ఫామ్‌హౌస్‌లో మంతనాలు..! కేసీఆర్‌తో బీఆర్ఎస్ నేతల భేటీ.. కవిత అంశంపై కూడా చర్చిస్తున్నారా?

by Ramesh Naini |   (  Updated:2025-08-03 13:32:12  IST  )

బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌ (KCR) వరుస భేటీలు నిర్వహిస్తున్నారు.

ఫామ్‌హౌస్‌లో మంతనాలు..! కేసీఆర్‌తో బీఆర్ఎస్ నేతల భేటీ.. కవిత అంశంపై కూడా చర్చిస్తున్నారా?
X

దిశ, డైనమిక్ బ్యూరో: బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌ (KCR) వరుస భేటీలు నిర్వహిస్తున్నారు. ఇవాళ మరోసారి ఎర్రవెల్లి ఫామ్ హౌస్‌లో కేసీఆర్‌ (BRS leaders) బీఆర్ఎస్ నేతలతో సమావేశం అయ్యారు. ఉమ్మడి మెదక్, కరీంనగర్, ఆదిలాబాద్, నల్గొండ, నిజామాబాద్ జిల్లా నాయకులతో మంతనాలు జరుపుతున్నారు. మీటింగ్‌లో హరీ‌శ్‌రావు, కేటీఆర్‌, సంజయ్‌, ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌ కుమార్‌, జగదీశ్ రెడ్డి, వేముల ప్రశాంత్‌రెడ్డి పాల్గొన్నట్లు తెలుస్తోంది. కాగా, ఈ భేటీలో తాజా రాజకీయ పరిణామాలు, పార్టీ పరిస్థితిపై చర్చిస్తున్నట్లు సమాచారం.

అయితే తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha) చేసిన సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఈ పరిణామాల నేపథ్యంలోనే కేసీఆర్‌తో ముఖ్య నేతల భేటీపై ప్రాధాన్యత ఏర్పడింది. మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డిపై ఎమ్మెల్సీ కవిత పరోక్షంగా లిల్లీపుట్ నాయకుడు అంటూ తీవ్ర విమర్శలు గుప్పించారు. కవిత వ్యాఖ్యలపై మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి స్పందించారు. 'నా ఉద్యమ ప్రస్థానానికి సంబంధించి కవితమ్మకు ఉన్న జ్ఞానానికి నా జోహార్లు... కేసీఆర్ శత్రువులైన రేవంత్, రాధాకృష్ణలు నా గురించి మాట్లాడిన మాటల్ని మరొక్కసారి వల్లే వేసేందుకు ఆమె చేసిన ప్రయత్నానికి నా సానుభూతిని తెలియజేస్తున్న' అంటూ ఆయన ట్వీట్ చేశారు. అయితే, కవిత అంశాలపై ఈ సమావేశంలో చర్చిస్తున్నట్లు పొలిటికల్ సర్కిల్లో హాట్ టాపిక్‌గా మారింది.

అలాగే కాళేశ్వరం కమిషన్ చైర్మన్ జస్టిస్ పీసీ ఘోష్ ప్రభుత్వానికి నివేదిక అందజేయడం, రేపు కాళేశ్వరం ప్రాజెక్టుపై కమిషన్ నివేదిక వచ్చాక ఏం చేయాలన్న దానిపై సమాలోచనలు చేస్తున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. బీసీ రిజర్వేషన్ల విషయంలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్న నేపథ్యంలో ఈ భేటీలో చర్చించే అవకాశం ఉంది. అలాగే స్థానిక సంస్థల ఎన్నికలపై కేసీఆర్ దిశానిర్దేశం చేసినట్లు సమాచారం. అదేవిధంగా ఈ నెల 8వ తేదీన కరీంనగర్‌లో బీఆర్ఎస్ నిర్వహించ తలపెట్టిన బీసీ సభలో కూడా ఈ భేటీలో చర్చిస్తున్నట్లు తెలుస్తోంది.

Next Story