కేసీఆర్ ప్రేమంతా ఆర్టీసీ ఆస్తులపైనే.. బీజేపీ స్టేట్ చీఫ్ కిషన్‌రెడ్డి

by Dishafeatures2 |
కేసీఆర్ ప్రేమంతా ఆర్టీసీ ఆస్తులపైనే.. బీజేపీ స్టేట్ చీఫ్ కిషన్‌రెడ్డి
X

దిశ, తెలంగాణ బ్యూరో : ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఆర్టీసీ కార్మికులపైనా, వారి సంక్షేమంపైనా ఏ మాత్రం ప్రేమ లేదని, ఆర్టీసీ సంస్థ ఆస్తులపైనే ఆయన కన్ను పడిందని బీజేపీ స్టేట్ చీఫ్ కిషన్ రెడ్డి ఆరోపించారు. నిజానికి ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వంలోకి తీసుకోవాలనే ఉద్దేశమే కేసీఆర్‌కు ఉన్నట్లయితే నాలుగేండ్ల క్రితం వారు సమ్మె చేసినప్పుడు డిమాండ్‌ను ఆమోదించి ఉండేవారని, ఇప్పుడు ఆర్టీసీ భూములకు విలువ బాగా పెరిగిపోవడంతో వాటిని అమ్ముకోవడంపై దృష్టి పడిందన్నారు. నగరంలో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, కార్మికులతో పాటు అనేక రాజకీయ పార్టీలు ఆనాడే ప్రభుత్వానికి స్పష్టమైన డిమాండ్ పెట్టాయని, ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని ముఖ్యమంత్రికి మొరపెట్టుకున్న విషయాన్ని గుర్తుచేశారు.

దురదృష్టవశాత్తూ ఆనాడు కేసీఆర్ చాలా చిన్నచూపుతో ఆర్టీసీ కార్మికులను అనరాని మాటలతో అవమానించారని, ఇప్పుడు అకస్మాత్తుగా వారిపై ప్రేమ పుట్టడానికి కారణం సంస్థ ఆస్తులతో పాటు రాజకీయంగా అసెంబ్లీ ఎన్నికల్ల వారిని ఓటు బ్యాంకుగా వాడుకోవడమే అని అన్నారు. గవర్నర్ అనుమతి ఇవ్వడం లేదంటూ పాలిటిక్స్ క్రియేట్ చేయడానికి బదులుగా రాజ్‌భవన్ నుంచి బిల్లు ఎప్పుడు వస్తే అప్పుడు ప్రత్యేక సెషన్ పెట్టి చర్చించి ఆమోదించుకోవచ్చని సూచించారు. గవర్నర్ దగ్గరకు ఏ బిల్లు వెళ్ళినా లీగల్ ఒపీనియన్ తీసుకోవడం ఒక సంప్రదాయంగా కొనసాగుతున్నదని, అన్ని రాష్ట్రాల్లోనూ ఇదే ఒక ప్రాక్టీసుగా ఉన్నదని వివరించారు.

కానీ రాజకీయ దురుద్దేశంతో గవర్నర్ అనుమతి ఇవ్వకపోవడాన్ని ఒక ఇష్యూగా చేసి గందరగోళం సృష్టిస్తున్నారంటూ కేసీఆర్‌‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్టీసీ ఆస్తులపై కేసీఆర్ ఫ్యామిలీకి కన్ను పడిందని, దాన్ని లాక్కోవడం కోసమే కార్మికుల మీద ప్రేమను ఒలకబోస్తున్నరని ఆరోపించారు. కేసీఆర్ నిర్ణయం వెనక ఉన్న కుట్రను ప్రజలు, ఆర్టీసీ కార్మికులు అర్థం చేసుకోవాలని కిషన్ రెడ్డి అప్పీల్ చేశారు. ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించే, విలీనం చేసే ప్రక్రియకు బీజేపీ సంపూర్ణ మద్దతు ఇస్తున్నదని, గతంలోనూ సర్కారును ఇదే డిమాండ్ చేసిందని ఆయన గుర్తుచేశారు. విలువైన భూముల్ని అమ్ముకుని ఆర్థికంగా సంక్షోభంలో కూరుకుపోయిన ప్రభుత్వానికి వనరులను సమకూర్చుకోవాలనుకునే కుట్ర దీని వెనక ఉన్నదని గుర్తుచేశారు. రాజకీయం కోసమే ఆదరబాదరగా నిర్ణయం తీసుకుని గవర్నర్‌పైకి నెపాన్ని నెడుతున్నారని ఆరోపించారు. ఆర్టీసీ భూముల్ని అమ్ముకుంటే ఆటోమేటిక్‌గా సంస్థ బలహీనమవుతుందని, తెలంగాణ ప్రజలకు ఇది మంచి చేయదన్నారు.

====


Next Story

Most Viewed