రెండు చోట్ల నుంచి కేసీఆర్ పోటీ.. హరీష్ రావు కీలక వ్యాఖ్యలు

by Disha Web Desk 4 |
రెండు చోట్ల నుంచి కేసీఆర్ పోటీ.. హరీష్ రావు కీలక వ్యాఖ్యలు
X

దిశ, మనోహరాబాద్ : సీఎం కేసీఆర్ నేతృత్వంలో మూడవసారి బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారం చేపడుతుందని రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు తెలిపారు. మంగళవారం మెదక్ వెళ్తున్న మంత్రి హరీష్ రావు, ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డిలు మనోహరాబాద్ గెస్ట్ హౌస్‌కు చేరుకున్నారు. స్థానిక ప్రజా ప్రతినిధులు, నాయకులతో కలిసి ఆయన మాట్లాడారు. బుధవారం మెదక్ పట్టణంలో జరిగే సీఎం కేసీఆర్ సభకు మండలం నుండి దాదాపు 5వేల మందికి పైగా జనాలను సమీకరించి తరలించాలని నాయకులకు సూచించారు. పార్టీకి వ్యతిరేకంగా విమర్శించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గజ్వేల్, కామారెడ్డి నియోజకవర్గాలలో సీఎం కేసీఆర్ ఎమ్మెల్యేగా భారీ మెజార్టీతో గెలుపొందడం ఖాయమన్నారు. దుబ్బాకలో కొత్త ప్రభాకర్ రెడ్డి ఎమ్మెల్యేగా గెలుపు ఖాయమన్నారు.

మంత్రి సమక్షంలో చేరికలు..

మంత్రి హరీష్ రావు సమక్షంలో మండలంలోని పలు గ్రామాలకు చెందిన బీజేపీ కార్యకర్తలు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. వారికి గులాబీ కండువాలను కప్పి మంత్రి పార్టీలోకి చేర్చుకున్నారు. పార్టీలో కష్టపడి పని చేసే వారికి ముందు ముందు మంచి భవిష్యత్తు ఉంటుందని ఈ అవకాశాలను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకొని పార్టీ అభివృద్ధికి పాటుపడాలని మంత్రి సూచించారు. ఈ కార్యక్రమంలో మనోహరాబాద్ మండల ఇన్చార్జి కొట్టాల యాదగిరి, మండల పార్టీ అధ్యక్షుడు పురం మహేష్ ముదిరాజ్, తూప్రాన్ మున్సిపల్ చైర్మన్ బొంది రవీందర్ గౌడ్, వైస్ ఎంపీపీ విట్టల్ రెడ్డి, ఆయా గ్రామాల సర్పంచులు పూల అర్జున్, నాగభూషణం, నాయకులు ర్యాకల శేఖర్ గౌడ్, చంద్రశేఖర్ ముదిరాజ్ , ప్రభాకర్ రెడ్డి, బిక్షపతి ముదిరాజ్ , కూచారం నరేష్ ముదిరాజ్ తదితరులు పాల్గొన్నారు.


Next Story

Most Viewed