BRS ఎమ్మెల్యేల సరికొత్త వ్యూహం.. కేసీఆర్ నో చెబితే చేసేది ఇదే!

by Disha Web Desk 2 |
BRS ఎమ్మెల్యేల సరికొత్త వ్యూహం.. కేసీఆర్ నో చెబితే చేసేది ఇదే!
X

దిశ, తెలంగాణ బ్యూరో: సర్వేలపై ఆధారపడి టికెట్లను కేటాయించే కేసీఆర్ వ్యూహానికి తగినట్లుగా గులాబీ సిట్టింగ్ ఎమ్మెల్యేలు ప్రతివ్యూహం రచిస్తున్నారు. థర్డ్ పార్టీ ఏజెన్సీలతో కాంట్రాక్టు కుదుర్చుకొని సొంతంగా కూడా మరో సర్వే చేయిస్తున్నారు. పనితీరు బాగలేనివారికి టికెట్లు ఇవ్వడంపై ఆలోచిస్తామంటూ కేసీఆర్ ఇటీవల హింట్ ఇవ్వడంతో స్థానికంగా ఫీడ్ బ్యాక్ తెలుసుకోవడంపై ఎమ్మెల్యేలు ఫోకస్ పెట్టారు. కేసీఆర్ టికెట్ ఇవ్వొద్దనుకుంటే సర్వే రిపోర్టును సాకుగా చూపుతారని, దానికి దీటుగా సొంత సర్వే వివరాలతో సిద్దంగా ఉండాలని భావిస్తున్నారు. కేసీఆర్‌కు ఎదురు తిరిగేంత ధైర్యం వీరికి లేకపోయినా, సొంత సత్తా ఏ మేరకు ఉందో తెలుసుకుని సిద్ధంగా ఉండేందుకు ఈ బాట ఎంచుకున్నారు. కేసీఆర్ సర్వేల వ్యూహాన్ని అదే అస్త్రంతో ఢీకొట్టాలని భావిస్తున్నారు.

ఇంటెలిజెన్స్ ఆరా

ఎమ్మెల్యేల సొంత సర్వేలను సీఎం కేసీఆర్ తప్పు పట్టకపోయినా, దాని వెనక ఉద్దేశాన్ని తెలుసుకోవడం దృష్టి పెట్టారు. ఇందుకోసం ఇంటలిజెన్స్ ను రంగంలోకి దింపినట్లు తెలిసింది. పనితీరు మెరుగుపర్చుకునే ఉద్దేశంతో చేయించుకుంటే అభ్యంతరం లేదనే వాదన ఇంటెలిజెన్స్ వర్గాల నుంచి వ్యక్తమవుతున్నది. కానీ టికెట్ రాకపోతే తదుపరి స్టెప్ కోసం సర్వే చేయించుకుంటున్నారని తెలిస్తే దానికి తగినట్లుగా వ్యవహరించాలనేది కేసీఆర్ వ్యూహంగా కనిపిస్తున్నది. ఒకవేళ టికెట్ రాకపోతే ఈ సర్వే వివరాలను కేసీఆర్ ముందు వెల్లడించేంత సాహసం చేయకపోయినా, ప్రత్యామ్నాయంగా ఏ నిర్ణయం తీసుకోవాలనే అంశంపైనే ఎమ్మెల్యేలు ఎక్కువ ఆసక్తిగా ఉన్నారు.

ఆల్టర్నేట్ డిసిషన్ తీసుకోవడానికి..

