్టు సమాచారం. అందులో భాగంగానే ఈ నెల 18న ఖమ్మంలోనే బీఆర్ఎస్ సభ నిర్వహించేందుకు సీరియస్‌గా కసరత్తు చేస్తున్నారు. పార్టీ బలహీనంగా ఉన్న జిల్లాల్లో తన వ్యూహాల ఉపయోగించి పట్టు సాధించిన కేసీఆర్.. ఉమ్మడి ఖమ్మం జిల్లా రాజకీయాలను తనకు అనుకూలంగా మార్చుకోలేకపోతున్నారు. 2014 ఎన్నికల్లో 10 అసెంబ్లీ స్థానాల్లో కేవలం కొత్తగూడెంలో మాత్రమే గులాబీ పార్టీ విజయం సాధించింది. అనంతరం ఇతర పార్టీల తరఫున గెలిచిన పలువురు ఎమ్మెల్యేలను గులాబీ గూటికి తీసుకొచ్చారు. వారందరికీ 2018 ఎన్నికల్లో గులాబీ పార్టీ తరుఫున టికెట్ ఇచ్చారు. కానీ అందులో కేవలం ఖమ్మం నుంచి మంత్రి పువ్వాడ అజయ్ మాత్రమే విజయం సాధించారు. ప్రస్తుతం ఎలాగైన ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పార్టీని బలోపేతం చేయాలని కేసీఆర్ టార్గెట్ గా పెట్టుకున్నారు. వచ్చే ఎన్నికల్లో 10 స్థానాలను సొంతం చేసుకోవాలని ప్రయత్నిస్తున్నారు.

వేరే వర్గాలకు సహకారం..?

2014 ఎన్నికల్లో పార్టీ బలంగా లేకపోయినా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఒక స్థానం గెలుచుకుంది. 2018 ఎన్నికల నాటికి చాలా జిల్లాల్లో పార్టీ బలంగా మారినా.. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మాత్రం ఎందుకు బలోపేతం కాలేదన్న ప్రశ్న మొదలైంది. కేసీఆర్ తీరే అందుకు కారణమని ఆ జిల్లా లీడర్లు అభిప్రాయపడుతున్నారు. 2014లో ఖమ్మం అసెంబ్లీ నుంచి టీడీపీ తరఫున పోటీ చేసిన తుమ్మల ఓటమిని చవిచూశారు. అనంతరం అతన్ని గులాబీ పార్టీలో చేర్చుకున్నారు. కేబినెట్‌లోకి తీసుకున్నారు. అనంతరం ఆయనకు ఎమ్మెల్సీగా అవకాశం కల్పించి మంత్రి పదవిని కట్టబెట్టారు. కానీ ఆయనకు పూర్తిగా జిల్లా రాజకీయ బాధ్యతలు అప్పగించలేదు. తుమ్మలకు పూర్తి స్వేచ్ఛ ఇస్తే తన మార్కు జిల్లా రాజకీయాల్లో ఏం ఉండదనే కారణంతో.. ఓ వైపు పువ్వాడ అజయ్, మరోవైపు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వర్గాలను అధినేత ఎంకరేజ్ చేసినట్టు టాక్. ఆ ప్రభావం 2018 ఎన్నికల్లో కనిపించిందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. 2018 ఎన్నికల తర్వాత ఈ మూడు వర్గాల వల్ల పార్టీకి నష్టం చేకూరిందని కేసీఆర్ ఆలోచనలో పడినట్టు ప్రచారం జరిగింది. 2019 పార్లమెంట్ ఎన్నికల్లో ఖమ్మం ఎంపీ సీటును సిట్టింగ్ ఎంపీ పొంగులేటికి, అప్పటికే పార్టీలో కొనసాగుతున్న తుమ్మలకు ఇవ్వకుండా టీడీపీ నుంచి నామా నాగేశ్వరరావు పార్టీలో చేర్చుకుని టికెట్ ఇచ్చారు. ఆ తర్వాత ఎమ్మెల్సీ, రాజ్యసభ టికెట్లను కూడా తుమ్మల, పొంగులేటికి ఇవ్వలేదు. విదేశాల్లో బిజినెస్ చేసుకుంటున్న తాతామధు గులాబీ పార్టీలో చేరగానే ఆయనకు ఎమ్మెల్సీ పదవి కట్టబెట్టారు. ఈ నిర్ణయం పార్టీకి మైనస్‌గా మారిందని టాక్. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పార్టీ పట్టుసాధించాలనే ఆలోచనతో పార్టీలో కొనసాగుతున్న వారికి కాకుండా కొత్త వారికి ప్రయారిటీ ఇవ్వడం వల్ల పార్టీ మరింత నష్టపోయిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

కేటీఆర్ ప్రయత్నాలు ఫెయిల్

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పార్టీని చక్కదిద్దేందుకు మంత్రి కేటీఆర్ చేసిన ప్రయత్నాలు ఫెయిల్ అయ్యాయి. వర్గ పోరు వల్ల కొన్ని సార్లు ఆయన జిల్లా పర్యటనలు సైతం రద్దు చేసుకున్న సందర్భాలూ ఉన్నాయి. మూడు గ్రూపులతో విడివిడిగా ఆయన పలుమార్లు చర్చలు జరిపారు. అప్పట్లో కొంతమంది లీడర్లను ఎంకరేజ్ చేయాలని కేటీఆర్ పెట్టిన ప్రపోజల్స్‌ను సీఎం కేసీఆర్ రిజక్ట్ చేసినట్టు తెలిసింది. ఆ జిల్లాకు చెందిన కొందరికి కేసీఆర్ పదవులు ఇస్తే.. వారిని కేటీఆర్ తన వద్దకు రానివ్వడం లేదని టాక్.

తుమ్మల పరిస్థితి ఏంటి?

పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పార్టీ మారేందుకు నిర్ణయం తీసుకున్నారనే విషయం తెలుసుకున్న కేసీఆర్.. తుమ్మల నాగేశ్వరరావుకు ఫోన్ చేసినట్టు తెలిసింది. ఈ నెల 18న ఖమ్మంలో నిర్వహించే బీఆర్ఎస్ బహిరంగ సభ ఏర్పాట్ల కోసం ఆయన సహకారం కోరినట్టు సమాచారం. 2018 ఎన్నికల్లో ఓడిపోయినప్పటి నుంచి తుమ్మలను ఇప్పటి వరకు సీఎం కేసీఆర్ రెండు, మూడు సార్లు మాత్రమే ప్రగతిభవన్ కు పిలిచి మాట్లాడినట్టు సమాచారం. పాలేరు లేదా కొత్తగూడెం టికెట్ ఆశిస్తున్న తుమ్మలకు కేసీఆర్ తప్పనిసరిగా ఒక భరోసా ఇవ్వాలని లేదంటే ఆయన సైతం పార్టీ మారే చాన్స్ ఉందని టాక్.

Also Read...

తెలంగాణలో బీజేపీ భారీ స్కెచ్.. BRS కు చెక్ పెట్టేలా ప్లాన్

Next Story

Most Viewed