బిగ్ న్యూస్: కవిత ఇష్యూ డైవర్ట్ చేసేందుకు మాస్టర్ ప్లాన్.. విచారణ జరుగుతుండగానే నేతలకు ఫోన్ కాల్స్!

by Disha Web Desk 19 |
బిగ్ న్యూస్: కవిత ఇష్యూ డైవర్ట్ చేసేందుకు మాస్టర్ ప్లాన్.. విచారణ జరుగుతుండగానే నేతలకు ఫోన్ కాల్స్!
X

దిశ, తెలంగాణ బ్యూరో: బీఆర్ఎస్ నేతలు శనివారం బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్‌కు వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన ఆందోళనలు, దిష్టిబొమ్మల దహనాలు ప్లాన్ ప్రకారమే జరిగినట్టు ప్రచారం జరుగుతున్నది. శనివారం ఉదయం కవితను ఈడీ విచారణకు హజరయ్యే సమయంలోనే ప్రగతిభవన్ నుంచి మంత్రులు, పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, లీడర్లకు ఫోన్లు వెళ్లాయని, బండి సంజయ్‌కు వ్యతిరేకంగా నిరసనలు, ఆందోళనలు చేపట్టాలని ఆదేశాలు ఇచ్చినట్టు ప్రచారం జరుగుతున్నది.

దీంతో అప్పటి వరకు సైలెంట్‌గా ఉన్న బీఆర్ఎస్ నేతలు ఒక్కసారిగా రోడ్లపైకి వచ్చారు. బండి సంజయ్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఆయన దిష్టిబొమ్మలను తగులబెట్టారు. రెండు రోజుల క్రితం కవితను ఉద్దేశిస్తూ ‘అవినీతికి పాల్పడిన వ్యక్తులను అరెస్ట్ చేయకపోతే ముద్దుపెట్టుకుంటారా?’ అంటూ బండి సంజయ్ చేసిన కామెంట్స్‌ను తెరపైకి తీసుకొచ్చి ఆందోళనలు చేపట్టారు.

ఢిల్లీలో కవితను ఈడీ విచారిస్తున్నందుకే బీఆర్ఎస్ కావాలనే బీజేపీని టార్గెట్ చేసిందని పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అందులో భాగంగానే ముందుగా హైదరాబాద్‌లోని రాజ్‌భవన్‌లో బండి సంజయ్‌పై ఫిర్యాదు చేసేందుకు బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు వెళ్లారు. అక్కడ గవర్నర్ అపాయింట్‌మెంట్ లేకపోవడంతో అధికారులు వారిని లోనికి అనుమతించలేదు. దీంతో వారు అక్కడే బైఠాయించి ఆందోళన చేపట్టారు. అదే సమయంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు మొదలయ్యాయి.

బండి సంజయ్‌పై పోలీస్ స్టేషన్లలోనూ ఫిర్యాదులు చేశారు. కేసులు కూడా రిజస్టర్ అయ్యాయి. దీంతో బండి సంజయ్‌ను అరెస్టు చేస్తారా? అనే చర్చ సైతం సాగింది. ఇదిలా ఉండగా.. బండి సంజయ్ కామెంట్ చేసిన రెండు రోజులు గడిచినా స్పందించని బీఆర్ఎస్ నేతలు.. ఉన్నట్టుండి శనివారం రోడ్లపైకి వచ్చి ఆందోళనలు చేయడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఢిల్లీలో కవితను ఈడీ విచారిస్తున్నందుకు కౌంటర్‌గా బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ప్లాన్ ప్రకారమే ఆందోళనలు జరిగాయని పలువురు ఆరోపిస్తున్నారు.

Also Read: ఆమె కోసం సగం క్యాబినెట్ హస్తినకు పయనం.. CM ఆదేశాలతోనే..?


Next Story