KTR బిహేవియర్‌లో మార్పు.. అసలు విషయాన్ని అంచనా వేయలేక అంగీకారమా?

by Disha Web Desk 2 |
KTR బిహేవియర్‌లో మార్పు.. అసలు విషయాన్ని అంచనా వేయలేక అంగీకారమా?
X

దిశ, తెలంగాణ బ్యూరో: చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకున్నట్టుగా ఉంది బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీరు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత ఆయన బిహేవియర్‌లో చాలా మార్పు వచ్చింది. గతంలో చెప్పిన మాటలకు ప్రస్తుతం చేస్తున్న కామెంట్స్ భిన్నంగా ఉంటున్నాయి. పార్టీ కేడర్‌తో సమావేశాలను నిర్వహిస్తూ.. తప్పులను ఒక్కొక్కటిగా అంగీకరిస్తున్నారు. ఫ్రస్ట్రేషన్‌తోనే ముందుగా వివాదాస్పద కామెంట్స్ చేస్తున్నారని, ఆ తర్వాత వాటిని సరిదిద్దుకునేందుకు ప్రయత్నిస్తున్నారనే టాక్ వినిపిస్తున్నది. ఆలస్యంగా కనువిప్పు కలిగింది అంటూ కొందరు సెటైర్లు సైతం వేస్తున్నారు.

టికెట్ల విషయంలో..

బీఆర్ఎస్ చేసిన అభివృద్ధి, సంక్షేమం తమకు శ్రీరామరక్ష అని.. వాటితోనే బీఆర్ఎస్ మరోసారి అధికారంలోకి వస్తుందని ఎన్నికల సమయంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కామెంట్ చేశారు.. బీఆర్ఎస్ తరఫున ఎవరికి టికెట్ ఇచ్చినా గెలుపు ఖాయమని ఓవర్ కాన్ఫిడెన్స్‌తో మాట్లాడారు. చివరకు సిట్టింగ్‌లను మారిస్తే గెలిచేవాళ్లమని, లోక్‌సభ ఎన్నికల్లో తప్పు జరగకుండా జాగ్రత్త పడతామని చెప్పుకొచ్చారు.

‘మేడిగడ్డ’ విషయంలో..

మేడిగడ్డ బ్యారేజ్ పిల్లర్లకు పగుళ్లు వచ్చినప్పుడు ‘పగుళ్లకు, శ్లాబ్‌లకు మధ్య తేడా తెలియని జాతీయ పప్పు రాహుల్‌గాంధీ..’ అంటూ వివాదాస్పదంగా కేటీఆర్ కామెంట్ చేశారు. అనంతరం ‘పెద్ద పెద్ద కన్‌స్ట్రక్షన్లు జరిగినప్పుడు చిన్న చిన్న లోపాలు సహజమే..’ అంటూ సరిదిద్దుకున్నారు. ‘దేశంలో మరే ప్రాంతీయ పార్టీకి లేనంతగా 60 లక్షల మంది కార్యకర్తలు బీఆర్ఎస్‌కు ఉన్నారని చెప్పుకున్న ఆయన.. అనంతరం పార్టీ నిర్మాణంపై ఫోకస్ పెట్టకపోవడంతోనే అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయామని చెప్పుకొచ్చారు.

రైతుబంధు, దళితబంధు విషయంలో..

పార్టీల తేడా, పక్షపాతం లేకుండా సాగుభూమి ఉన్న రైతులందరికీ రైతుబంధు అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అంటూ ఎన్నికల ప్రచారంలో కేటీఆర్ గొప్పగా చెప్పుకున్నారు. కానీ తాజాగా పార్టీ కేడర్‌తో ఏర్పాటు చేసిన సమావేశంలో మాత్రం.. సంపన్నులకు, భూ స్వాములకు రైతుబంధు ఇవ్వడంతో ప్రజల్లో నెగెటివ్ అయ్యామని ఒప్పుకున్నారు. ప్రజల్లోని వ్యతిరేక ప్రభావాన్ని సరిగ్గా అంచనా వేయలేకపోయామని, అందువల్లనే ప్రతికూల ఫలితం వచ్చిందని సవరించుకున్నారు. దళితబంధు విషయంలోనూ వెనక్కి తగ్గారు. దళితబంధు దళితుల ఆర్థిక బలోపేతానికి దోహదపడుతున్నదని. విపక్షాలు ఉద్దేశపూర్వకంగానే దాన్ని రాద్దాంతం చేస్తున్నాయని విమర్శలు గుప్పించిన ఆయన.. తాజాగా ఈ స్కీమ్ ఫలాలు కొందరికే అందాయని, మిగతా వారికి పార్టీపై అసహనం పెరగడంతో ఎన్నికల్లో ప్రతికూల ప్రతికూల ఫలితాలు వచ్చాయని చెప్పుకొచ్చారు.

ఎమ్మెల్యేల చేతివాటంపైనా కామెంట్స్

దళితబంధు, బీసీలకు లక్ష సాయం పథకాల విషయంలోనూ ప్రభుత్వంపై వ్యతిరేకత వచ్చిందని తాజాగా కేడర్‌‌తో నిర్వహించిన మీటింగ్‌లో కేటీఆర్ వివరించారు. దళితబంధులో కొంతమంది ఎమ్మెల్యేలు చేతివాటం చూపడంతో అబాసుపాలయ్యాయమని అంగీకరించారు. డబుల్ బెడ్‌ రూమ్ ఇండ్ల విషయంలో అసంతృప్తి, గృహలక్ష్మి పథకం కింద రూ.3 లక్షలు ఇవ్వకపోవడం లాంటివి పార్టీ ఓటమికి కారణమయ్యాయనీ చెప్పుకొచ్చారు.

