ఆదేళాలతోనే సరి.. కస్టమ్ మిల్లింగ్ బకాయిలు చెల్లింపుపై మీనమేషాలు

by Dishafeatures2 |
ఆదేళాలతోనే సరి.. కస్టమ్ మిల్లింగ్ బకాయిలు చెల్లింపుపై మీనమేషాలు
X

దిశ, తెలంగాణ బ్యూరో: సీఎంఆర్‌ (కస్టమ్‌ మిల్లింగ్‌ రైస్‌) కింద మిల్లర్లకు కేటాయించిన ధాన్యం లెక్కలు.. తిరిగి ఎఫ్‌సీఐకి బియ్యం అప్పగించే సమయంలో లెక్కలకు పొంతన ఉండటం లేదు. దీంతో మిల్లుల్లో అవకతవకలు, అక్రమాలు జరుగుతున్నాయని ఎఫ్‌సీఐ అధికారులు తేల్చి చెబుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జిల్లాలో అధికారులు నిర్వహిస్తున్న తనిఖీల్లో అధిక శాతం మిల్లుల్లో బియ్యాన్ని అస్తవ్యస్తంగా, ఇష్టారాజ్యంగా నిల్వ చేసినట్లు సమాచారం . ఒక సీజన్‌లో అప్పగించిన ధాన్యాన్ని బియ్యంగా మార్చి అదే సీజన్‌లో ఎఫ్‌సీఐకి అప్పగించాల్సి ఉండగా మిల్లర్లు ఎందుకు ఆలస్యం చేస్తున్నారనే కోణంలో అధికారులు మిల్లుల్లో ముమ్మరంగా తనిఖీలు నిర్వహించారు . బియ్యాన్ని రాశులుగా పోయడం.. ఎలాంటి టార్పాలిన్లు కప్పకపోవడం.. సీఎంఆర్‌ కింద వచ్చిన ధాన్యం ఎంత.. తిరిగి ఇవ్వాల్సిన బియ్యం ఎంత.. అనే లెక్కలతో రికార్డులు నిర్వహించకపోవడం వల్ల తనిఖీల్లో గణనీయంగా తేడాలు వచ్చాయని అధికారులు గుర్తించారు .

ఆదేశాలతో సరి ?

రాష్ట్ర ప్రభుత్వానికి రైస్ మిల్లర్ల నుంచి 2019-20, 2020-21 యాసంగి, రబీ వరి సేకరణకు సంబంధించి సీఎంఆర్(కస్టమ్ మిల్లింగ్ రైస్) బకాయిలు చెల్లించడంలో రైస్ మిల్లర్లు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు . ఈ నేపథ్యంలో గడువులోగా సీఎంఆర్ ఇవ్వని మిల్లర్ల నుంచి జరిమానాతో కలిపి వసూలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు సివిల్ సప్లై కమిషనర్ వి. అనిల్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. 2019-20 సీజన్‌కు సంబంధించి 48762.210 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని , అలాగే 2020-21కు సీజన్‌కు సంబంధించి 75877.750 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని మిల్లర్లు ఇవ్వాల్సి ఉండగా అవి ఇంతవరకు ఇవ్వలేదు . గతంలో మూడు నెలల క్రితం మార్చి 31 వరకు పలుమర్లు గడువు పొడిగించినా పూర్తి స్థాయిలో సీఎంఆర్‌కు మిల్లర్లు బియ్యం ఇచ్చేందుకు మిల్లర్లు మొగ్గు చూపడం లేదు . దీంతో రాష్ట్ర ప్రభుత్వం మిల్లర్లకు జరిమానాతో కలిపి 125 శాతం వసూలు చేయాలని నిర్ణయించింది. ఇందులో 25 శాతం నగదు రూపంలో, మిగిలినది బియ్యం రూపంలో రాబట్టాలని అధికారులను ఆదేశించారు. 2023-24 ఖరీఫ్ సీజన్ లోపు పెండింగ్ లో ఉన్న సీఎంఆర్ వంద శాతం పూర్తి చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఉత్తర్వులో రూపంలో ఉన్నంత సీరియస్ దాని అమలు అమలుపరచడంలో లేదనే వాదన బలంగా వుంది

గడువు ముగిసినా 500మంది మిల్లర్లు !

