ఎమ్మెల్సీ కసిరెడ్డికి బీఆర్ఎస్ బుజ్జగింపులు.. నేరుగా రంగంలోకి దిగిన మంత్రి కేటీఆర్

by Dishafeatures2 |
ఎమ్మెల్సీ కసిరెడ్డికి బీఆర్ఎస్ బుజ్జగింపులు.. నేరుగా రంగంలోకి దిగిన మంత్రి కేటీఆర్
X

దిశ, వెబ్‌డెస్క్: ఎన్నికల వేళ తెలంగాణ రాజకీయాల్లో నేతల చేరికలు జోరందుకున్నాయి. బీఆర్ఎస్‌లోని అసంతృప్తి నేతలు ఒక్కొక్కరుగా కాంగ్రెస్ గూటికి చేరుతున్నారు. బీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యేలతో పాటు ముఖ్యనేతలు పార్టీని వీడి హస్తం పార్టీలో చేరుతున్నారు. ఇప్పటికే పలువురు నేతలు చేరగా.. మరికొంతమందితో కాంగ్రెస్ నేతలు చర్చలు జరుపుతున్నారు. త్వరలో మరికొంతమంది గులాబీ నేతలు కాంగ్రెస్‌లో చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి.

బీఆర్ఎస్‌లో సీటు ఆశించి భంగపడ్డ ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణ రెడ్డి కూడా త్వరలో కాంగ్రెస్‌లో చేరతారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే ఆయన కాంగ్రెస్ నేతలతో టచ్‌లోకి వెళ్లారని, రేపో, మాపో పార్టీ మారడం ఖాయమనే ప్రచారం జరుగుతోంది. కల్వకుర్తి నియోజకవర్గానికి చెందిన ఆయన బీఆర్ఎస్ నుంచి టికెట్ ఆశించారు. కానీ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న జైపాల్ యాదవ్‌కే కల్వకుర్తి టికెట్‌ను సీఎం కేసీఆర్ ప్రకటించారు. ఈ పరిణామంతో అసంతృప్తికి గురైన కసిరెడ్డికి కల్వకుర్తి టికెట్‌ను కాంగ్రెస్ ఆఫర్ చేసినట్లు తెలుస్తోంది. దీంతో కాంగ్రెస్‌లో చేరాలని ఆయన భావిస్తున్నట్లు అనుచరులు చెబుతున్నారు.

కాంగ్రెస్‌లో చేరతారనే ప్రచారం నేపథ్యంతో కసిరెడ్డిని బుజ్జగించే ప్రయత్నాలను బీఆర్ఎస్ మొదలుపెట్టింది. ఏకంగా మంత్రి కేటీఆర్ రంగంలోకి దిగి కసిరెడ్డిని బుజ్జగిస్తున్నారు. అందులో భాగంగా గురువారం హైదరాబాద్‌లో మంత్రి కేటీఆర్‌ను కసిరెడ్డి కలిశారు. కసిరెడ్డి కాంగ్రెస్‌లో చేరతారనే ప్రచారం నేపథ్యంలో ఈ భేటీ ప్రాధాన్యతను సంతరించుకుంది. అనంతరం కల్వకుర్తి ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ కూడా కేటీఆర్‌ను కలిశారు. నియోజకవర్గంలో కసిరెడ్డి, జైపాల్ యాదవ్ మధ్య పొసగడం లేదు. దీంతో ఇద్దరి మధ్య సయోధ్య కుదిర్చేందుకు కేటీఆర్ ప్రయత్నాలు చేస్తున్నారు.

Next Story

Most Viewed