స్థానిక సంస్థలకు కేంద్రం నిధులు విడుదల.. కేంద్ర మంత్రి కిషన్​రెడ్డి కీలక వ్యాఖ్యలు

by Ramesh Naini |

రాష్ట్రంలో గ్రామపంచాయతీలు, స్థానిక సంస్థల బలోపేతానికి కేంద్ర ప్రభుత్వం నిధులు విడుదల చేయడం పట్ల కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు.

స్థానిక సంస్థలకు కేంద్రం నిధులు విడుదల.. కేంద్ర మంత్రి కిషన్​రెడ్డి కీలక వ్యాఖ్యలు
X

దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలో గ్రామపంచాయతీలు, స్థానిక సంస్థల బలోపేతానికి కేంద్ర ప్రభుత్వం నిధులు విడుదల చేయడం పట్ల కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. గ్రామ పంచాయతీలు, స్థానిక సంస్థలకు కేంద్రం రూ.11 వేల కోట్లకు పైగా నిధులను విడుదల చేసిందన్నారు. శుక్రవారం ఎక్స్​వేదిక స్పందిస్తూ.. 2015-16 నుంచి 2019-20 మధ్యలో రూ.5,060 కోట్లు విడుదల చేయగా 2020-21 నుంచి 2025-26 మధ్య కాలంలో ఈ కేటాయింపులు 80 శాతం పెంపుతో రూ.9,050 కోట్లు పెరిగాయి. ఇందులో రూ.6,051 కోట్లను కేంద్రమే విడుదల చేసింది. గ్రామీణ స్థాయి నుంచి ప్రజాస్వామ్య సంస్థలను బలోపేతం చేస్తే మారుమూల ప్రాంతాల వరకు కూడా జవాబుదారీతనం, పారదర్శకత పెరుగుతుందని కేంద్ర ప్రభుత్వం విశ్వసిస్తోంది. 2023-24 ఆర్థిక సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధుల ఖర్చుపై యుటిలైజేషన్ సర్టిఫికెట్లను రాష్ట్ర ప్రభుత్వం ఇటీవలే సబ్‌మిట్ చేసిన నేపథ్యంలో 2024-25 సంవత్సరానికి సంబంధించిన మొదటి విడత నిధులైన రూ.260 కోట్లను కూడా విడుదల చేసిందన్నారు. మిగతా నిధులకు సంబంధించిన యుటిలైజేషన్ సర్టిఫికెట్లు ఇవ్వగానే దశల వారీగా మిగిలిన రూ.2,500 కోట్ల నిధులు కూడా విడుదల అవుతాయన్నారు.

ప్రత్యేక బ్యాంకు అకౌంట్ తెరవాలి..

కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం ప్రతి గ్రామ పంచాయతీలో ఈ నిధుల వినియోగం కోసం తప్పనిసరిగా ప్రత్యేక బ్యాంకు అకౌంట్ తెరవాలని కిషన్ రెడ్డి అన్నారు. ఈ అకౌంట్ పీఎఫ్​ఎం ఎస్​(పబ్లిక్ ఫైనాన్షియల్ మేనేజ్‌మెంట్ సిస్టమ్) పోర్టల్ లో నమోదు చేసుకుని యూనిక్ ఏజెన్సీ కోడ్ ను పొందాలని సూచించారు. గత బీఆర్​ఎస్​ ప్రభుత్వం గ్రామ పంచాయతీల అకౌంట్లను జప్తుచేసుకుని, ఆ నిధులను ఇతర అవసరాల కోసం దారి మళ్లించింది.. దీంతో చాలా మంది సర్పంచ్‌లు తమ హయాంలో చేసిన పనులకు నిధులు రానందున రాజీనామాలు చేశారు. కొందరు సర్పంచులు ఆత్మహత్యలకు పాల్పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం గ్రామాభివృద్ధి కోసం చేస్తున్న అన్ని ప్రయత్నాలకు సహకరిస్తూ గ్రామ పంచాయతీలు, గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతుల కల్పనకు రాష్ట్ర ప్రభుత్వం ఇకనైనా చొరవ తీసుకోవాలని కోరారు.

Next Story