గత వానకాలం సీజన్‌ (2021-22) సీఎమ్మార్‌ ఎగ్గొట్టిన మిల్లుల నుంచి 25 శాతం పెనాల్టీతో బియ్యం వసూలు చేయాలని పౌరసరఫరాల శాఖ నిర్ణయించింది. ఆయా మిల్లు ల నుంచి బియ్యం రికవరీకి నిబంధనలను ఖరారు చేసింది. ఈ మేరకు గత నెల సివిల్‌ సైప్లె కమిషనర్‌ అనిల్‌కుమార్‌ ఉత్తర్వులు జారీచేశారు. గత వానకాలం సీఎమ్మార్‌ ఇచ్చేందుకు ఎఫ్‌సీఐ ఈ ఏడాది మార్చి 31 వరకు గడువు విధించింది. గడువు ముగిసినా 494 మంది మిల్లర్లు 2.22 లక్షల టన్నుల బియ్యాన్ని ఇవ్వలేకపోయారు. దీంతో డిఫాల్ట్‌ మిల్లర్ల నుంచి పెనాల్టీ వసూలు చేయాలని ఆ శాఖ నిర్ణయించింది. గడువు ముగిసే సమయానికి తమ దగ్గర ధాన్యం నిల్వలు ఉన్న మిల్లర్ల నుంచి 25 శాతం పెనాల్టీతో కలిపి 125 శాతం బియ్యం వసూలు చేయాలని నిర్ణయించింది. ఇందులో 25 శాతం సీఎమ్మార్‌ అమౌంట్‌ను తక్షణమే చెల్లించడం ద్వారా మిగిలిన సీఎమ్మార్‌ ఇచ్చేందుకు అనుమతి పొందాలని పేర్కొన్న ది. మిగిలిన 100 శాతం సీఎమ్మార్‌ను రాష్ట్ర కోటాలో అందించాలని ఆదేశించింది. తర్వా త సీజన్లకు సంబంధించి ధాన్యం కేటాయింపు కోసం 12 శాతం అమౌంట్‌ చెల్లించాలని ఆదేశించింది. ఈ మొత్తం సీఎమ్మార్‌ను 2023-24 వానకాలం సీజన్‌ ప్రారంభానికి ముందే అందించాలని ఆదేశించింది.

సీఎంఆర్‌ అప్పగింతలో అవకతవకలు

రాష్ట్రంలో వానాకాలం, యాసంగి సీజన్లలో రైతులు పండించిన పంటను మద్దతు ధరకు కొనుగోలు చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం.. ఆ ధాన్యాన్ని ఎప్పటికప్పుడు మిల్లులకు తరలిస్తుంటుంది. సుమారు 3 వేల మిల్లుల ద్వారా ధాన్యాన్ని మిల్లింగ్‌ చేసి, కేంద్ర ప్రభుత్వం సెంట్రల్‌పూల్‌ కింద ఇచ్చిన టార్గెట్‌కు అనుగుణంగా సీఎంఆర్‌ను ఎఫ్‌సీఐ గోడౌన్లకు పంపిస్తుంటుంది. అయితే మిల్లర్లు వ్యాపారమే లక్ష్యంగా రాజకీయ అండదండలతో అవకతవకలకు పాల్పడుతున్నారు. వచ్చిన ధాన్యాన్ని ఆరునెలల్లోగా మిల్లింగ్‌ చేసి ఎఫ్‌సీఐకి అప్పగించాల్సిన మిల్లర్లు ఆ తర్వాత రెండు, మూడు సీజన్లు గడిచినా అప్పగించడం లేదు. మిల్లుల్లోని నాణ్యమైన సర్కారు ధాన్యాన్ని మిల్లింగ్‌ చేసి, ప్రైవేటు వ్యాపారులకు విక్రయించుకుంటున్నారని, ప్రజా పంపిణీ బియం కొని, రీసైక్లింగ్‌ చేసి లోటును భర్తీ చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి.

