33 శాతం సీట్లు మీకే ఇస్తాం.. బీఆర్ఎస్ మ‌హిళా నేత‌ల‌కు కేసీఆర్ గుడ్ న్యూస్

by Ajay Maddhiboyina |   (  Updated:2025-04-18 17:08:55  IST  )

దేశంలో త్వరలోనే మహిళా బిల్లు రాబోతున్నదని.. ఆ బిల్లుతో మహిళలకు 33 శాతం సీట్లు వస్తాయని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చెప్పారు.

33 శాతం సీట్లు మీకే ఇస్తాం.. బీఆర్ఎస్ మ‌హిళా నేత‌ల‌కు కేసీఆర్ గుడ్ న్యూస్
X

దిశ, తెలంగాణ బ్యూరో: దేశంలో త్వరలోనే మహిళా బిల్లు రాబోతున్నదని.. ఆ బిల్లుతో మహిళలకు 33 శాతం సీట్లు వస్తాయని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చెప్పారు. ఎర్రవెల్లిలోని ఫాంహౌజ్‌లో పార్టీ మహిళా నేతలతో కేసీఆర్ భేటీ అయ్యారు.రాబోవు రోజుల్లో మహిళలంతా ఉత్సాహంగా పనిచేయాలని సూచించారు. రాజకీయాల్లో ప్రత్యక్షంగా తిరిగే మహిళలకే అవకాశాలు లభిస్తాయని చెప్పారు. ఇప్పటి నుంచే నిత్యం ప్రజల్లో ఉండాలని సూచించారు. మహిళా బిల్లుతో రాష్ట్రంలో పార్టీ తరఫున 33 శాతం సీట్లు కేటాయిస్తామని.. నాయకుల భార్యలకు కాకుండా పార్టీలో యాక్టివ్‌గా పనిచేస్తున్న వారికే సీట్లు ఇస్తామని కేసీఆర్ చెప్పారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. త్వరలోనే తెలంగాణ భవన్‌లో మహిళా నేతలతో పెద్ద ఎత్తున మీటింగ్ పెడుతామని వెల్లడించారు.

వారికి సైతం ఓరియంటేషన్ తరగతులు నిర్వహిస్తామన్నారు. తెలంగాణ ఉద్యమంలో మహిళలు ఎంతగానో క్రియాశీలక పాత్ర పోషించారని.. రజతోత్సవ సభలోనూ అలాంటి పాత్రనే పోషించాలని సూచించారు. సభకు వచ్చే మహిళలకు ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాకుండా చూడాలని సూచించారు. సభ ముగిసే సరికి రాత్రి అవుతుందని.. ఎవరికి ఇబ్బందులు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఇందుకోసం ఎమ్మెల్సీ కవిత నేతృత్వంలో 8 మందితో కమిటీ వేస్తామని కేసీఆర్ చెప్పారు. మహిళల భద్రత పట్ల ఈ కమిటీ ప్రత్యేక చర్యలు తీసుకోవాల్సి ఉంటుందన్నారు. ఈ సమావేశంలో ఎమ్మెల్సీ కవిత, మాజీ ఎమ్మెల్యే చంద్రావతి, హరిరమాదేవి, మహిళా నేతలు రజనీసాయిచంద్, సుమిత్రానంద్, రమాదేవి, నవీనాచారి తదితరులు పాల్గొన్నారు.

Next Story