నియోజకవర్గంలో పడిపోతున్న బీజేపీ గ్రాఫ్.. ఆ నలుగురే కారణమా?

by Disha Web Desk 4 |
నియోజకవర్గంలో పడిపోతున్న బీజేపీ గ్రాఫ్.. ఆ నలుగురే కారణమా?
X

కల్వకుర్తి నియోజకవర్గంలో బీజేపీ పరిస్థితి మూడడుగులు ముందుకు.. ఆరడుగులు వెనక్కి అన్నచందంగా మారింది. 2014, 2018 అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీ అభ్యర్థి గెలుపు తీరానికి కొద్ది దూరంలోనే ఆగిపోయినా అందుకు కారణాలెన్నో. ఆమనగల్ పూర్వపు బ్లాక్ పరిధిలో పార్టీ అధిక ఓట్లను సాధించుకున్నా నియోజకవర్గ కేంద్రంలో మాత్రం బొక్క బోర్ల పడింది. ఇందుకు ప్రధాన కారణం నాయకత్వ లేమి అనేది స్పష్టంగా తెలుస్తోంది. అందుకు ఆ నలుగురే కారణమని కిందిస్థాయి శ్రేణులనుంచి ఆరోపణలు వినిపిస్తున్నాయి.

అయితే బీజేపీ ఓట్లను సాధించకపోవడానికి ఆ నలుగురే ప్రధాన కారణమని కార్యకర్తలు విమర్శిస్తున్నారు. అంతేకాక వారి పోరు పడలేక ఎంతోమంది పార్టీని వీడినట్లు తెలుస్తోంది. ఆ పార్టీ రాష్ట్ర క్యాడర్ ఆందోళనలకు పిలుపునిచ్చినా కల్వకుర్తిలో ఆ ఉసే ఉండదు. ఒకవేళ ఏదైనా కార్యక్రమం చేపట్టినా ఆ నలుగురే తప్పా మరొకరు కనిపించరు. అయినా అగ్రనాయకత్వం వారిని ఎందుకు కొనసాగిస్తుందనేది ఆ పార్టీ కార్యకర్తల్లో తలెత్తుతున్న ప్రధాన ప్రశ్న. ఇప్పటికైనా రాష్ట్ర నాయకత్వం స్పందించి దిద్దుబాటు చర్యలకు పునుకోకుంటే బీజేపీకి ఓటమి తప్పదని ఆ శ్రేణుల్లో ఆందోళన వ్యక్తం అవుతోంది. - దిశ, కల్వకుర్తి

దిశ, కల్వకుర్తి : కల్వకుర్తి నియోజకవర్గంలో బీజేపీ పరిస్థితి మూడడుగులు ముందుకెళ్తే .. ఆరడగులు వెనక్కి పడుతున్నట్లు ఉంది. 2014, 2018 అసంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీ అభ్యర్థి గెలుపుతీరానికి కొద్ది దూరంలోనే ఆగిపోయాడు. ఇందుకు కారణాలెన్నో.. ఆమనగల్ పూర్వపు బ్లాక్ పరిధిలో బీజేపీ ఓట్లను సాధించుకున్న కల్వకుర్తి నియోజకవర్గ కేంద్రంలో మాత్రం బొక్క బోర్ల పడుతోంది. ఇందుకు ప్రధాన కారణం నాయకత్వ లేమి అనేది స్పష్టంగా తెలుస్తోంది.

ఆ నలుగురి చేతిలోనే...

కల్వకుర్తి మండలంతోపాటు పట్టణ కేంద్రంలో దాదాపు 70వేల ఓట్లుంటాయి. కల్వకుర్తి మున్సిపాలిటీలో ఏ పార్టీ ఎక్కువ ఓట్లు తీసుకుంటే ఆ పార్టీ విజయాన్ని సొంతం చేసుకున్నట్లే. కల్వకుర్తి పట్టణ కేంద్రం అయినప్పటికీ ఓట్లు సాధించడంలో బీజేపీ ఎందుకు వెనకబడుతుందనే ప్రశ్నలు అనేకం ఉత్పన్నమవుతున్నాయి. కర్ణుని చావుకు సవాలక్ష కారణాలన్నట్లు కల్వకుర్తిలో మాత్రం బీజేపీ ఓట్లను సాధించకపోవడానికి ఆ నలుగురే ప్రధాన కారణమని ఆ పార్టీ కార్యకర్తల నుంచే పెద్దఎత్తున విమర్శలు వినిపిస్తున్నాయి.

