టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం.. పంతం నెగ్గించుకున్న ‘‘జేజమ్మ’’!

by Disha Web Desk 19 |
టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం.. పంతం నెగ్గించుకున్న ‘‘జేజమ్మ’’!
X

దిశ, తెలంగాణ బ్యూరో: మహబూబ్ నగర్‌‌-రంగారెడ్డి-హైదరాబాద్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్‌కు బీజేపీ గట్టి ఝలక్ ఇచ్చింది. ఊహించని షాక్‌తో బీఆర్ఎస్‌కు చుక్కలు కనిపించాయి. టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ మద్దతు పలికిన ఏవీఎన్ రెడ్డి గెలుపొందారు. తొలిసారి ఈ కేటగిరీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించింది. ఆయనకు మద్దతుగా బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ చేసిన ప్రచారం ఫలించింది. ఈ నెల 13న జరిగిన పోలింగ్‌లో మొత్తం 25416 ఓట్లు పోల్ కాగా అందులో ఏవీఎన్ రెడ్డికి అన్ని ప్రాధాన్యతల్లో కలిపి 13436 ఓట్లు లభించాయి.

మొత్తం 25,416 ఓట్లలో 452 ఓట్లు చెల్లలేదని రిటర్నింగ్ అధికారి ప్రకటించారు. బ్యాలెట్ పేపర్ విధానంలో ప్రాధాన్యతా బేసిస్ మీద జరిగిన ఓట్ల లెక్కింపు గురువారం ఉదయం ప్రారంభం కాగా చివరి రౌండ్ అర్ధరాత్రి దాటిన తర్వాత 2 గంటలకు పూర్తయింది. ఇప్పటికే రెండు సార్లు సిట్టింగ్‌గా ఉన్న ఎమ్మెల్సీ (ఈ నెల పదవీ కాలం పూర్తి కానున్నది)కి బీఆర్ఎస్ ఇంతకాలం బహిరంగంగా మద్దతు పలకగా ఈసారి మాత్రం అలాంటి ప్రకటన చేయకుండా సైలెంట్‌గా ఉండిపోయింది.

బీజేపీ మద్దతుతో పోటీచేసిన ఏవీఎన్ రెడ్డి తన సమీప ప్రత్యర్థి పీఆర్‌టీయూ-టీఎస్ (ప్రోగ్రెసివ్ రికగ్నయిజ్డ్ టీచర్స్ యూనియన్ – తెలంగాణ స్టేట్) తరఫున పోటీ చేసిన గుర్రం చెన్నకేశవరెడ్డి కంటే 1150 ఓట్ల మార్జిన్‌తో గెలుపొందారు. ఇదే సంఘానికి చెందిన కాటేపల్లి జనార్దన్ రెడ్డి (సిట్టింగ్) స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగి 1236 ఓట్లను మాత్రమే పొందగలిగారు. యూటీఎఫ్ (యునైటెడ్ టీచర్స్ ఫెడరేషన్) తరఫున పోటీచేసిన మాణిక్‌రెడ్డికి మూడోస్థానంలో నిలిచారు.

కాంగ్రెస్ మద్దతుతో పోటీచేసిన హర్షవర్ధన్ రెడ్డికి 1907 ఓట్లు దక్కాయి. ఏవీఎన్ రెడ్డి తరఫున బండి సంజయ్ చేసిన ప్రచారం సందర్భంగా ఈసారి రాష్ట్రంలో తమ పార్టీ అధికారంలోకి వస్తే టీచర్లకు ప్రతి నెలా ఒకటో తేదీనే జీతాలు చెల్లిస్తుందని, ఉపాధ్యాయులకు సంబంధించిన 317 జీవోను సవరిస్తుందని, బదిలీ ప్రక్రియలో ఎదురైన ఇబ్బందులను పరిష్కరిస్తుందని, పెండింగ్‌లో ఉన్న జీతాలను నెల రోజుల వ్యవధిలోనే చెల్లిస్తుందని.. ఇలాంటి హామీలను ఇచ్చారు.

పంతం నెగ్గించుకున్న జేజమ్మ

మహబూబ్ నగర్‌‌-రంగారెడ్డి-హైదరాబాద్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ పంతం నెగ్గించుకున్నారు. సొంత జిల్లాలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడితో కలిసి ముమ్మరంగా ప్రచారం చేసి సత్తా చాటారు. వాస్తవానికి గతంలో ఏవీఎన్ రెడ్డి గెలిచిన దాఖలాలు లేవు. కానీ ఈసారి గెలిపించుకుంటామని ఇచ్చిన మాటను డీకే అరుణ దక్కించుకున్నారు. అధికార పార్టీకి గట్టి షాకిచ్చారు. ఏవీఎన్ రెడ్డి గెలుపు సందర్భంగా బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో బాణసంచా కాల్చి సంబురాలు చేసుకున్నారు. స్వీట్లు పంచుకున్నారు.

గెలుపుపై నడ్డా ఆరా

మహబూబ్ నగర్‌‌-రంగారెడ్డి-హైదరాబాద్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ బలపరిచిన అభ్యర్థి ఏవీఎన్ రెడ్డి గెలుపుపై బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఆరా తీశారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కి ఫోన్ చేసి వివరాలు తెలుసుకున్నారు. కాగా తెలంగాణలోనూ రామరాజ్యం నిర్మించడమే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నట్లు బండి సంజయ్ నడ్డాకు వివరించినట్లు చెప్పారు.

సీఎం కేసీఆర్‌కు టీచర్లు తమ సత్తాను చూపించారని వెల్లడించారు. కేసీఆర్‌ను ఇంకెన్ని రోజులు భరించాలనేందుకు ఇదే నిదర్శనంగా నిలిచిందని బండి.. నడ్డాకు వివరించారు. 317 జీవోతో టీచర్లు చెట్టుకొకరిని, పుట్టకొకరిని వేశాడనే అంశాన్ని నడ్డా వద్ద బండి ప్రస్తావించారు. అనంతరం మీడియాతో సంజయ్ మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి కేసీఆర్ ఉద్యోగులకు మూడు డీఏలు బాకీ ఉన్నాడని మండిపడ్డారు. సీఎంకు కొమ్ము కాసే ఉపాధ్యాయ సంఘాలకు ఇదొక గుణపాఠమని చురకలంటించారు. ఉపాధ్యాయ సమస్యలను పరిష్కరించేలా కృషి చేస్తామని బండి హామీ ఇచ్చారు.



Next Story

Most Viewed