వారిని ఉరితీసినా తప్పులేదు.. BRS నేత సంచలన వ్యాఖ్యలు

by Gantepaka Srikanth |

తెలంగాణ ప్రభుత్వం(TG Govt), పోలీస్ శాఖ(Police Department)పై బీఆర్ఎస్(BRS) నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్(RS Praveen Kumar) కీలక వ్యాఖ్యలు చేశారు.

వారిని ఉరితీసినా తప్పులేదు.. BRS నేత సంచలన వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ ప్రభుత్వం(TG Govt), పోలీస్ శాఖ(Police Department)పై బీఆర్ఎస్(BRS) నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్(RS Praveen Kumar) కీలక వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం ఆయన తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడారు. ఇవాళ సాధారణ దుస్తులు ధరించి ఓ పోలీస్ ఉన్నతాధికారి తెలంగాణ భవన్‌కు వచ్చారు. కొణతం దిలీప్‌(Konatham Dileep)కు నోటీసులు ఇచ్చేందుకు వచ్చానని చెప్పారు. హెచ్‌సీయూ కేసుకు సంబంధించి పోస్టు పెడితే నిర్మల్ నుంచి పోలీసులు వచ్చారు. క్రిశాంక్(Krishank) మీద కూడా కేసులు పెట్టారు. బీఆర్ఎస్ నేతల మీద కేసులు పెట్టి వేధించడానికే కాంగ్రెస్ పవర్‌ను వాడుకుంటుందా? అని ఆర్ఎస్పీ ప్రశ్నించారు. అక్రమ కేసులను ఖండిస్తున్నట్లు తెలిపారు. మహిళలకు రాష్ట్రంలో రక్షణ లేకుండా పోయిందని.. గత వారం రోజుల్లోనే నలుగురు మహిళలపై అత్యాచార ఘటనలు(Rape incidents) జరిగాయని అన్నారు. సికింద్రాబాద్ ఎమ్ఎమ్‌టీఎస్ ట్రైన్‌లో యువతిపై, సంగారెడ్డి కందిలో మహిళపై, నాగర్ కర్నూల్‌లో ఓ గుడి దగ్గర మహిళపై సామూహిక అత్యాచారం, మార్చి 31న జర్మనీ మహిళపై పహాడీ షరీఫ్‌లో అత్యాచారం జరిగింది. ఇన్ని అత్యాచారాలు జరగడం మామూలు విషయం కాదు.

హోంశాఖ మంత్రిగా రేవంత్ రెడ్డి(Revanth Reddy) నిర్లక్ష్యంగా ఉన్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో ఇంత మంది పోలీసులు ఉన్నా.. ఇన్ని అత్యాచారాలు జరగడం ఏమిటని అడిగారు. ఘోరమైన ఘటనలు జరుగుతున్నా రేవంత్ రెడ్డి వాటిపై కనీసం సమీక్షలు పెట్టడం లేదని మండిపడ్డారు. రోజూ కమాండ్ కంట్రోల్ సెంటర్‌కు వస్తున్న సీఎం శాంతి భద్రతలపై సమీక్ష పెట్టరా? అని అడిగారు. కేసీఆర్ హయాంలో పోలీస్ శాఖ నిత్యం అప్రమత్తంగా ఉండేదని గుర్తుచేశారు. అసలు మహిళా కమిషన్ ఏం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో దిశ కేసులో నిందితులను కేసీఆర్ కఠినంగా శిక్షించారని గుర్తుచేశారు. మొన్న వరుసగా చోటుచేసుకున్న నాలుగు అత్యాచార ఘటనలపై సమగ్ర విచారణ జరపాలని.. నిందితులను ఉరికంబం ఎక్కించినా తప్పులేదని అన్నారు. మాటలు చెబితే సరిపోదు.. మహిళలకు రక్షణ ఇవ్వాలని డిమాండ్ చేశారు.

Next Story