కేసీఆర్ అసెంబ్లీకి వచ్చినరోజు రేవంత్ కుర్చీ ఖాళీ.. ఎమ్మెల్యే వివేకానంద కీలక వ్యాఖ్యలు

by GSrikanth |
కేసీఆర్ అసెంబ్లీకి వచ్చినరోజు రేవంత్ కుర్చీ ఖాళీ.. ఎమ్మెల్యే వివేకానంద కీలక వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద తీవ్ర విమర్శలు చేశారు. బుధవారం తెలంగాణ భవన్ వేదికగా ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కాంగ్రెస్ నేతలు ఎల్ఆర్ఎస్‌పై అధికారంలో లేనప్పుడు ఒకమాట.. అధికారంలోకి వచ్చాక ఒక మాట మాట్లాడుతున్నారని విమర్శించారు. ప్రభుత్వం కళ్లు తెరిచేలా బీఆర్ఎస్ ధర్నాలు చేసిందని అన్నారు. ఎల్ఆర్ఎస్ తీసుకొస్తున్న ప్రభుత్వం.. మ్యారేజ్ రెగ్యులేజేషన్ స్కీమ్ కూడా తీసుకు వస్తుందా? అని ప్రశ్నించారు. దీంతో కాంగ్రెస్ నిజ స్వరూపం బయటపడిందని కీలక వ్యాఖ్యలు చేశారు. ఉచితంగా క్రమబద్దీకరించాలని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇంకా ప్రతిపక్షంలో ఉన్నట్టు వ్యవహరిస్తున్నారని విమర్శించారు.

అధికారంలోకి వచ్చిన నాటి నుంచి బీఆర్ఎస్‌పై విమర్శలు చేస్తూ కాంగ్రెస్ నేతలు పైశాచికానందం పొందుతున్నారని అన్నారు. ప్రజా పాలనలో తీసుకున్న దరఖాస్తుల సంగతేంటని ప్రశ్నించారు. తమకు ధర్నాలు చేయాలనే తొందరేమీ లేదని.. ప్రభుత్వమే మేము ధర్నాలు చేసే పరిస్థితికి తీసుకు వచ్చిందని అన్నారు. రేవంత్ రెడ్డి తన పదవిని కాపాడుకునేందుకు ప్రధాని మోడీ ఆశీర్వాదం కోసం తాపత్రయ పడుతున్నారని కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రతిపక్ష నేత సమయం వచ్చినప్పుడు వస్తారని అన్నారు. ఆయన వస్తే రేవంత్ కుర్చీలోంచి ఎగిరిపోతాడని ఎద్దేవా చేశారు. ఆరు గ్యారంటీల అమలుపై వంద రోజుల తర్వాత శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

Next Story