కేటీఆర్, హరీశ్‌ రావు కృష్ణార్జుల లెక్క.. వారిని ఎవరూ విడదీయలేరు: MLC

by Gantepaka Srikanth |

సీఎం రేవంత్‌ రెడ్డికి పగటి కలల వ్యాధి సోకిందని.. అందుకే తప్పుడు ప్రచారం చేస్తున్నారని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్‌ కుమార్ అన్నారు.

కేటీఆర్, హరీశ్‌ రావు కృష్ణార్జుల లెక్క.. వారిని ఎవరూ విడదీయలేరు: MLC
X

దిశ, తెలంగాణ బ్యూరో: సీఎం రేవంత్‌ రెడ్డికి పగటి కలల వ్యాధి సోకిందని.. అందుకే తప్పుడు ప్రచారం చేస్తున్నారని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్‌ కుమార్ అన్నారు. సోషల్ మీడియా వేదికగా మాజీ మంత్రి హరీశ్‌పై రేవంత్‌రెడ్డి, కాంగ్రెస్ పార్టీ చేస్తున్న దుష్ర్పచారంపై గచ్చిబౌలి సీసీఎస్‌లో బీఆర్ఎస్ నేతలు సోమవారం ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రేవంత్ రెడ్డి ప్రభుత్వం బీటలు వారుతున్నదని అన్నారు. కాంగ్రెస్ నాయకులకు పోలీసులు తొత్తులుగా వ్యహరిస్తుండం దారుణమని.. తప్పుడు ప్రచారం చేస్తున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. బీఆర్ఎస్ రజతోత్సవ సభ జరిగిన నాటి నుంచి కాంగ్రెస్ నాయకులకు నిద్ర పట్టడం లేదన్నారు. కేసీఆర్ ప్రసంగించిన నాటి నుంచి రేవంత్‌రెడ్డికి, మంత్రులకు వణుకుడు మొదలైందని పేర్కొన్నారు. అందుకే బీఆర్ఎస్ పార్టీపై రేవంత్‌రెడ్డి అండ్ కంపెనీ కుట్రలు చేస్తున్నదని ఆరోపించారు. రేవంత్‌రెడ్డికి పనిచేయడం చేతగాదని.. వాగ్దానాలు నెరవేర్చే ఆలోచన లేదని అన్నారు.

అన్నివర్గాల ప్రజలు సతమతమవుతుంటే మొద్దు నిద్ర నటిస్తున్నారని ఆరోపించారు. బీఆర్ఎస్ మీటింగ్ అయిన రెండో రోజు నుంచి ప్రజా నాయకుడైన హరీశ్‌ రావు మీద పెద్ద ఎత్తున విమర్శలు చేస్తున్నారని.. ప్రజల తరఫున ప్రభుత్వాన్ని నిలదీస్తున్న ఆయనపై సోషల్ మీడియా వేదికగా కాంగ్రెస్ కుట్రలు చేస్తుండటం సిగ్గుమాలిన చర్య అని పేర్కొన్నారు. కేటీఆర్, హరీశ్‌ రావు కృష్ణార్జుల లెక్క అని.. వారిని ఎవరూ విడదీయలేరని పేర్కొన్నారు. రాముడికి హన్మంతుడు ఎట్లనో, కేసీఆర్‌కు హరీశ్‌ రావు అలానే అని చెప్పారు. ఫిర్యాదు చేసిన వారిలో మాజీ చైర్మన్లు ఎర్రోళ్ల శ్రీనివాస్, వై.సతీష్‌రెడ్డి తదితరులు ఉన్నారు.

Next Story