ప్రజలపై ఫ్రస్ట్రేషన్..

పదేండ్ల అభివృద్ధిని, ప్రజలు అందుకుంటున్న సంక్షేమాన్ని చూసి మరోసారి పట్టం కట్టాలని ప్రజలను కోరిన కేటీఆర్.. తాజాగా ఓ మీటింగ్ లో మాత్రం వివాదాస్పదంగా మాట్లాడారు. బీఆర్ఎస్ పనితీరుకన్నా కాంగ్రెస్ పార్టీ అబద్ధాలనే ప్రజలు నమ్మారని కాంట్రవర్సీ కామెంట్స్ చేశారు. తాజాగా భువనగిరి పార్లమెంటు సన్నాహక సమావేశంలో దానికి భిన్నంగా ‘ప్రజలను తప్పుపట్టడం సరికాదు.. తెలంగాణ ఉద్యమకాలం నుంచీ గడిచిన రెండు అసెంబ్లీ ఎన్నికల్లో వారు పార్టీకి బ్రహ్మరథం పట్టారు. వారిని మరవొద్దు..’ అంటూ కామెంట్స్ చేయడంతో పార్టీ నేతలు ఆశ్చర్యానికి గురయ్యారు. వీటికి తోడు ‘జిల్లాకొకటి చొప్పున 32 మెడికల్ కాలేజీలో ఏర్పాటు చేయడం కన్నా కాంగ్రెస్‌లాగా అబద్ధపు ప్రచారానికి 32 యూట్యూబ్ చానెళ్లు పెట్టుకుని ఉంటే బాగుండేది’ అని వ్యాఖ్యానించడం కూడా వివాదాస్పదమైంది. దీనిపై సోషల్ మీడియాలో నెటిజన్లు భిన్నంగా స్పందించారు. కేటీఆర్‌ను ఒక ఆట ఆడుకున్నారు. మీ అహంకారమే ఓటమికి కారణమంటూ ఫైర్ అయ్యారు.

ప్రచారం చేసుకోలేకపోయాం

‘పరిపాలన మీద దృష్టి పెట్టి పార్టీని పట్టించుకోలేదు.. పదేండ్లలో చేసిన అభివృద్ధిని మార్కెట్ చేసుకోలేకపోయాం..’ అంటూ కేటీఆర్ కామెంట్ చేశారు. నిజానికి సంక్షేమ పథకాల విషయంలో ఇతర రాష్ట్రాల్లోనూ పబ్లిసిటీ కోసం రూ.కోట్లు ఖర్చు చేసిందని బీఆర్ఎస్‌పై ఇప్పటికీ విమర్శలు కంటిన్యూ అవుతున్నాయి. ఇక ఎన్నికల సమయంలో గంభీర ప్రకటనలు చేసిన కేటీఆర్.. ఓటమి తర్వాత మాత్రం వాటికి భిన్నమైన తీరులో రియాక్ట్ అవుతున్నారు. అధికారం పోయినా అహంకారం తగ్గలేదనే నిందను సైతం మొస్తున్నారు. చివరకు పార్టీ ఓటమికి తానే బాధ్యుడినని, ప్రజా వ్యతిరేకతను అంచనా వేయలేకపోయామని అందుకే ఓడిపోయామని అంగీకరించారు.

తొలుత..

- పార్టీల తేడా, పక్షపాతం లేకుండా సాగుభూమి ఉన్న రైతులందరికీ రైతుబంధు అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ

- చేసిన అభివృద్ధి, సంక్షేమంతోనే బీఆర్ఎస్ మరోసారి గెలుస్తుంది. ఎవరికి టికెట్ ఇచ్చినా గెలుపు ఖాయం

- పగుళ్ళకూ శ్లాబ్‌లకు మధ్య తేడా తెలియని జాతీయ పప్పు రాహుల్‌గాంధీ..

- బీఆర్ఎస్ పనితీరు కన్నా కాంగ్రెస్ పార్టీ అబద్ధాలనే ప్రజలు నమ్మారు

- దళితబంధు దళితుల ఆర్థిక బలోపేతానికి దోహదపడుతుంది. విపక్షాలు ఉద్దేశపూర్వకంగానే దాన్ని రాద్దాంతం చేస్తున్నాయి

- దేశంలో మరే ప్రాంతీయ పార్టీకి లేనంతగా 60 లక్షల మంది కార్యకర్తలు ఉన్నారు

తర్వాత

- భూస్వాములకూ రైతుబంధు ఇవ్వడం వల్లే ఎన్నికల్లో బీఆర్ఎస్‌కు ప్రతికూల ఫలితాలు వచ్చాయి

- సిట్టింగ్‌లను మారిస్తే గెలిచేవాళ్లం.. లోక్‌సభ ఎన్నికల్లో జాగ్రత్త పడతాం

- పెద్ద పెద్ద కన్‌స్ట్రక్షన్లు జరిగినప్పుడు చిన్న చిన్న లోపాలు సహజమే..

- ప్రజలను తప్పుపట్టడం సరైంది కాదు.. తెలంగాణ ఉద్యమకాలం మొదలు, గడిచిన రెండు అసెంబ్లీ ఎన్నికల్లో మనకు ప్రజలు బ్రహ్మరథం పట్టారు

- దళితబంధు కొంతమందికే ఇవ్వడం, ఎమ్మెల్యేల చేతివాటం వల్ల చాలా మంది వ్యతిరేకంగా మారారు

- పార్టీ నిర్మాణంపై ఫోకస్ పెట్టకపోవడంతో ఓడిపోయాం


Next Story

Most Viewed