ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో మరో ట్విస్ట్.. తెలంగాణ సీఎస్‌కు CBI లేఖ!

by Disha Web Desk 19 |
ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో మరో ట్విస్ట్.. తెలంగాణ సీఎస్‌కు CBI లేఖ!
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఎమ్మెల్యేల కొనుగోలు కేసు వ్యవహారం రోజుకో మలుపు తీసుకుంటోంది. ఈ కేసుకు సంబందించిన అన్ని దస్త్రాలను తమకు సమర్పించాలని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శాంతి కుమారికి సీబీఐ మరోసారి లేఖ రాసింది. ఈ విషయంలో ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వానికి ఐదు లేఖలు రాసిన సీబీఐ.. తాజాగా బుధవారం మరోసారి లేఖ రాయడం సంచలనంగా మారింది. ఇదిలా ఉంటే.. ఈ కేసు విచారణను సిట్ నుంచి సీబీఐకి అప్పగిస్తూ డివిజన్ బెంచ్ ఉత్తర్వులు ఇచ్చింది. అయితే ఈ తీర్పుపై సుప్రీంకోర్టులో అప్పీల్‌కు వెళ్లేవరకు ఉత్తర్వులు అమలు నిలిపివేయాలని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టును ఆశ్రయించింది. ఈ పిటిషన్‌పై విచారణ జరిపేందుకు హైకోర్టు డివిజన్ బెంచ్ నిరాకరించింది. మరో వైపు కేసు విచారణ సుప్రీంకోర్టుకు అప్పగించాలన్న హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును సైతం ఆశ్రయించింది.

ఈ పిటిషన్‌పై ఫిబ్రవరి 17న విచారణ జరిపేందుకు సుప్రీంకోర్టు ధర్మాసనం అంగీకరించింది. అయితే అప్పటి వరకు హైకోర్టు ఉత్తర్వులపై స్టేటస్ కో విధించాలన్న రాష్ట్ర ప్రభుత్వ విజ్ఞప్తిని సుప్రీంకోర్టు సైతం నిరాకరించింది. కాగా సీబీఐ ఇప్పటికే దస్త్రాల కోసం ఒత్తిడి తెస్తోందని ఒకవేళ సీబీఐకి ఫైల్స్ ఇస్తే సుప్రీంలో ప్రభుత్వ పిటిషన్ నీరుగారిపోతుందని రాష్ట్ర ప్రభుత్వ న్యాయవాది సిద్దార్థ్ లూద్రా సుప్రీంకోర్టు దృష్టికి తీసుకువచ్చారు. కేసులో మెరిట్స్ ఉంటే హైకోర్ట్ తీర్పును రివర్స్ చేస్తామన్న సీజేఐ డీవై చంద్రచూడ్.. స్టేటస్ కో ఇవ్వడానికి నిరాకరించారు. ఈ క్రమంలో ఈ కేసుకు సంబంధించిన అన్ని ఫైల్స్ అప్పగించాలని రాష్ట్ర ప్రభుత్వానికి సీబీఐ లేఖ రాయడం హాట్ టాపిక్‌గా మారింది.

Also Read..

MLC Kavitha: ప్రధాని మోడీ, అదానీ ఒకే నాణేనికి రెండు వైపులా ఉన్న బొమ్మలు

Next Story