బీఆర్ఎస్ నేతలు ప్రజలను తప్పుదోవపట్టిస్తుండ్రు.. ఎంపీ చామల కిరణ్‌కుమార్ రెడ్డి

by Kema Shiva Kumar |

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ నేతలిద్దరూ ఊసరవెల్లులను మించిన మాటలు మారుస్తున్నారని కాంగ్రెస్​ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి మండిపడ్డారు.

బీఆర్ఎస్ నేతలు ప్రజలను తప్పుదోవపట్టిస్తుండ్రు.. ఎంపీ చామల కిరణ్‌కుమార్ రెడ్డి
X

దిశ, తెలంగాణ బ్యూరో: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ నేతలిద్దరూ ఊసరవెల్లులను మించిన మాటలు మారుస్తున్నారని కాంగ్రెస్​ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి మండిపడ్డారు. అచ్చోసిన అంబోతుల్లా తిరుగుతూ డిపాజిట్లు గల్లంతువుతాయన్న భయంతో ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆయన విమర్శలు గుప్పించారు. వారి పట్ల నియోజకవర్గ ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. మంగళవారం గాంధీ‌భవన్​నిర్వహించిన మీడియా సమావేశంలో చామల కిరణ్​ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. కేసీఆర్​హాయాంలో పదేళ్లూ ఉద్యోగాలు ఇవ్వకుండా.. ఇంట్లో వాళ్లందరూ పదవులు పొంది రాష్ట్రాన్ని దోచుకున్న వాళ్లదే దండుపాళ్యం ముఠా అని ఆయన మండిపడ్డారు. వారి పాలనను తట్టుకోలేకనే కంటోన్మెంట్‌లో మూడో స్థానం, ఎంపీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి గుండుసున్నా సీట్లు ఇచ్చారని ఆయన విమర్శలు గుప్పించారు.

2023 అసెంబ్లీ ఎన్నికల్లో వీరి పాలన తట్టుకోలేక ఫాంహౌస్‌‌కు పరిమితం చేశారని, ఎన్నికలు దృష్టిలో పెట్టుకునే ప్రజల్లోకి వస్తుంటారని మండిపడ్డారు. ఓట్ల కోసం చంద్రబాబు పేరు తీసుకుంటున్నారని, ఈ డ్రామాలు ప్రజలు గమనిస్తున్నారని ఆయన తెలిపారు. తమ పార్టీ అభ్యర్థి నవీన్‌యాదవ్​నామినేషన్లు వేస్తే వారికి భయం పట్టుకుందని, వచ్చిన జనాన్ని చూసి బీఆర్ఎస్‌కు దడ పట్టుకొస్తుందని కామెంట్ చేశారు. బీఆర్ఎస్‌కు విజయంపై నమ్మకం లేకనే విష్ణువర్ధన్​రెడ్డితో నామినేషన్​వేయించారని, అభ్యర్ధి ఎవరో తెలియని అయోమయంలో ఉన్నారని చామల కిరణ్ కుమార్​రెడ్డి ఎద్దేవా చేశారు. వేరే పార్టీ నుంచి గెలిచిన తలసాని, సబితా ఇంద్రారెడ్డిలను మంత్రివర్గంలోకి తీసుకున్న వారు ఇప్పుడు దానం నాగేందర్‌పై మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఆయన అంశం స్పీకర్ చూసుకుంటారని అన్నారు. ఇతర ప్రాంతాల నుంచి ప్రజలు తీసుకొచ్చి జూబ్లీహిల్స్‌లో తిప్పుతున్నారని, ప్రజలు వారి అబద్ధాలను గ్రహించాలని ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి పిలుపునిచ్చారు.

Next Story