గ్రౌండ్ వాటర్ పెరగడానికి కారణం ఇదే: వినోద్ కుమార్

by Disha Web Desk 2 |
గ్రౌండ్ వాటర్ పెరగడానికి కారణం ఇదే: వినోద్ కుమార్
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా నీళ్లను పంటపొలాలకు, చెరువులు, కుంటలకు తరలించడం వల్లనే గ్రౌండ్ వాటర్ పెరిగిందని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ అన్నారు. ప్రపంచ నీటి దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం, గాంధీ జ్ఞాన్ ప్రతిష్ఠాన్, గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ ఆధ్వర్యంలో నీటి ప్రాముఖ్యతపై చేపట్టిన జన చైతన్య ప్రచార యాత్రను ఆదివారం మంత్రుల నివాస ప్రాంగణంలో ప్రారంభించి మాట్లాడారు. ప్రతి నీటి బొట్టును ఒడిసి పట్టుకోవాలని, నీళ్లే సమస్త ప్రాణ కోటికి జీవన ఆధారం అని అన్నారు. నీటిని సంరక్షిస్తేనే భవిష్యత్తు ఉంటుందని, ఈ వాస్తవాన్ని ప్రతి ఒక్కరూ గ్రహించాలన్నారు.

సమస్త ప్రాణ కోటికి, చెట్లకు, మానవ మనుగడకు నీరు అవసరం అన్నారు. మిషన్ కాకతీయతో రాష్ట్రంలో 44 వేల చెరువులలో పూడికలు తీయించారని, తద్వారా భూగర్భ జలాలు గణనీయంగా పెరిగాయన్నారు. కేంద్ర జల సంఘం లెక్కల ప్రకారం ప్రస్తుతం రాష్ట్రంలోని భూగర్భంలో దాదాపు 500 టీఎంసీల నీరు స్టోరేజీ పెరిగిందన్నారు. నీటిని వృథా చేస్తే రేపటి తరాలకు మిగిలేది కన్నీరే అన్నారు. అంతకు ముందు క్లబ్ హౌస్ లో నీటి ప్రాముఖ్యతపై ఏర్పాటు చేసిన సదస్సు, రెండు తెలుగు రాష్ట్రాల స్థాయి కవిత్వ ఉత్సవంలో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ, గాంధీ జ్ఞాన్ ప్రతిష్ఠాన్ సంస్థల చైర్మన్ డాక్టర్ గున్న రాజేందర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి డాక్టర్ యానాల ప్రభాకర్ రెడ్డి, జల మండలి ఓఎస్డీ జాల సత్యనారాయణ, నాగసూరి వేణు గోపాల్, గిరిధర్ గౌడ్, గోపాల్, గణేష్ గౌడ్, గాంధారి ప్రభాకర్, హర్దీప్ రెడ్డి, కవులు పాల్గొన్నారు.



Next Story

Most Viewed