CM రేవంత్, రాహుల్, అక్బరుద్దీన్ మీద అట్రాసిటీ కేసు పెట్టాలి.. BRS నేత డిమాండ్

by Gantepaka Srikanth |

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy)పై బీఆర్ఎస్ కీలక నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్(RS Praveen Kumar) సంచలన వ్యాఖ్యలు చేశారు.

CM రేవంత్, రాహుల్, అక్బరుద్దీన్ మీద అట్రాసిటీ కేసు పెట్టాలి.. BRS నేత డిమాండ్
X

దిశ, వెబ్‌డెస్క్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy)పై బీఆర్ఎస్ కీలక నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్(RS Praveen Kumar) సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా పోస్టు పెట్టారు. లీకేజీ కుంభకోణం నుండి తప్పించుకోవడం కోసం రేవంత్ రెడ్డి మళ్లీ అలవాటు ప్రకారం అడ్డదారులు తొక్కుతున్నారని విమర్శించారు. అందులో భాగంగానే కేటీఆర్‌పై ఫేక్ అట్రాసిటీ కేసు పెట్టించారని అన్నారు. దళిత-గిరిజన వర్గాల పక్షాన పోరాడుతున్న కేటీఆర్‌(KTR)పై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టాలా? లేక ఎస్సీ, ఎస్టీలను నట్టేట ముంచిన రేవంత్ రెడ్డి మీద పెట్టాలా? అనేది ఆయనే ఒకసారి సీరియస్‌గా ఆలోచించుకోవాలని సూచించారు.


పదో తరగతి ప్రశ్నా పత్రాల లీకేజీని ప్రశ్నిస్తే కేసులు పెడతారా? లీకేజీ మాఫీయాకు - కాంగ్రెస్ నాయకులకు ఉన్న సంబంధాలను ప్రజలకు చెప్పడమే కేటీఆర్ చేసిన నేరమా? అని ప్రశ్నించారు. కులాన్ని దూషించడానికి అసలు.. ఆ నిందితుల కులం ఏంటో కేటీఆర్‌కు ఎలా తెలుస్తుందని అడిగారు. సచివాలయానికి అంబేద్కర్ పేరు, 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం, దళితబంధు పథకం, దళిత-గిరిజనుల కోసం వందలాది గురుకుల పాఠశాలలు డిగ్రీ కళాశాలలు, దళిత -గిరిజన విద్యార్థులకు కోడింగ్ భాష నేర్పించి విదేశాలకు పంపినందుకా? కేటీఆర్‌పై అట్రాసిటీ కేసు(SC, ST Atrocity Case) పెట్టిందని మండిపడ్డారు.

80 మంది గురుకుల విద్యార్థుల ప్రాణాలు తీసినందుకు రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై అట్రాసిటీ కేసు పెట్టాలి. ఎస్సీ సబ్ ప్లాన్ నిధులు విడుదల చేయకుండా, పక్కదారి పట్టించినందుకు కేసు నమోదు చేయాలి. దేవుడి సాక్షిగా యాదాద్రి ఆలయంలో ఉప ముఖ్యమంత్రిని అవమానించిన రేవంత్ రెడ్డిపై కేసు నమోదు చేయాలి. అసెంబ్లీ స్పీకర్‌ను దళితుడు అని సంభోదించి ఆయనను అవమానించినందుకు కేసు పెట్టాలి. చేవెళ్ల, ఇంద్రవెల్లి సాక్షిగా దళితులు, గిరిజనులను పట్టపగలే మోసం చేసినందుకు రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి‌పై కేసు పెట్టాలి. లగచర్ల గిరిజనుల భూములు అక్రమంగా కబ్జా చేసినందుకు రేవంత్ రెడ్డి తిరుపతి రెడ్డిపై అట్రాసిటీ కేసు పెట్టాలి. గ్రూప్ 1, గ్రూప్ 2లో వర్గీకరణ అమలు చేస్తానని అసెంబ్లీలో మాటిచ్చి మోసం చేసినందుకు కేసు పెట్టాలి. మందకృష్ణ మాదిగ లక్ష డప్పుల ప్రోగ్రాంకు అనుమతి నిరాకరిచినందుకు కేసు పెట్టాలి. ఎమ్మెల్యే వేముల వీరేశం అసెంబ్లీలో ఇచ్చిన స్వీట్‌ను పబ్లిక్‌గా నిరాకరించి, తన ఎంగిలి చేతిని షర్ట్‌కు పూసి ఆయనను అవమానించినందుకు రేవంత్‌పై కేసు పెట్టాలి. ఒక ఆదివాసీ వర్గానికి చెందిన మహిళ అయిన సీతక్కను అసెంబ్లీ సాక్షిగా ఇంగ్లీష్ మరియు హిందీ రాదని అవమానించిన అక్బరుద్దీన్ ఒవైసీ మీద కూడా అట్రాసిటీ కేసు పెట్టాలని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ డిమాండ్ చేశారు.

సీఎం రేవంత్ రెడ్డి ముమ్మాటికీ అసమర్థుడే అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. విద్యాశాఖ మంత్రిగా కొనసాగుతూ కనీసం పరీక్షలు కూడా సరిగా నిర్వహించడం చేతకావడం లేదని ఎద్దేవా చేశారు. పరీక్షల నిర్వహణలో పోలీసు యంత్రాంగం భద్రత కల్పించడంలో విఫలం అయిందని తెలిపారు. పోలీసులు, అధికారులు, ఇన్విజిలేటర్లు అందరూ ఉండగా నిందితుడు పరీక్ష కేంద్రంలోకి ఎలా వెళ్లాడు? అని ప్రశ్నించారు. అతనికి సహకరించినవారు ఎవరు? నిందితుని వెనుక ఉన్నదెవరు? తెలియాలని అనుమానం వ్యక్తం చేశారు.

Next Story