సీఏఏపై చిదంబరం తప్పుడు ప్రచారం చేస్తున్నారు: రాజ్యసభ ఎంపీ లక్ష్మణ్

by Disha Web Desk 1 |
సీఏఏపై చిదంబరం తప్పుడు ప్రచారం చేస్తున్నారు: రాజ్యసభ ఎంపీ లక్ష్మణ్
X

దిశ, తెలంగాణ బ్యూరో: పాకిస్థాన్ లాంటి దేశాల్లో హిందువులను తీవ్ర చిత్రహింసలకు గురిచేస్తున్నారని, వారిని ఆదుకునేందుకే కేంద్ర ప్రభుత్వం సీఏఏను అమలు చేస్తోందని రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ అన్నారు. సీఏఏపై చిదంబరం తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. నాంపల్లి బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో సోమవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. మోడీ మూడోసారి ప్రధాని అయితే రాజ్యాంగం మారుస్తారని ఖర్గే అంటున్నారని, బీజేపీపై గోబెల్స్ ప్రచారం చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఆ వ్యాఖ్యలను ప్రజలు ఎవరూ నమ్మే పరిస్థితిలో లేరని స్పష్టం చేశారు. రాజ్యాంగంతో పాటు సీఏఏపై కూడా ప్రజలను తప్పుదోవ పట్టించి ఓట్లు దండుకోవాలని కాంగ్రెస్ చూస్తోందని ధ్వజమెత్తారు. సీఏఏపై చిదంబరం తప్పుడు ప్రచారం చేస్తున్నారని విమర్శలు చేశారు.

పాకిస్థాన్ ఒక మతపరమైన రాజ్యంగా కొనసాగుతోందని, ముస్లిం దేశాల్లో లేని భద్రత భారతదేశంలో మైనార్టీ వర్గాలకు ఉందనే విషయాన్ని ఆయన గుర్తుంచుకోవాలని తెలిపారు. సీఏఏ ముస్లింలకు వ్యతిరేకం కాదని ఆయన స్పష్టం చేశారు. దాని వల్ల ఎవరికీ నష్టం లేదన్నారు. ఎన్నికల్లో ఓట్ల కోసం ముస్లింలను రెచ్చగొట్టి, అబద్ధాలు చెప్పి ఓట్లు దండుకోవాలని కాంగ్రెస్ నేతలు చూస్తున్నారని లక్ష్మణ్ విరుచుకుపడ్డారు. చిదంబరం నరనరాన హిందువులపై వ్యతిరేక భావన ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఏఏను ఎవ్వరూ రద్దు చేయలేరని ఆయన తెలిపారు. దెయ్యాలు వేదాలు వల్లించినట్లు కాంగ్రెస్ తీరు ఉందని, వారు కూడా రాజ్యాంగంపై మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు. నెహ్రూ కుటుంబం తప్ప ఎవరూ పాలించొద్దనే భావనలో కాంగ్రెస్ ఉందని ఆరోపించారు.

కాంగ్రెస్ వంద సార్లు రాజ్యాంగాన్ని సవరించిందని, ఇందిరాగాంధీ.. రాజ్యాంగం కల్పించిన స్వేచ్ఛను హరించిందని విమర్శలు చేశారు. రాహుల్ గాంధీ తమ ప్రధాని అభ్యర్థి అని ఇండియా కూటమి చెప్పలేకపోతోందని లక్ష్మణ్ చురకలంటించారు. ఇండియా కూటమిలోని మమతా బెనర్జీ కాంగ్రెస్ కు 40 సీట్లు కూడా రావని చెప్పిందని ఆయన గుర్తు చేశారు. రాహుల్ ప్రధాని అయ్యేది లేదని, ఆ పార్టీ అధికారంలోకి వచ్చేది లేదని లక్ష్మణ్ తెలిపారు. తెలంగాణలో బీఆర్ఎస్ ఖేల్ ఖతం అయిందని, భవిష్యత్తులో కాంగ్రెస్ పని కూడా అంతేనని జోస్యం చెప్పారు. ఇదిలా ఉండగా ఈనెల 24 వరకు బీజేపీ అభ్యర్థులకు బీఫాం ఇస్తామని లక్ష్మణ్ తెలిపారు. రాజాసింగ్‌పై అక్రమ కేసులు మోపడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు.



Next Story

Most Viewed