రాష్ట్ర ప్రభుత్వానికి కంటోన్మెంట్ భూమి అప్పగించాలి.. కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ కు లేఖ

by Dishafeatures2 |
రాష్ట్ర ప్రభుత్వానికి కంటోన్మెంట్ భూమి అప్పగించాలి.. కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ కు లేఖ
X

దిశ, తెలంగాణ బ్యూరో: కంటోన్మెంట్ భూమిని రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగించాలని, కంటోన్మెంట్ భూమిని వెడల్పు చేసి ఫ్లై ఓవర్ బ్రిడ్జిని నిర్మించి ట్రాఫిక్ సమస్య పరిష్కరిస్తుందని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ అన్నారు. హైదరాబాద్ శివారులో కరీంనగర్ ఉమ్మడి జిల్లా మార్గంలో ఉన్న కేంద్ర రక్షణ శాఖ కంటోన్మెంట్ భూములను తెలంగాణకు అప్పగించాలని కోరుతూ శనివారం కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ కు లేఖ రాశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి రోడ్డు మార్గాన హైదరాబాద్ కు చేరుకునే క్రమంలో హైదరాబాద్ శివారులో ఎదురవుతున్న ట్రాఫిక్ సమస్యను అధిగమించేందుకు హకీంపేట - బొల్లారం - అల్వాల్ - తిరుమలగిరి - కార్ఖానా - జింఖానా గ్రౌండ్ మధ్యలో రోడ్డును వెడల్పు చేసి ఫ్లై ఓవర్ బ్రిడ్జిని నిర్మించేందుకు సీఎం కేసీఆర్ సుముఖంగా ఉన్నారని అన్నారు.

ఈ విషయమై కేసీఆర్, కేటీఆర్ లు సైతం పలుమార్లు కేంద్రానికి లేఖలు రాశారన్నారు. హకింపేట నుంచి ప్రారంభమయ్యే ట్రాఫిక్ బొల్లారం, అల్వాల్, లోతుకుంట, లాల్ బజార్, తిరుమలగిరి, కార్ఖానా, జే.బీ.ఎస్. జింఖానా గ్రౌండ్స్ మధ్య కొనసాగుతోందని, ట్రాఫిక్ ఇక్కట్లతో ఉమ్మడి కరీంనగర్ జిల్లా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. హైదరాబాద్ నగరం నుంచి వరంగల్ జిల్లాకు వెళ్లే దారిలో 6 నంబర్ జంక్షన్ నుంచి ఫ్లై ఓవర్ బ్రిడ్జిని నిర్మించారని, మెహిదిపట్నం నుంచి ఎయిర్ పోర్ట్ సహా మహబూబ్ నగర్ జిల్లాకు వెళ్లేందుకు పీవీ నర్సింహా రావు ఎక్స్ ప్రెస్ వే ఉందని, నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాకు వెళ్లేందుకు ఫ్లై ఓవర్ బ్రిడ్జిని నిర్మిస్తున్నామని, కేవలం ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు ట్రాఫిక్ నుంచి బయట పడి ప్రయాణం కొనసాగించేందుకు మాత్రం ప్రత్యేకంగా మరో దారి లేదని లేఖలో వివరించారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు సాఫీగా రాకపోకలు సాగించేందుకు, ట్రాఫిక్ సమస్యను అధిగమించేందుకు కంటోన్మెంట్ భూమిని రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగించాలని కేంద్రమంత్రిని కోరారు.



Next Story

Most Viewed