బిగ్ న్యూస్: బీఆర్ఎస్‌కు భారీ షాక్.. గులాబీ బాస్‌ను ఊహించని దెబ్బ కొట్టిన ‘‘టీచర్స్’’!

by Disha Web Desk 19 |
బిగ్ న్యూస్: బీఆర్ఎస్‌కు భారీ షాక్.. గులాబీ బాస్‌ను ఊహించని దెబ్బ కొట్టిన ‘‘టీచర్స్’’!
X

దిశ, తెలంగాణ బ్యూరో: ఉమ్మడి హైదరాబాద్- రంగారెడ్డి- మహబూబ్ నగర్ టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రభుత్వానికి ఉపాధ్యాయులు బిగ్ షాక్ ఇచ్చారు. బీజేపీ బలపరిచిన ఏవీఎన్ రెడ్డిని గెలిపించారు. ఉపాధ్యాయులు ప్రభుత్వంపై తమ వ్యతిరేకతను చాటారు. బీఆర్ఎస్ ప్రభుత్వానికి పీఆర్టీయూ మొదటినుంచి అనుబంధంగా ఉంది. ప్రభుత్వం ఏ కార్యక్రమం చేపట్టిన మద్దతు పలుకుతుంది. అయితే ఉమ్మడి హైదరాబాద్- రంగారెడ్డి- మహబూబ్ నగర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పీఆర్టీయూకు ఉపాధ్యాయులు షాక్ ఇచ్చారు. ఈ ఏడాది ఎన్నికల సంవత్సరం కావడంతో బీఆర్ఎస్ ఇది గట్టి ఎదురుదెబ్బ తగిలినట్లు అయింది.

రాష్ట్రంలో ఏ ఎన్నికలు జరిగినా బీఆర్ఎస్ విజయం సాధిస్తుందని.. అన్ని వర్గాల ప్రజలు, ఉద్యోగ ఉపాధ్యాయ యువత అండగా ఉంటుందని ఆ పార్టీ నేతలు పదేపదే పేర్కొంటున్నారు. అయితే ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలు రాబోయే అసెంబ్లీ ఎన్నికలకు నాంది కానున్నాయి. ఈ ఎన్నికలు ప్రతిష్టాత్మకంగా మారిన నేపథ్యంలో ఉమ్మడి హైదరాబాద్- రంగారెడ్డి- మహబూబ్ నగర్ జిల్లా ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఉపాధ్యాయులు బీఆర్ఎస్ ప్రభుత్వానికి, ఇటు పీఆర్టీయూకు గట్టి షాక్ ఇచ్చారు. ఊహించని విధంగా బీజేపీ బలపరిచిన ఏవీఎన్ రెడ్డిని 1150 ఓట్లతో గెలిపించారు. మొదటి నుంచి పీఆర్టీయూ గెలుస్తుందని ఆ సంఘం నేతలు ధీమా వ్యక్తం చేసినప్పటికీ ఉపాధ్యాయులు మాత్రం భిన్నమైన తీర్పునిచ్చారు. ప్రభుత్వంపై వ్యతిరేకతను చాటారు.

సిట్టింగ్ సీటును కోల్పోయిన పీఆర్టీయూ..

గత ఎన్నికల్లో పీఆర్టీయూ ఈ స్థానంలో విజయం సాధించింది. పీఆర్టీయూ అభ్యర్థిగా కాటేపల్లి జనార్దన్ రెడ్డి పోటీ చేసి ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. అయితే ఆయనకు రెండోసారి అవకాశం కల్పించలేదు. దీంతో జనార్దన్ రెడ్డి పీఆర్టీయూ సంఘం నుంచి విడిపోయి స్వతంత్రంగా పోటీ చేశారు. ఆయన సిట్టింగ్ ఎమ్మెల్సీ అయినప్పటికీ ఉనికి చాట లేకపోయారు. పీఆర్టీయూ నుంచి చెన్నకేశవరెడ్డి పోటీ చేసినప్పటికీ చివరి వరకు గట్టి పోటీ ఇచ్చారు. నువ్వా నేనా అన్నట్లు సాగిన పోరులో చివరికి బీజేపీ అభ్యర్థినే విజయం వరించింది.

20 గంటల పాటు కొనసాగిన ఎమ్మెల్సీ కౌంటింగ్..

ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల ఓటింగ్ ఈనెల 13న జరిగింది. మొత్తం 29 వేల ఓట్లకు గాను 25868 ఓట్లు పోలయ్యాయి. ఇందులో452 ఓట్లు చల్లని ఓట్లు. 25416 చెల్లిన ఓట్స్ కాగా, మొదటి ప్రాధాన్యత ఓట్లలో ఎవరికి స్పష్టమైన మెజార్టీ రాకపోవడంతో నాలుగవ ప్రాధాన్యం వరకు ఓట్లు లెక్కించాల్సి వచ్చింది. చివరి వరకు ఓట్ల లెక్కింపు ఉత్కంఠ గా కొనసాగింది. మొదటినుంచి బీజేపీ బలపరిచిన ఏవీఎన్ రెడ్డి మెజార్టీ కొనసాగుతున్నప్పటికీ కొంత ఆసక్తి నెలకొంది. పీఆర్టీయూ అభ్యర్థి చెన్న కేశవరెడ్డిపై 1150 ఓట్లతో విజయం సాధించారు. మూడవ స్థానంలో టీఎస్ యూటీఎఫ్ అభ్యర్థి మాణిక్ రెడ్డి నిలిచారు. ఆయనకు 6079 ఓట్లు వచ్చాయి.

ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకత పీఆర్టీయూ అభ్యర్థి చెన్నకేశవరెడ్డి ఓటమికి కారణమైందని ఉపాధ్యాయులు పేర్కొంటున్నారు. ముఖ్యంగా 317 జీవో గుదిబండగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. అదేవిధంగా ఉపాధ్యాయులకు ఇచ్చిన హామీలు, పే స్కేల్, ప్రమోషన్స్, పెంచిన వేతనాలు, పాత పెన్షన్ విధానం అమలు, తదితరు అంశాలు ప్రభుత్వంపై ఉపాధ్యాయులను వ్యతిరేకత కారణమైంది. వాటిపై నాన్చుడు ధోరణి అవలంబిస్తుండడంతో రోజురోజుకు ఆగ్రహం మరింత ఎక్కువ అవుతుంది. గతంలోనే జరిగిన ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రభుత్వానికి గట్టి షాక్ ఇచ్చారు. మొదటినుంచి ప్రభుత్వానికి పీఆర్టీయూ అండగా ఉండడంతో ఆ అభ్యర్థిని ఓడించాలని లక్ష్యంతో బీజేపీకి పట్టం కట్టినట్లు స్పష్టమవుతుంది. అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఉపాధ్యాయులు ఇచ్చిన తీర్పు అధికార బీఆర్ఎస్ పార్టీకి గుదిబండగా మారింది.

Next Story

Most Viewed