ఖమ్మంలో దడపుట్టిస్తోన్న క్యాన్సర్.. మూడు నెలల్లోనే 114 మందిలో సమస్య గుర్తింపు..!

by Disha Web Desk 19 |
ఖమ్మంలో దడపుట్టిస్తోన్న క్యాన్సర్.. మూడు నెలల్లోనే 114 మందిలో సమస్య గుర్తింపు..!
X

దిశ, తెలంగాణ బ్యూరో: ఖమ్మం జిల్లాలో క్యాన్సర్​దడ పుట్టిస్తోంది. గడిచిన మూడు నెలల్లో 578 మందికి మామోగ్రామ్ (బ్రెస్ట్‌లోని సమస్యలు గుర్తించేందుకు చేసే పరీక్ష) 114 మందిలో సమస్య ఉన్నట్లు గుర్తించారు. వీరిలో క్యాన్సర్ అనుమానితులందరినీ ఎంఎన్‌జే క్యాన్సర్ ఆస్పత్రికి రిఫర్ చేశారు. బయాప్సీ టెస్టులు అనంతరం క్యాన్సర్​నిర్ధారణ కానుంది. కరీంనగర్, వరంగల్​జిల్లాల పరిస్థితి ఇదే విధంగా ఉంది. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఈ ఏడాది మార్చి 8న ప్రారంభించిన ఆరోగ్య మహిళా కార్యక్రమం ద్వారా ఇప్పటి వరకు 66,174 మందికి బ్రెస్ట్ ఎగ్జామిన్​టెస్టులు చేశారు. వీరిలో 20 శాతం అనుమానితులను ఎంఎన్‌జే ఆస్పత్రికి రిఫర్ చేశారు.

నిర్లక్ష్యమే కొంప ముంచుతున్నది?

రాష్ట్రంలో ప్రతి ఏడాది దాదాపు 10 వేల మంది (50 శాతం) మహిళలు క్యాన్సర్​మూడో దశలో ఉన్నప్పుడు మొదటిసారిగా డాక్టర్‌ను సంప్రదిస్తున్నట్లు ఎంఎన్‌జే ఆంకాలజిస్టుల పరిశీలనలో తేలింది. మరో 2 వేల మంది (15–20 శాతం) ఫేజ్‌4లో డాక్టర్లను సంప్రదిస్తున్నారు. దీంతోనే ఈ కేటగిరీ పేషెంట్లకు వ్యాధిని కంట్రోల్ చేయడం డాక్టర్లు సాధ్య పడటం లేదు. వారికి జీవించే అవకాశాలు సన్నగిల్లుతున్నాయి.

లక్షణాలు ఇవీ..

అతి చిన్నగా, గుర్తించలేని రీతిలో ఉండే కణతి మొదట మహిళల రొమ్ములపై వస్తుంది. ఈ తరహా కణతులను మహిళలు స్వతహాగా కనిపెట్టలేకపోవచ్చు. కానీ మామోగ్రామ్‌ పరీక్షలతో సులువుగా గుర్తించవచ్చు. రొమ్ము కణజాలంలో, చంకల్లో కణతి ఏర్పడటం, రొమ్ము వాపు, దురద, రొమ్ము చర్మం రంగు మారడం, నిపుల్‌ లోపలకు చొచ్చుకు పోతే వెంటనే ఆంకాలజిస్ట్‌ను తప్పనిసరిగా కలవాలి. లేదంటే వ్యాధి ముదిరి ప్రమాదాన్ని తెస్తుంది.

కారణాలు ఇవే ?

అమ్మాయిలు, మహిళల రొమ్ముల్లో కణతులు వంటివి ఏర్పడితే అప్రమత్తం కావాల్సి ఉంటుంది. వెంటనే వైద్యులను సంప్రదించి కారణాలు తెలుసుకోవాలి. లేకుంటే కణ విభజన నియంత్రణ కోల్పోయి క్షీర నాళాలను దెబ్బతీస్తూ ఆ కణుతులు నెమ్మదిగా లింఫ్ నోడ్స్, ఇతర భాగాలకు చేరుకొంటాయి. ఆ తర్వాత రొమ్ములో ఉన్న కండరాలను కూడా కణతులు కన్వర్ట్ చేసేస్తాయి. బ్రెస్ట్​క్యాన్సర్ వచ్చిన వారికి అండాశయ క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉంది. ఈస్ట్రోజెన్ ప్రభావంతో చిన్నవయసులో రజస్వల కావడం, చాలా ఆలస్యంగా మెనోపాజ్‌లు కూడా రొమ్ము క్యాన్సర్‌కు కారణాలుగా డాక్టర్లు వెల్లడిస్తున్నారు.

హార్మోన్ల ప్రభావం

హార్మోన్ల ఇన్‌బ్యాలెన్స్, మారిన లైఫ్​స్టైల్​బ్రెస్ట్​క్యాన్సర్లకు ప్రధాన కారణం. గర్భం దాల్చని వారిలో, ఆలస్యంగా సంతానం కలిగిన వారిలోనూ బ్రెస్ట్​క్యాన్సర్లు ఎక్కువగా వస్తున్నాయి. అంటే 30 ఏళ్ల తర్వాత సంతానానికి జన్మనిచ్చిన వారిలో క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉన్నది. అందుకు మామోగ్రఫీ పరీక్షలు ముఖ్యం. 40 ఏళ్లు పై బడిన వారు ఈ టెస్టులు చేయించుకోవాల్సిన అవసరం ఉన్నది. పూర్తి స్థాయి పరిశీలన ద్వారా మాత్రమే లక్షణాలను గుర్తించడం సులువు.

- డాక్టర్ సాయిరాం, సీనియర్​ఆంకాలజిస్ట్, ఎంఎన్‌జే క్యాన్సర్​


Next Story