వర్చువల్ గానే జిల్లా కార్యాలయాల ప్రారంభోత్సవం.. బీజేపీ నేతల వెల్లడి

by Dishafeatures2 |
వర్చువల్ గానే జిల్లా కార్యాలయాల ప్రారంభోత్సవం..  బీజేపీ నేతల వెల్లడి
X

దిశ, తెలంగాణ బ్యూరో : బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా పర్యటనలో మార్పులు చోటుచేసుకున్నాయి. అనివార్య కారణాల వల్ల ఆయన తెలంగాణ పర్యటనకు రాలేకపోతున్నట్లు పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. జేపీ నడ్డా సంగారెడ్డి జిల్లా బీజేపీ కార్యాలయాన్ని ప్రారంభించాల్సి ఉండగా ఢిల్లీ నుంచే వర్చువల్ సంగారెడ్డి కార్యాలయాన్ని ప్రారంభిస్తారని తెలిపారు. అట్లాగే భూపాలపల్లి, వరంగల్, జనగామ, మహబూబాబాద్ జిల్లాలతోపాటు ఆంధ్రప్రదేశ్ లోని అనంతపూర్, చిత్తూరు జిల్లాల్లో నూతనంగా నిర్మించిన పార్టీ కార్యాలయాలను సైతం జేపీ నడ్డా వర్చువల్ గా ప్రారంభించనున్నట్లు పేర్కొన్నారు.

ఢిల్లీ నుంచి వర్చువల్ గా కార్యకర్తలనుద్దేశించి నడ్డా ప్రసంగించనున్నట్లు ఆయన స్పష్టంచేశారు. కాగా సంగారెడ్డిలో జరిగే పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవానికి పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్, సంస్థాగత జాతీయ సహ ప్రధాన కార్యదర్శి శివప్రకాశ్ జీ, జాతీయ ప్రధాన కార్యదర్శులు తరుణ్ చుగ్, సునీల్ బన్సల్, తెలంగాణ సహ ఇంచార్జ్ అరవింద్ మీనన్ హాజరవుతారని వెల్లడించారు. అనంతరం హైదరాబాద్ లోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో సాయంత్రం 5.30 గంటలకు రాష్ట్ర పదాధికారులు, జిల్లా అధ్యక్షులు, జిల్లా ఇన్ చార్జీల సమావేశం నిర్వహిస్తున్నట్లు ప్రేమేందర్ రెడ్డి తెలిపారు.


Next Story