గిరిజనుల కోసం కేంద్రం రూ.300 కోట్ల నిధులు విడుదల.. ఎండీ గొడెం నగేష్​

by Kema Shiva Kumar |

రాష్ట్రంలోని ఆదివాసులు, గిరిజనుల కోసం కేంద్ర ప్రభుత్వం రూ.300 కోట్లు విడుదల చేసిందని, వాటిని రాష్ట్ర ప్రభుత్వం జిల్లాలకు పంపిణీ చేయకుండా గిరిజనులకు అందకుండా గత ఐదారేళ్ల నుంచి నిలిపివేసిందని ఎంపీ గోడెం నగేశ్ ఆరోపించారు.

గిరిజనుల కోసం కేంద్రం రూ.300 కోట్ల నిధులు విడుదల.. ఎండీ గొడెం నగేష్​
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలోని ఆదివాసులు, గిరిజనుల కోసం కేంద్ర ప్రభుత్వం రూ.300 కోట్లు విడుదల చేసిందని, వాటిని రాష్ట్ర ప్రభుత్వం జిల్లాలకు పంపిణీ చేయకుండా గిరిజనులకు అందకుండా గత ఐదారేళ్ల నుంచి నిలిపివేసిందని ఎంపీ గోడెం నగేశ్ ఆరోపించారు. శనివారం పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పేద గిరిజనులకు అందాల్సిన నిధులను కాంగ్రెస్ పార్టీ తమ కార్యక్రమాలకు వినియోగిస్తున్నదనే అనుమానం కలుగుతోందన్నారు. కొలాంస్, తొటి, చెంచు గిరిజనులు గత ఏడాది నుంచే అప్పులు తీసుకుని ఇండ్ల నిర్మాణాలు చేపట్టారు. రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన నిధులను ఇప్పటికీ విడుదల చేయలేదని మండిపడ్డారు.

విద్యా సంవత్సరం ముగిసినప్పటికీ, గిరిజన విద్యార్థులకు ఇవ్వాల్సిన స్కాలర్‌షిప్స్ ఇవ్వలేదని, ఈ నిధులను కేంద్ర ప్రభుత్వం గత అక్టోబర్ మాసంలోనే విడుదల చేసిందని గుర్తు చేశారు. ఆర్టికల్ 275(1) కింద కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధులతో రెసిడెన్షియల్ స్కూల్స్, ఆశ్రమ పాఠశాలలను అభివృద్ధి చేసి విద్యా వ్యవస్థలో మౌలిక మార్పులు తీసుకురావాలని, విద్యార్థుల స్కిల్ డెవలప్‌మెంట్‌ కోసం కేంద్రం సాయం అందిస్తోందని తెలిపారు. ఈ నిధులను కూడా రాష్ట్ర ప్రభుత్వం తన ఖాతాలో వేసుకుని ఆశ్రమ పాఠశాలలు, రెసిడెన్షియల్ స్కూళ్లకు ఒక్క రూపాయి కూడా ఇవ్వడం లేదన్నారు. కేంద్రం ట్రైబల్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్‌ కోసం రూ.5 కోట్లు విడుదల చేసినా.. రాష్ట్ర ప్రభుత్వం ఈ నిధులను ట్రైబల్ వెల్ఫేర్ ఏజెన్సీలకు ఇవ్వలేదన్నారు.

ప్రధానమంత్రి గ్రామ్ యోజన కింద గ్రామాలకు మౌలిక వసతుల కల్పన కోసం కేంద్రం మార్చి 24న రూ.16 కోట్లు విడుదల చేసింది. రెండు నెలలు గడిచినా రాష్ట్ర ప్రభుత్వం ఈ నిధులను ఇంకా విడుదల చేయకుండా నిర్లక్ష్యం చేస్తుందని తెలిపారు. స్కిల్ డెవలప్‌మెంట్, ఇన్‌స్టిట్యూషన్ డెవలప్‌మెంట్‌ కోసం కేంద్రం రూ.98 కోట్లు విడుదల చేసిన రాష్ట్ర ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయలేదని విరుచుకుపడ్డారు. రూ.300 కోట్లకు పైగా కేంద్రం విడుదల చేసిన నిధులను రాష్ట్ర ప్రభుత్వం తన ఖాతాలోనే ఉంచుకుందన్నారు. తమ వద్ద నిధులేమీ లేవని కాంగ్రెస్ ప్రభుత్వం చెబుతోంది. కేంద్రం రూ.300 కోట్లు ఇచ్చినప్పుడు, ఆ నిధులు ఎందుకు జిల్లాలకు పంపడంలేదని, వాటిని వేరే విధంగా వినియోగించారనే విషయం బయటపెట్టాలని డిమాండ్​చేశారు. తెలంగాణలో గిరిజనులను కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేస్తున్నదని, కేంద్ర ప్రభుత్వం పేద గిరిజనుల కోసం కేటాయించిన నిధులను వెంటనే విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని గోడెం నగేశ్ డిమాండ్ చేశారు.

Next Story