ఫోన్ ట్యాపింగ్‌పై KCR సైలెంట్.. చిక్కులు ఎదురవుతాయనే పెదవి విప్పడం లేదా?

by Disha Web Desk 2 |
ఫోన్ ట్యాపింగ్‌పై KCR సైలెంట్.. చిక్కులు ఎదురవుతాయనే పెదవి విప్పడం లేదా?
X

దిశ, తెలంగాణ బ్యూరో: ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా దుమారం రేపింది. ఈనెల 5వ తేదీన కరీంనగర్‌ పర్యటించిన కేసీఆర్.. ట్యాపింగ్ విషయంపై మొదటిసారి స్పందించారు. రెండు రోజుల్లో ప్రెస్‌మీట్ ఏర్పాటు చేస్తానని నిజాలు బయటపెడతానని తెలిపారు. ట్యాపింగ్ ఎవరు చేయించారో, ఎవరిని అరెస్టు చేయాలో స్పష్టం చేస్తానని వివరించారు. కానీ పది రోజులు గడుస్తున్నా.. ఆయన పెదవి విప్పకపోవడంపై అనుమానాలు తలెత్తుతున్నాయి. ఇంతకు ఆయన మాట్లాడుతారా? లేదా? అనే విషయం గులాబీ లీడర్లకే అంతు పట్టడం లేదు. ఒకవేళ మాట్లాడితే వివాదంలో ఇరుక్కుపోతారనే అనుమానంతోనే మౌనంగా ఉంటున్నారా? లేక సమయం, సందర్భం చూసుకుని గుట్టు విప్పుతారా? అనే ప్రశ్నలు వారిలో మెదులుతున్నాయి. మరోవైపు అప్పటి ప్రభుత్వ పెద్దల కనుసన్నల్లోనే ట్యాపింగ్ ఎపిసోడ్ జరిగినట్టు విచారణలో.. సస్సెండెడ్ పోలీసు అధికారులు ఒప్పుకున్నట్టు జోరుగా ప్రచారం జరుగుతున్నది. ఇలాంటి సమయంలో కేసీఆర్ ఏం చెపుతారు? అనేది ఆసక్తికరంగా మారింది.

భయంతోనే?

‘సుప్రీం ఆదేశాల మేరకే ట్యాపింగ్ చేశాం’ అని రాధాకిషన్ రావు ఒప్పుకున్నట్టు పోలీసులు కోర్టుకు తెలియజేశారు. దీంతో ట్యాపింగ్ కేసు.. నాటి ప్రభుత్వ పెద్దల మెడకు చుట్టుకునే అవకాశం ఉందని రాజకీయ వర్గాలో జోరుగా చర్చ జరుగుతున్నది. ఇలాంటి సమయంలో ఏం మాట్లాడినా కేసులో ఇరుక్కుపోయే ప్రమాదం ఉందని గ్రహించిన కేసీఆర్.. సైలెంట్‌గా ఉంటున్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ కేసులో పోలీసుల విచారణ, కోర్టుకు తెలిపిన వివరాలపై గులాబీ బాస్ న్యాయనిపుణుల సలహాలు తీసుకున్నట్టు తెలిసింది. వారి సూచనల మేరకే ట్యాపింగ్ ఇష్యూపై పెదవి విప్పడం లేదని, కొంత కాలం సైలెంట్ గా ఉండటమే మేలనే అభిప్రాయానికి వచ్చినట్టు సమాచారం.

లోక్‌సభ ఎన్నికల్లోలో కాంగ్రెస్‌కు ఆయుధంగా..

ట్యాపింగ్ కేసు విచారణ సందర్భంగా బయటకు వస్తున్న అంశాలు రోజురోజుకూ బీఆర్ఎస్‌ను ఇరుకున పెడుతున్నాయి. ఇలాంటి సమయంలో మౌనంగా ఉంటే.. తప్పును ఒప్పుకున్నామనే సంకేతాలు జనాల్లోకి వెళ్తాయనే ఆందోళన గులాబీ లీడర్లలో వ్యక్తమవుతున్నది. ఇదే అంశాన్ని పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ ఆయుధంగా మల్చుకుని బీఆర్ఎస్‌ను ఎటాక్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నది. ఇలాంటి సమయంలో తాము మౌనంగా ఉండటం సరికాదని బీఆర్ఎస్‌లోని ఓ మాజీ మంత్రి అభిప్రాయపడ్డారు. జరిగిన విషయం ఏంటో ప్రజలకు వివరించాల్సిన బాధ్యత తమ పార్టీపై ఉన్నదని వివరించారు.

నోరు జారిన కేటీఆర్..

ఒకటికి రెండు సార్లు ఆలోచించి మాట్లాడాల్సిన ట్యాపింగ్ విషయంలో కేటీఆర్ తొందరపడి నోరు జారారని విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. మొదట్లో ట్యాపింగ్‌కు, తమకు సంబంధం లేదని ఖండించిన ఆయన.. కొన్ని రోజులకే మాట మార్చారు. ట్యాపింగ్ జరిగితే జరిగి ఉండొచ్చు అంటూ పరోక్షంగా ఒప్పుకున్నారు. దీంతో అప్పటి ప్రభుత్వ పెద్దల సహకారంతోనే ట్యాపింగ్ జరిగిందనే అనుమానాలకు కేటీఆర్ వ్యాఖ్యలు బలం చేకూర్చినట్టయింది.


Next Story

Most Viewed