ఆధారాలు సేకరించిన దర్యాప్తు సంస్థ

రాష్ట్రంలో ఉన్న సుమారు 3 వేల రైస్‌ మిల్లులకు గత మూడేళ్లుగా ప్రతి సీజన్‌లో సుమారు రూ.15 వేల కోట్ల విలువైన ధాన్యాన్ని ప్రభుత్వం అప్పగించి, సీఎంఆర్‌ తీసుకుంటోంది. ధాన్యాన్ని మిల్లింగ్‌ చేసినందుకు లేబర్‌ ఖర్చుతో సహా ప్రతి పైసా మిల్లర్లకు చెల్లిస్తోంది. అయినా.. 33 జిల్లాల్లోని పలువురు పౌరసరఫరాల శాఖ అధికారుల అండతో మిల్లర్లు సర్కారు ధాన్యాన్ని సొంత వ్యాపారానికి వినియోగించుకుంటున్నట్టుగా ఇటీవల సీబీఐ నిర్వహించిన తనిఖీల్లో ఆధారాలు సేకరించినట్లు సమాచారం.

రాజకీయ జోక్యంతో తిరిగి ధాన్యం సరఫరా ?

2019–20లో 118 మంది మిల్లర్లు రూ.230 కోట్ల విలువైన 1,00,427 మెట్రిక్‌ టన్నుల బియ్యం ఎఫ్‌సీఐకి బకాయి పడగా, వారిపై అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. పైగా సదరు మిల్లులకు మరోసారి సీఎంఆర్‌ గడువు పెంచడం అనుమానాలకు తావిచ్చింది. 2020–21లో కూడా వందల సంఖ్యలో మిల్లర్లు బకాయిలు పడగా వారిని డిఫాల్టర్లుగా ప్రకటించి, 2021–22 సీజన్లలో ధాన్యం కేటాయింపును నిలిపివేశారు. అయితే ఆ తర్వాత రాజకీయ జోక్యంతో సదరు మిల్లులకు కూడా యధాతథంగా ధాన్యం సరఫరా అయింది. గత మూడేళ్లుగా రాష్ట్రంలో ధాన్యం దిగుబడి గణనీయంగా పెరగ్గా.. పౌరసరఫరాల శాఖ అధికారుల అండతో సాగుతున్న అడ్డగోలు వ్యవహారాలన్నింటిపై సీబీఐ ప్రాథమికంగా సమాచారం సేకరించినట్లు తెలిసింది.

తెలంగాణకు సంబంధించి ఎఫ్‌సీఐలో గతంలో పనిచేసిన ఓ అధికారి హయాంలో కూడా సీఎంఆర్‌ కోటా సేకరణ విషయంలో అవకతవకలు జరిగినట్లు ఆరోపణలు ఉన్నాయి. అలాగే గత సంవత్సరం వానాకాలం, యాసంగి సీజన్ల సీఎంఆర్‌ గడువు దాటినా ఎఫ్‌సీఐకి అందకపోవడం, లెక్కల్లో తేడాలుండటం వంటి అంశాలు సీబీఐ దృష్టిలో ఉన్నట్లు చెబుతున్నారు.

ఇప్పటికీ పెండింగ్‌లో 2021–22 వానాకాలం బియ్యం

రాష్ట్రంలో ప్రస్తుతం 2022–23 వానకాలం సీజన్‌కు సంబంధించిన ధాన్యం కొనుగోళ్లు సాగుతుండగా, మరో నెలలో కస్టమ్‌ మిల్లింగ్‌ ప్రారంభం కావలసి ఉంది. కానీ ఇప్పటికీ 2021–22 వానాకాలం సీజన్‌కు సంబంధించిన బియ్యం 8.65 లక్షల మెట్రిక్‌ టన్నులు (ఎల్‌ఎంటీ) ఎఫ్‌సీఐకి రావలసి ఉండటం గమనార్హం. ఆ సీజన్‌లో 70.21 ఎల్‌ఎంటీల ధాన్యాన్ని మిల్లర్లకు అప్పగించగా, 47.04 ఎల్‌ఎంటీల బియ్యాన్ని సీఎంఆర్‌ కింద ఇవ్వాల్సి ఉంది. అయితే ఇప్పటికి పలుమార్లు గడువు పెంచినా ఎఫ్‌సీఐకి ఇచ్చిన బియ్యం 38.39 ఎల్‌ఎంటీలే.

