‘ఓఆర్‌ఆర్‌పై టోల్ లీజ్‌ను రద్దు చేయండి’

by Disha Web Desk 4 |
‘ఓఆర్‌ఆర్‌పై టోల్ లీజ్‌ను రద్దు చేయండి’
X

దిశ, తెలంగాణ బ్యూరో : ఔటర్ రింగ్ రోడ్ టోల్ వసూలు లీజ్ కాంట్రాక్ట్‌ను 30 ఏండ్ల పాటు ప్రైవేట్ కంపెనీకి ఇవ్వడం వల్ల హైదరాబాద్‌ హెచ్‌ఎండీఏకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని బీజేపీ రాష్ట్ర సీనియర్‌ నాయకుడు గూడూరు నారాయణరెడ్డి అన్నారు. ఔటర్‌ రింగ్‌ రోడ్డుపై ప్రైవేట్‌ కంపెనీకి టోల్‌ వసూలు హక్కును రద్దు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని బుధవారం ఒక ప్రకటనలో డిమాండ్‌ చేశారు. రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం బంగారు గుడ్లు పెట్టే బాతును చంపినట్టు ఉందని ఆయన ఆగ్రహం వ్యక్తంచేశారు. ముంబైకి చెందిన ఓ కంపెనీకి వచ్చే మూడు దశాబ్దాల్లో వచ్చే ధరలో సగం కంటే తక్కువ ధరకే ప్రభుత్వం టోల్ వసూలు హక్కును కల్పించిందని ఆయన ఆరోపించారు.

30 ఏళ్లలో టోల్ ద్వారా సుమారు రూ.17,000 కోట్లు ఆర్జించవచ్చని అంచనా వేసినందున 30 ఏళ్లలో రూ.7,380 కోట్ల చొప్పున టోల్ ఆపరేట్, ట్రాన్స్‌ఫర్ పద్ధతిపై ఓఆర్‌ఆర్‌పై టోల్ వసూలు చేసే హక్కును ప్రైవేట్ సంస్థకు ప్రభుత్వం ఇచ్చిందని ఆయన పేర్కొన్నారు. 30 సంవత్సరాలు ప్రైవేట్ కంపెనీ బిడ్‌ను స్వీకరించడంలో భారీగా డబ్బు చేతులు మారిందని, దీని వెనుక బీఆర్ఎస్ పెద్దల హస్తం ఉందని, ఈ ప్రక్రియ అంతా పెద్ద కుంభకోణంలా కనిపిస్తోందన్నారు. ఔటర్‌ రింగ్‌ రోడ్డుపై టోల్‌ వసూలు చేసే హక్కును ప్రైవేట్ సంస్థకు 30 ఏండ్ల కట్టబెట్టడం వల్ల సదరు సంస్థకు రూ.10,000 కోట్లకు పైగా లాభాన్ని ఆర్జించనుందని పేర్కొన్నారు. అదే దీనివల్ల హెచ్ఎండీఏకు తీవ్ర నష్టం చేకూరనుందని మండిపడ్డారు. ఔటర్‌ రింగ్‌ రోడ్డు కేసీఆర్ తాత సొత్తు కాదని, ఇష్టానుసారం నిర్ణయాలు తీసుకునే హక్కు ఆయనకు లేదని విమర్శలు చేశారు.

Next Story

Most Viewed