BRS VS Congress: కేటీఆర్ ఆరోపణలు ఐసీఐసీఐ స్ట్రాంగ్ రిప్లయ్.. బీఆర్ఎస్, కాంగ్రెస్ ‘సోషల్’ వార్

by Prasad Jukanti |   (  Updated:2025-04-12 10:08:42  IST  )

కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారంలో బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య సోషల్ వార్ నడుస్తోంది.

BRS VS Congress: కేటీఆర్ ఆరోపణలు  ఐసీఐసీఐ  స్ట్రాంగ్ రిప్లయ్.. బీఆర్ఎస్, కాంగ్రెస్ ‘సోషల్’ వార్
X

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ రాజకీయాల్లో హెచ్‌సీయూకు (HCU) సమీపంలో ఉన్న కంచ గచ్చిబౌలిలోని 400 ఎకరాల భూముల (Kancha Gachibowli Lands) వ్యవహారం కాక రేపుతోంది. ఈ భూముల్లో రూ.10వేల కోట్ల కుంభకోణం జరిగిందని, ఎలాంటి యాజమాన్య హక్కు లేనప్పటికీ ఈ భూమిని ఐసీఐసీఐ బ్యాంక్ (ICICI Bank) వద్ద టీజీఐఐసీ తనఖా పెట్టి రూ.10వేల కోట్ల రుణం తీసుకున్నట్లు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిన్న ఆరోపించిన సంగతి తెలిసిందే. అయితే ఆ ఆరోపణలను ఐసీఐసీఐ బ్యాంక్ ఖండించింది. టీజీఐఐసీకి తాకట్టు రుణం తాము మంజూరు చేయలేదని ఆ బ్యాంకు ప్రతినిధి నిన్న ఓ ప్రకటనలో స్పష్టం చేశారు. దీంతో అసలు ఐసీఐసీఐ బ్యాంకు నుంచి వచ్చిన స్టేట్‌మెంట్ ఫేక్ అని బీఆర్ఎస్ సానుభూతిపరులు సోషల్ మీడియాలో విమర్శలు గుప్పిస్తున్నారు. కాగా కేటీఆర్‌వి అన్నీ డ్రామాలేనని ఐసీఐసీఐ బ్యాంక్ తేల్చేసిందని కాంగ్రెస్ మద్దతుదారులు రివర్స్ కౌంటర్లు ఇస్తున్నారు. దీంతో కంచ గచ్చిబౌలి భూములపై రాజకీయం ఇప్పుడు బ్యాంక్‌ స్టేట్‌మెంట్ చుట్టూ తిరుగుతోంది.

ప్రభుత్వం కవర్ డ్రైవ్ : బీఆర్ఎస్

కేటీఆర్ ప్రెస్‌మీట్ అనంతరం ఆయన చేసిన ఆరోపణలపై ఐసీఐసీఐ బ్యాంక్ ఓ స్టేట్‌మెంట్ రిలీజ్ చేసింది. ‘మేము టీజీఐఐసీకి ఎలాంటి మార్టిగేజ్ రుణం అందించలేదు. అలాగే ఈ బాండ్ల జారీకి సంబంధించి టీజీఐఐసీ మా వద్ద ఎలాంటి స్థలాన్ని మార్టిగేజ్ చేయలేదు. మేము కేవలం బాండ్ల జారీ ద్వారా వచ్చే నిధుల స్వీకరణ, వడ్డీ చెల్లింపునకు సంబంధించి టీజీఐఐసీకి అకౌంట్ బ్యాంకుగా మాత్రమే వ్యవహరిస్తాం’ అని స్పష్టం చేసింది. అయితే బీఆర్ఎస్ (BRS) సానుభూతిపరులు మాత్రం ఇది ఫేక్ స్టేట్‌మెంట్ అంటూ నెట్టింట కామెంట్స్ చేస్తున్నారు. ఆ లెటర్ బ్యాంక్ అధికారిక వెబ్‌సైట్‌లో లేదని, పైగా దానిపైన కన్సర్న్డ్ ఆఫీసర్ సంతకం లేదని ఆరోపిస్తున్నారు. ఈ విషయంలో ప్రభుత్వం తప్పించుకునేందుకు ఇలాంటి కవర్ డ్రైవ్ చేస్తోందని విమర్శిస్తున్నారు.

కేటీఆర్ అత్యుత్సాహానికి బ్రేక్ : కాంగ్రెస్

బ్యాంక్ స్టేట్‌మెంట్‌ను బీఆర్ఎస్ మద్దతుదారులు తప్పుబడుతున్న నేపథ్యంలో ఓ జర్నలిస్టు స్పందించారు. ఈ స్టేట్‌మెంట్‌ బ్యాంక్ నుంచి అధికారికంగా వచ్చిందేనని ప్రధాన పత్రికలు ఇవాళ ప్రచురించాయని సోషల్ మీడియాలో పేర్కొన్నారు. ఇక బీఆర్ఎస్ చేస్తున్న విమర్శలపై కాంగ్రెస్ శ్రేణులు రియాక్ట్ అవుతూ కేటీఆర్ అత్యుత్సాహానికి ఐసీఐసీఐ బ్యాంక్ కళ్లెం వేసిందని రివర్స్ అటాక్ చేస్తున్నారు. దీంతో ఇరు వర్గాల మధ్య నువ్వానేనా అన్నట్లుగా రాజకీయం రంజుగా మారింది.

శ్వేతపత్రం విడుదల చేయండి : హరీశ్‌రావు

ఐసీఐసీఐ బ్యాంక్ ప్రకటనపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు (Harish Rao) స్పందించారు. అసెంబ్లీలో తాను అడిగిన ప్రశ్నకు టీజీఐఐసీ ద్వారా 400 ఎకరాలు తనఖా పెట్టి రుణం పొందామని ప్రభుత్వం సమాధానం చెప్పిందని గుర్తుచేశారు. మరి ఇప్పుడేమో తాము తనఖా పెట్టుకోలేదని ఐసీఐసీఐ బ్యాంక్ చెబుతోందని తెలిపారు. మరి ఆ 400 ఎకరాల భూమిని ప్రభుత్వం ఎవరి వద్ద తనఖా పెట్టినట్లు అని ప్రశ్నించారు. సీఎం రేవంత్‌రెడ్డి తన బ్రోకర్ కంపెనీలకు తనఖా పెట్టారా? 400 ఎకరాల తనఖా విషయంలో దాగి ఉన్న చీకటి కోణం ఏమిటి? ప్రభుత్వం దీనిపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

READ MORE ...

Congress: తెలంగాణ కాంగ్రెస్ కు బిగ్ షాక్.. మాజీ ఎమ్మెల్సీ రాజీనామా





Next Story