సొంతంగా చేయించుకుంటున్న సర్వేల ద్వారా తమ లోపాలను చక్కదిద్దుకోవడంతోపాటు ఏ అభ్యర్థికి ప్రజల నుంచి ఎక్కువ మద్దతు లభిస్తున్నదోనని ఎమ్మెల్యేలు తెలుసుకుంటున్నారు. ఓడిపోతున్నట్లు తేలితే దానికి తగిన కారణాలపై విశ్లేషించి ఏ పార్టీలోకి వెళ్తే గెలిచే అవకాశాలు ఉంటాయో కూడా నిర్ణయం తీసుకోడానికి ఈ సర్వేలపై ఆధారపడుతున్నారు. కచ్చితంగా గెలుస్తామని వెల్లడైనట్లయితే కేసీఆర్ తన సొంత సర్వేను సాకుగా చూపి టికెట్ నిరాకరిస్తే తగిన ప్రత్యామ్నాయ నిర్ణయం తీసుకోవాలన్నది కూడా ఎమ్మెల్యేల ఆలోచన. స్వతంత్ర అభ్యర్థిగా నిలబడి సత్తా చాటుకోవడమా? లేక మరో పార్టీని ఆశ్రయించడమా? లేక పోటీ చేయకపోయినా అధికారిక అభ్యర్థిని ఓడించడమా?.. ఇలాంటి అభిప్రాయాలన్నీ పలువురు ఎమ్మెల్యేలు వ్యక్తం చేస్తున్నారు.

టికెట్టుపై ఆందోళన..

సిట్టింగ్‌లందరికీ టికెట్లు ఇస్తామని గతంలో ప్రకటించిన కేసీఆర్, పనితీరు బాగలేని ఎమ్మెల్యేల విషయంలో ఆలోచించాల్సి వస్తుందని హింట్ ఇచ్చారు. దీంతో ఎవరికి అవకాశాలు వస్తాయో, రావోననే ఆందోళన గులాబీ ఎమ్మెల్యేల్లో మొదలైంది. చివరి నిమిషం వరకూ కన్‌ఫ్యూజన్ తప్పదనే టెన్షన్‌లో ఉన్నారు. ముందుగానే మేల్కోవడం ఉత్తమమనే ఆలోచనకు అనుగుణంగా సర్వేల బాట పట్టారు. కొద్దిమంది ఎమ్మెల్యేల సర్వేలు ఇప్పటికే పూర్తయ్యాయి. కేటీఆర్ ఇటీవల జిల్లాల టూర్ సందర్భంగా కొద్దిమందికి టికెట్ ఖాయమంటూ పేర్లను ప్రకటించారు. నియోజకవర్గాల్లో పని చేసుకోండంటూ స్పష్టత ఇచ్చారు. దీంతో ఆశావహుల్లో సరికొత్త ఆందోళనకు తెరలేపినట్లయింది. భవిష్యత్తులో వీరికి టికెట్ రాకపోతే.. ‘ఆ రోజు పరిస్థితులు అలా ఉన్నాయి.. కానీ ఇప్పుడు సర్వేలలో ఓడిపోవడం ఖాయమంటూ తేలింది.. అందుకే టికెట్ ఇవ్వడంలేదు.’ అనే మాటలు వినిపిస్తాయనే అనుమానాన్నీ పలువురు ఎమ్మెల్యేలు వ్యక్తం చేశారు.

వీటన్నింటినీ బేరీజు వేసుకుని టికెట్ రానిపక్షంలో అధినేతను ముఖంమీదనే ప్రశ్నించేంత సాహసం లేకపోవడంతో ఇతర మార్గాలను రెడీ చేసుకోవడం శ్రేయస్కరమని భావిస్తున్నారు. ‘కేసీఆర్‌కు ఆయన చేయించుకుంటున్న సర్వే మీద ఎంత నమ్మకమున్నదో మేం చేయించుకుంటున్న సర్వేపైన మాకూ అంతే నమ్మకం ఉన్నది.’ అని ఓ ఎమ్మెల్యే వ్యాఖ్యానించారు. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రంలో సర్వేల జోరు పెరిగింది. ఎవరు ఎవరికి చేస్తున్నారో తెలియని గందరగోళంలో స్థానిక ప్రజలు కూడా ఆచితూచి సమాధానాలు చెప్తున్నారు. ఈ సర్వేలు ఎవరికి టికెట్ ఖరారు చేస్తాయో.. ఎవరికి ఎసరు పెడతాయో గులాబీ బాస్ నిర్ణయం తేల్చనున్నది.

Read more:

నెలాఖరులోపు రాష్ట్రంలో ఉండాలి.. మంత్రులు, ఎమ్మెల్యేలకు సీఎం ఆర్డర్!


Next Story

Most Viewed