ఆ 12 మందికి బీఆర్ఎస్ టికెట్ కన్ఫామ్!

by Disha Web Desk 12 |
ఆ 12 మందికి బీఆర్ఎస్ టికెట్ కన్ఫామ్!
X

దిశ, తెలంగాణ బ్యూరో: గతానికి భిన్నంగా బీఆర్ఎస్ పార్టీ రాబోయే ఎన్నికలకు ముందస్తుగా అభ్యర్థులను ప్రకటించేందుకు కసరత్తు చేస్తున్నది. వచ్చే నెల చివరి వారంలో లిస్టును విడుదల చేసే అవకాశం ఉంది విశ్వసనీయంగా తెలిసింది. కాగా, 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో సబితా ఇంద్రారెడ్డి (మహేశ్వరం), ఆత్రం సక్కు (ఆసిఫాబాద్), రేగా కాంతారావు (పినపాక), వనమా వెంకటేశ్వరరావు (కొత్తగూడెం), చిరుమర్తి లింగయ్య (నకిరేకల్), హరిప్రియ నాయక్ (ఇల్లెందు), పైలెట్ రోహిత్ రెడ్డి (తాండూరు), సుధీర్ రెడ్డి (ఎల్బీ నగర్), బీరం హర్షవర్ధన్ రెడ్డి (కొల్లాపూర్), జాజుల సురేందర్ రెడ్డి (ఎల్లారెడ్డి), గండ్ర వెంకటరమణా రెడ్డి (భూపాలపల్లి), కందాల ఉపేందర్ రెడ్డి (పాలేరు) కాంగ్రెస్ పార్టీ నుంచి విజయం సాధించారు. అనంతరం బీఆర్ఎస్ పార్టీలో చేరారు.

వీరి చేరికతో కాంగ్రెస్ పార్టీ శాసనసభ పక్షాన్ని సైతం బీఆర్ఎస్‌లో విలీనం చేశారు. ఆ సమయంలోనే మళ్లీ వీరికే టికెట్ ఇస్తామని పార్టీ అధినేత కేసీఆర్ హామీ ఇచ్చారు. ఆ హామీ మేరకు రాబోయే ఎన్నికల్లో ప్రకటించే లిస్టులో వీరి పేర్లను ఉంచనున్నట్లు తెలిసింది. టికెట్ పై సీఎం కేసీఆర్ నుంచి స్పష్టమైన హామీ లభించడంతో ఆ ఎమ్మెల్యేలు తమ తమ నియోజకవర్గాల్లో విస్తృతంగా పర్యటిస్తున్నారని, అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తున్నారని, ఓ సిట్టింగ్ ఎమ్మెల్యే తెలిపారు.

పెండింగ్ పనుల పూర్తికి నిధుల హామీ

బీఆర్ఎస్‌లో చేరిన 12మంది ఎమ్మెల్యేలకు నియోజకవర్గాల్లో అభివృద్ధి కోసం నిధుల హామీ లభించినట్లు తెలిసింది. స్పెషల్ ఫండ్‌తో పాటు పెండింగ్‌లో ఉన్న భవన నిర్మాణం, సీసీరోడ్లతో పాటు ఇతర పనులకు నిధులు ఇస్తామని ఆ ఎమ్మెల్యేలతో కేసీఆర్ చెప్పినట్లు సమాచారం. నియోజకవర్గంపైనే ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించినట్లు తెలిసింది. నిత్యం ప్రజల్లో ఉండాలని, ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమంపై ఫీడ్ బ్యాక్ తీసుకోవాలని సూచించినట్లు సమాచారం.

అసంతృప్తులకు ముందస్తుగా చెక్

మరోసారి బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుందని పార్టీ నేతలు భావిస్తున్నారు. దీంతో టికెట్లు ఆశించే వారి సంఖ్య కూడా ఎక్కువగానే ఉన్నది. ఎల్బీనగర్ నుంచి రాంమోహన్ గౌడ్, మహేశ్వరం నుంచి తీగల కృష్ణారెడ్డి, తాండూరులో ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి, నకిరేకల్ లో వేముల వీరేశం, ఆసిఫాబాద్ లో జడ్పీ చైర్ పర్సన్ కోవ లక్ష్మి, కొత్తగూడెంలో జలగం వెంకట్రావు, వనమా వెంకటేశ్వర్ రావు, గడల శ్రీనివాసరావు, ఇల్లందులో కోరం కనకయ్య, పాలేరులో తుమ్మల నాగేశ్వర్, భూపాలపల్లిలో ఎమ్మెల్సీ మధుసూదనాచారి ఇలా పలువురు రాబోయే ఎన్నికల్లో టికెట్ ను ఆశిస్తున్నారు. అయితే సిట్టింగ్ లకు టికెట్ ఇస్తామని కేసీఆర్ హామీ ఇవ్వడంతో వీరి ఆశలపై నీళ్లు చల్లినట్లయింది. అయినా వీరు చివరి నిమిషంలోనైనా టికెట్ వస్తుందనే ఆశతో ఎదురు చూస్తున్నారు.

Also Read..

హిందుత్వ కౌంటర్! కేసీఆర్ స్ట్రాటజీ ఇదేనా..?

Revanth Reddy: పోటీ చేసే స్థానం ఇదే.. సోదరుడు తిరుపతి రెడ్డి క్లారిటీ

Next Story