దర్యాప్తు సంస్థల దుర్వినియోగ అంశంపై కేంద్రాన్ని నిలదీస్తాం: MP

by Disha Web Desk 2 |
దర్యాప్తు సంస్థల దుర్వినియోగ అంశంపై కేంద్రాన్ని నిలదీస్తాం: MP
X

దిశ, తెలంగాణ బ్యూరో: దర్యాప్తు సంస్థలను కేంద్ర ప్రభుత్వం దుర్వినియోగం చేస్తున్న తీరుపై సోమవారం నుంచి జరగనున్న సెకండ్ ఫేజ్ పార్లమెంటు బడ్జెట్ సమావేశాల్లో లేవనెత్తనున్నామని బీఆర్ఎస్ ఎంపీ కేశవరావు స్పష్టం చేశారు. రాజకీయ ప్రయోజనాలను ఆశించి ప్రతిపక్ష పార్టీలపైనే దాడులు, సోదాల పేరుతో కేంద్ర ప్రభుత్వం వీటిని ఉసిగొల్పుతున్నదన్నారు. ఢిల్లీలో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, కేంద్రంలో నరేంద్రమోడీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సుమారు 700 విపక్ష నేతలపై దాడులు జరిగాయని, కేసులు నమోదయ్యాయని గుర్తుచేశారు. తాజాగా బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను ఈడీ ఢిల్లీ లిక్కర్ స్కామ్ వ్యవహారంల ప్రశ్నించిందని, దీనికి ముందు ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాపై కూడా ఇదే జరిగిందని, విపక్ష పార్టీలన్నీ దీనిని ఖండించాయని ఆయన గుర్తుచేశారు.

తాజాగా బిహార్ డిప్యూటీ సీఎం తేజస్వి యాదవ్, మాజీ సీఎంలు లాలూప్రసాద్ యాదవ్, రబ్రీదేవి ఆస్తులపైనా దర్యాప్తు సంస్థలు విరుచుకుపడ్డాయని, పశ్చిమబెంగాల్ మంత్రిపైనా ఇలాంటి ఆరోపణలే చేశాయని, వీటిని కూడా విపక్ష పార్టీలు ఖండించాయని కేశవరావు పేర్కొన్నారు. వీటన్నింటిపై పార్లమెంటు వేదికగానే కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించాలనుకుంటున్నామని, దీనిపై ఇప్పటికే కొన్ని పార్టీలతో సంప్రదింపులు జరిగాయని, పటిష్టమైన వ్యూహాన్ని రూపొందించుకోనున్నట్లు తెలిపారు. బీజేపీ ప్రభుత్వం ఉన్నంతవరకూ దర్యాప్తు సంస్థల దుర్వినియోగం కొనసాగుతూనే ఉంటుందన్న ఆందోళనను ఆయన వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యబద్ధంగా దర్యాప్తు సంస్థలు విచారణ జరిపితే అభ్యంతరం లేదని, అలాంటి నిష్పాక్షికమైన దర్యాప్తు జరగాలనే తాము కోరుకుంటున్నామన్నారు.

కానీ మోడీ హయాంలో దురదృష్టవశాత్తూ రాజకీయ ప్రయోజనాలను ఆశించి విపక్ష పార్టీలపైకే వాటిని ఉసిగొల్పుతున్నదని, వేధింపులతో భయపెట్టాలని చూస్తున్నదని కేశవరావు ఆరోపించారు. దర్యాప్తు సంస్థల ఫంక్షనింగ్‌లోకి రాజకీయాలు జొరబడడం మంచి పద్ధతి కాదని, అది ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమైనదన్నారు.

Next Story

Most Viewed