‘కేసీఆర్ చేసి చూపించారు’: రాజ్యసభలో వద్దిరాజు కీలక వ్యాఖ్యలు

by Gantepaka Srikanth |

ఉపాధి హామీ నిధుల వాటాను 90:10 నుండి 60:40కి తగ్గించడాన్ని బీఆర్ఎస్ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నదని రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర స్పష్టం చేశారు.

‘కేసీఆర్ చేసి చూపించారు’: రాజ్యసభలో వద్దిరాజు కీలక వ్యాఖ్యలు
X

దిశ, తెలంగాణ బ్యూరో: గ్రామీణాభివృద్ధికి ఈ ఏడాది బడ్జెట్‌లో సుమారు లక్షా 97 వేల కోట్ల రూపాయలను కేటాయించడం శుభపరిణామని.. ముఖ్యంగా ఉపాధి హామీ పథకాన్ని కొత్తగా వికసిత్ భారత్ గ్యారెంటీ పేరుతో మార్చి పని దినాలను 100 నుండి 125 రోజులకు పెంచడం సంతోషకరమని బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ డిప్యూటీ లీడర్, రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర చెప్పారు. గ్రామీణాభివృద్ధికి బడ్జెట్లో కేటాయించిన నిధుల గురించి రాజ్యసభలో మంగళవారం జరిగిన చర్చలో రవిచంద్ర పాల్గొని ప్రసంగించారు. పల్లెసీమల అభివృద్ధి, గ్రామీణుల ఆర్థిక భద్రతకు ఇది ఎంతగానో దోహదపడుతుందన్నారు. ఈ అభివృద్ధి నమూనాను తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో చేసి చూపించాచమన్నారు. ఉపాధి హామీ నిధుల వాటాను 90:10 నుండి 60:40కి తగ్గించడాన్ని బీఆర్ఎస్ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నదని స్పష్టం చేశారు. దీనివల్ల రాష్ట్రాలపై అదనపు ఆర్థిక భారం పడుతుందన్నారు. కేంద్ర ప్రభుత్వం హర్ ఘర్ జల్ గురించి ఆలోచించక ముందే తమ ప్రియతమ నాయకుడు కేసీఆర్ రూ.43 వేల కోట్లతో ప్రతి పల్లెకు, ప్రతి ఇంటికీ నల్లాల ద్వారా స్వచ్ఛమైన తాగునీరందించారని తెలిపారు. కేంద్రం ఇప్పుడు లక్షాధికారి దీదీల గురించి మాట్లాడుతున్నదని.. కానీ, తెలంగాణలో మహిళా సంఘాలు పదేళ్లుగా కోట్లాది రూపాయల వ్యాపారాలు చేస్తూ పల్లెల ఆర్థిక వ్యవస్థను నడుపుతున్నాయని చెప్పారు. భూ రికార్డుల డిజిటలైజేషన్ చేస్తున్నప్పుడు గ్రామీణ యువతకు ఈ సాంకేతికతపై శిక్షణ ఇస్తే బాగుంటుందని సూచించారు.

Next Story