రైల్వే శాఖలో ఖాళీ పోస్టుల్ని భర్తీ చేయండి.. రైల్వే మంత్రికి వినోద్ కుమార్ లేఖ

by Dishafeatures2 |
రైల్వే శాఖలో ఖాళీ పోస్టుల్ని భర్తీ చేయండి.. రైల్వే మంత్రికి వినోద్ కుమార్ లేఖ
X

దిశ, తెలంగాణ బ్యూరో : రైల్వే శాఖలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ కేంద్రాన్ని డిమాండ్ చేశారు. సోమవారం కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ కు లేఖ రాశారు. దేశవ్యాప్తంగా రైల్వే శాఖలో 3.12 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని ఒక సౌత్ సెంట్రల్ రైల్వే కీలక విభాగాల్లోనే 30 వేల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని, ఇతర విభాగాల్లో ఇంకా అనేక ఖాళీలు ఉంటాయని లేఖలో పేర్కొన్నారు. రైల్వే శాఖలో ఉద్యోగాల ఖాళీల వల్ల ప్రస్తుతం పని చేస్తున్న సిబ్బందిపై పని ఒత్తిడి పెరుగుతోందని, దీంతో ప్రమాదాలు, అనర్థాలకు దారితీస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. రైల్వే శాఖలో సౌత్ సెంట్రల్ రైల్వే ప్రయాణీకులు, సరుకుల రవాణా ద్వారా అధిక ఆదాయం సమకూరుస్తూ కీలక పాత్ర పోషిస్తోందన్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లతో పాటు కొంత భాగం కర్ణాటక, మహారాష్ట్రలలో సౌత్ సెంట్రల్ రైల్వే సేవలు అందిస్తోందని తెలిపారు.

సౌత్ సెంట్రల్ రైల్వే పరిధిలో టికెట్ కలెక్టర్స్, స్టేషన్ మాస్టర్స్, లోకో మోటివ్ పైలట్స్, ట్రాక్ మెంటేనర్స్, టెక్నికల్ స్టాఫ్, ఇతర పోస్టులు ఖాళీగా ఉన్నాయని పేర్కొన్నారు. నిరంతరంగా రైల్వే ట్రాక్స్ ను, సిగ్నల్స్ లైటింగ్స్ ను పర్యవేక్షణ చేసేందుకు తగిన స్థాయిలో సిబ్బంది లేని కారణంగా ప్రమాదాలకు చోటు కలుగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. చాలీచాలని ఉద్యోగులు ఉన్న ప్రస్తుత తరుణంలో, ఉన్న సిబ్బందిపై పని ఒత్తిడి పెరుగుతుండటంతో మానసికంగా కృంగి పోతున్నారని తెలిపారు. రైల్వే శాఖలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని, నిరంతరం వృత్తి శిక్షణ శిబిరాలు నిర్వహించాలని, ఉద్యోగులకు ఇన్సెంటివ్ లు ఇచ్చి ప్రోత్సహించాలని, రైలు ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోవాలని కోరారు.



Next Story

Most Viewed