అధికారుల అండతో యథేచ్ఛగా అక్రమాలు

2020–21 యాసంగి సీజన్‌కు సంబంధించి మిర్యాలగూడలోని వజ్ర పారాబాయిల్డ్‌ రైస్‌మిల్లు రూ.5.90 కోట్ల విలువైన బియ్యాన్ని ఎగవేయడంతో రైస్‌మిల్లు యజమానులు ముగ్గురిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఇలాంటి కేసులు ప్రతి జిల్లాలో ఉన్నప్పటికీ అధికారుల అండతో అక్రమాలు యధేచ్చగా కొనసాగుతూనే ఉన్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి . ఇక గత యాసంగి సీజన్‌కి సంబంధించి 50.39 ఎల్‌ఎంటీ ధాన్యం మిల్లులకు పంపించి, 34.07 ఎల్‌ఎంటీ సీఎంఆర్‌ తీసుకోవలసి ఉండగా, ఇప్పటివరకు కేవలం 16 ఎల్‌ఎంటీల బియ్యం మాత్రమే ఎఫ్‌సీఐకి అందింది.

పీడీఎస్‌ బియ్యన్నీ రీసైక్లింగ్‌ చేస్తున్న మిల్లర్లు

* సీఎంఆర్‌ కింద కొనుగోలు కేంద్రాల నుంచి సేకరించిన ధాన్యాన్ని మాత్రమే మిల్లుల్లో మర ఆడించాల్సి ఉంటుంది. అయితే సుల్తానాబాద్‌, పెద్దపల్లి, మంథని పట్టణాల్లోని పలువురు మిల్లర్లు నిబంధనలకు విరుద్ధంగా రేషన్‌ బియ్యాన్ని నిల్వ చేసుకుని అక్రమ దందా చేస్తున్నట్లు గుర్తించారు. పీడీఎస్‌ బియ్యాన్ని మిల్లుకు చేర్చి తిరిగి సీఎంఆర్‌ కింద చూపించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు చెబుతున్నారు.

* సీఎంఆర్‌లో భాగంగా సర్కారీ దొడ్డు బియ్యాన్ని కూడా రీసైక్లింగ్‌ చేసుకుని వెళ్తున్నట్లు అధికారులు గుర్తించారు. టెండరు సమయంలో వాహనం నెంబరు ఒకటి ఉంటే, సరకు తరలింపు సమయంలో మరోటి ఉంటున్నట్లు.. అసలు గుత్తేదారులకు బదులు బినామీలు రంగప్రవేశం చేసి రవాణాలో మాయాజాలం చేస్తున్నట్లు కూడా ఫిర్యాదులు అందాయి

* మిల్లుల్లో తనిఖీలకు అధికారులకు వస్తున్నారనే ముందస్తు సమాచారంతో ధాన్యం బస్తాలను అస్తవ్యస్తంగా కిందకు పడేస్తున్నారు. బియ్యం రాశులుగా పోస్తున్నారు. ధాన్యం సంచుల లెక్కను చూపెట్టేందుకు మిల్లర్లు ససేమిరా ఒప్పుకోవడం లేదు. అధికారులు తనిఖీలు చేస్తున్న క్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులతో ఫోన్లు చేయిస్తున్నారు. అధికారులు వినకపోతే మభ్యపెట్టే ప్రయత్నాలు చేస్తున్నారు.

* మిల్లుల నుంచి ఎఫ్‌సీఐ గోదాములకు తరలించే క్రమంలో రవాణా వాహనాలకు ఇన్‌బిల్ట్‌ జీపీఎస్‌ ట్రాకింగ్‌ సిస్టం ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. అయితే సాంకేతిక కారణాలు చూపెట్టి అటు అధికారులు, ఇటు మిల్లర్లు సరకు నిల్వలను తారుమారు చేస్తున్నట్లు తనిఖీల్లో గుర్తించారు.

* మిల్లులకు ధాన్యం కేటాయింపు, తిరిగి బియ్యాన్ని ఎఫ్‌సీఐ గోదాములకు రవాణా చేసే క్రమంలో రూట్‌ ఆఫీసర్ల పర్యవేక్షణ తప్పనిసరిగా ఉండాలి. ఈ పర్యవేక్షణ అంతంతమాత్రంగానే ఉంది.



Next Story