బతుకుదెరువుగా మారిన పార్టీ..

కల్వకుర్తి పట్టణంతోపాటు మండలంలో ఆ నలుగురి చేతుల్లోనే బీజేపీ పార్టీ బందీ అయ్యిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. వారి వ్యాపారానికి ఇతర వ్యవహారాలకు పార్టీని ఉపయోగించుకుంటున్నారే తప్పా వారు పార్టీకి చేసింది ఏమిలేదనే అపవాదును ఆ నలుగురు మూటగట్టుకున్నారు. కల్వకుర్తిలో ఎందరో నాయకులు బీజేపీలోకి వచ్చి ఆ నలుగురి పోరు పడలేక పార్టీని వీడిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. దాదాపు 15ఏళ్ల నుంచి బీజేపీలోకి ఇతరులను రానివ్వకుండా, ఉన్నవారిని పొమ్మనలేక పొగ పెడతారనే ఆరోపణలు ఆపార్టీ సామాన్య కార్యకర్తల్లోనే వ్యక్తం అవుతోంది.

పార్టీ కార్యక్రమాల పట్ల నిర్లక్ష్యం...

రాష్ట్రస్థాయిలో ఆందోళనలకు బీజేపీ పిలుపునిస్తే కల్వకుర్తిలో ఆ ఊసే ఉండదు. ఒకవేళ ఏదైనా కార్యక్రమం చేపట్టినా అందులో ఆ నలుగురే తప్పా మరొకరు కనిపించరు. మరో విచిత్రమైన విషయం ఏంటంటే వీరి వెనుక పెద్దగా ఓట్లు ఉన్నాయా అంటే అవి లేవు. వీరిని చూస్తే కిందిస్థాయి కార్యకర్తలు కూడా చిరాకు పడుతుంటారు. కనీసం ప్రెస్ మీట్లు పెట్టి జాతీయస్థాయిలో తమ పార్టీ సాధిస్తున్న ప్రగతి గురించి కూడా ప్రజల్లోకి తీసుకెళ్లలేని వారిని పార్టీ అగ్రనాయకత్వం ఎందుకు సాగిస్తున్నదనదే ఆ పార్టీ కార్యకర్తల నుంచి వినిపిస్తున్న ప్రధాన ప్రశ్న.

నాయకత్వం మారితేనే...

2014, 2018 ఆసంబ్లీ ఎన్నికల్లో కల్వకుర్తి నుంచి పోటీ చేసిన అభ్యర్థి గెలుపు ముంగిట బోర్ల పడ్డాడు. దీనికి ప్రధాన కారణం కల్వకుర్తి పట్టణంలో బీజేపీ బలంగా లేకపోవడమే. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే రాష్ట్రమంతా ఆ పార్టీ ప్రభంజనం వీచినా కల్వకుర్తిలో మాత్రం బోర్ల పడే పరిస్థితిలే ఉన్నాయి. సామాన్య నాయకులు, కార్యకర్తలను కలుపుకుని పోయే గుణం లేని ఆ నలుగురు పార్టీకి భారమే తప్పా ఎటువంటి ఉపయోగం లేదని ఆ పార్టీ కార్యకర్తలే గుసగుసలాడుకుంటున్నారు. ఈ విషయమై నియోజకవర్గ ఇన్ ఛార్జి, రాష్ట్ర నాయకత్వం స్పందించి సరిదిద్దే చర్యలకు పునుకోకుంటే బీజేపీ అభ్యర్థికి మరోసారి ఓటమి తప్పదని ఆ పార్టీ కార్యకర్తలు చెవులు కొరుక్కుంటున్నారు.

Next Story