ఓయూ కీర్తికిరీటంలో ఇండో ఫసిఫిక్ అధ్యయన కేంద్రం : బోయినపల్లి వినోద్ కుమార్

by Disha Web Desk 13 |
Boinapally Vinod Kumar
X

దిశ, తెలంగాణ బ్యూరో: సుదీర్ఘ ప్రయాణంలో ఎన్నో మైలురాళ్లను అధిగమించిన.. ఉస్మానియా యూనివర్శిటీ కీర్తి కిరీటంలో మరో కలికితురాయిగా ఇండో ఫసిఫిక్ అధ్యయన కేంద్రం నిలవనుందని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ పేర్కొన్నారు. ఇండియన్ – పసిఫిక్ మహా సముద్ర తీర దేశాల మధ్య సత్సంబంధాలపై విస్తృత అధ్యయనం జరగాల్సిన అవసరం ఉందని అన్నారు. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఇండో – పసిఫిక్ అధ్యయన కేంద్రంను ఆయన ప్రారంభించి మాట్లాడారు. ఇండో పసిఫిక్ తీర ప్రాంత దేశాలతో సత్సంబంధాలు, రాజకీయ, చారిత్రక, సాంస్కృతిక మైత్రి అవసరమని అప్పుడే అభివృద్ధిని కొత్త పుంతలు తొక్కించవచ్చని గుర్తు చేశారు. త్వరలోనే హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం ప్రపంచ వ్యూహాత్మక కేంద్రంగా మారనుందని, తూర్పు, పశ్చిమ దేశాలకు మధ్య వారధి అవుతుందని వివరించారు.

ఢిల్లీ జవహార్ లాల్ నెహ్రూ యూనివర్శిటీ తర్వాత ఇండో పసిఫిక్ కేంద్రాన్ని ఏర్పాటు చేసిన ఉస్మానియా విశ్వవిద్యాలయం దేశంలో రెండో కేంద్రంగా నిలిచిందన్నారు. కార్యక్రమంలో కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ ఓఎస్డీ, అంబాసిడర్ రాజశేఖర్ , ఓయూ ఉపకులపతి ప్రొఫెసర్ డి. రవిందర్ యాదవ్ , ఎమ్మెల్సీ సురభి వాణీదేవి, ఉన్నత విద్యా మండలి చైర్మన్ లింబాధ్రి, రిజిస్ట్రార్ ప్రొఫెసర్ పి. లక్ష్మీనారాయణ, ఇండో పసిఫిక్ అధ్యయన కేంద్రం డైరెక్టర్ ప్రొఫెసర్ జె.ఎల్.ఎన్ రావు, ప్రజాసంబంధాల అధికారి ప్రొఫెసర్ ప్యాట్రిక్, ప్రిన్సిపల్స్, ఆయా విభాగాల డైరెక్టర్లు, అధ్యాపకులు, పరిశోధక విద్యార్థులు పాల్గొన్నారు.

Next Story

Most Viewed