రేవంత్, పొంగులేటి అడ్డాకూలీలుగా మారండి: బీఆర్ఎస్ నేత ఫైర్

by Gantepaka Srikanth |

సీఎం రేవంత్‌రెడ్డి, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి న్యాయబద్ధంగా డబ్బు సంపాదించాలని.. భూ కబ్జా చేయడం ద్వారా కాదని.. అవసరమైతే ఎల్‌బీ నగర్ చౌరస్తా, బోడుప్పల్ చౌరస్తా వద్ద అడ్డా కూలీలుగా పని చేసి, లేదంటే షాపింగ్ మాల్స్‌లో సేల్స్‌మెన్‌గా పనిచేసి సంపాదించుకోవాలని బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ అన్నారు.

రేవంత్, పొంగులేటి అడ్డాకూలీలుగా మారండి: బీఆర్ఎస్ నేత ఫైర్
X

దిశ, తెలంగాణ బ్యూరో: సీఎం రేవంత్‌రెడ్డి, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి న్యాయబద్ధంగా డబ్బు సంపాదించాలని.. భూ కబ్జా చేయడం ద్వారా కాదని.. అవసరమైతే ఎల్‌బీ నగర్ చౌరస్తా, బోడుప్పల్ చౌరస్తా వద్ద అడ్డా కూలీలుగా పని చేసి, లేదంటే షాపింగ్ మాల్స్‌లో సేల్స్‌మెన్‌గా పనిచేసి సంపాదించుకోవాలని బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ అన్నారు. మంగళవారం తెలంగాణ భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర ప్రజల ఆస్తిని దోచుకుంటే ఊరుకునేది లేదని హెచ్చరించారు. రాష్ట్ర హైకోర్టు, భారత సుప్రీంకోర్టు, భూ సంస్కరణల చట్టాన్ని ఉల్లంఘిస్తూ భూ కబ్జాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. నాదర్‌గుల్‌లో 374 ఎకరాలు ప్రభుత్వ భూమేనని హైకోర్టు చెప్పినప్పటికీ వినకుండా దౌర్జన్యంగా అధికారులను బెదిరించి భూ కబ్జా చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

రంగారెడ్డి జిల్లా కలెక్టర్, ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనర్, ఆర్డీవో, ఆదిబట్ల ఇన్‌స్పెక్టర్ ఎందుకు మౌనంగా ఉన్నారని నిలదీశారు. ప్రభుత్వ భూమిలో అక్రమంగా ఫెన్సింగ్ వేసి కబ్జాకు పాల్పడుతుంటే, పోలీసులు ఎస్ఓపి సెక్షన్ 30 ప్రకారం సుమోటో కేసుగా నమోదు చేసి ఎందుకు అరెస్ట్ చేయడం లేదని ప్రశ్నించారు. పొంగులేటి కుమారుడు హర్షరెడ్డి డైరెక్టర్‌గా ఉన్న కంపెనీ భూ కబ్జాకు పాల్పడుతుంటే పోలీసులు అధికారులు ఎందుకు పట్టించుకోవడం లేదని అన్నారు. నాదర్‌గుల్‌లో ప్రభుత్వం లాక్కోవాలని చూస్తున్న రూ.7 వేల కోట్లు ప్రజల కోసం ఉపయోగిస్తే ప్రజలకు 1,32,000 డబుల్ బెడ్ రూం ఇళ్లు నిర్మించవచ్చని.. 9 లక్షల రైతులకు రుణమాఫీ చేయవచ్చని, నియోజకవర్గానికో ఏఐ సెంటర్ ఏర్పాటు చేయొచ్చని అన్నారు.

Next Story