గ్రూప్-1 ప్రిలిమ్స్‌లో క్వాలిఫై అయ్యింది BRS నేతల పిల్లలే: బండి సంజయ్

by Disha Web Desk 2 |
గ్రూప్-1 ప్రిలిమ్స్‌లో క్వాలిఫై అయ్యింది BRS నేతల పిల్లలే: బండి సంజయ్
X

దిశ, తెలంగాణ బ్యూరో: గ్రూప్ 1 ప్రిలిమ్స్‌లో అనేక అవకతవకలు జరిగాయని బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ అన్నారు. క్వాలిఫై అయిన వారిలో చాలామంది బీఆర్ఎస్ నేతల పిల్లలున్నారని ఆరోపించారు. జగిత్యాల జిల్లాలోని ఒక మండలం నుంచే 50 మంది అర్హత సాధించినట్టు సమాచారముందని, ఇదెలా సాధ్యమని ప్రశ్నించారు. ఒక చిన్న గ్రామం నుంచే ఆరుగురు క్వాలిఫై అయ్యారన్నారు. ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. జగిత్యాల జిల్లాలోని ఓ మండలానికి చెందిన నలుగురు సర్పంచుల కొడుకులు, సింగిల్ విండో చైర్మన్ కొడుకుతోపాటు ఒక జడ్పీటీసీ వద్ద బాడీగార్డ్ గా పనిచేసే వ్యక్తి కొడుకు కూడా క్వాలిఫై అయ్యారన్నారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి కుమారుడు కూడా ఇందులో ఉన్నారన్నారు. ఒక సర్పంచ్ కుమారుడికి అర్హతకు అవకాశమే లేనప్పటికీ, క్వాలిఫై చేశారని బండి ఆరోపించారు. ఇదంతా కేసీఆర్ కొడుకు సహకారంతోనే జరిగిందన్నారు. ఆయనకు సన్నిహితంగా ఉండే వ్యక్తే ఇదంతా చేశారన్నారు.

ఒక్కొక్కరి దగ్గర నుంచి రూ.3 లక్షల నుంచి రూ. 5 లక్షల రూపాయలు వసూలు చేసినట్లు సమాచారముందన్నారు. తక్షణమే మంత్రివర్గం నుంచి కేటీఆర్ ను బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. కేటీఆర్ నియమించిన సిట్ తో విచారణ ఎలా సాధ్యమని, సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపిస్తేనే వాస్తవాలన్నీ వెలుగులోకి వస్తాయని పేర్కొన్నారు. నయీం డైరీ, సినీ తారల డ్రగ్స్ కేసు తరహాలోనే పేపర్ లీకేజీ కేసును సైతం సిట్ కు అప్పగించి పక్కదారి పట్టించే కుట్ర జరుగుతున్నదని అనుమానం వ్యక్తంచేశారు. గ్రూప్-1 పరీక్షల్లో జరిగిన అక్రమాలు, మంత్రి కేటీఆర్ నిర్వాకంపై అతి త్వరలోనే వాస్తవాలు బయటపెడతామన్నారు. అసలైన దోషులను తెలంగాణ సమాజం ముందుంచుతామని పేర్కొన్నారు. ఇదిలా ఉండగా క్యూ న్యూస్ ఆఫీస్ పై దాడి వెనుక మంత్రి కేటీఆర్ హస్తముందని బండి ఆరోపించారు. కేసీఆర్ పాలనలో మీడియా సంస్థలపై దాడులు ఊహించినవేనని చురకలంటించారు. మరిన్ని దాడులు సైతం జరిగే ప్రమాదముందన్నారు. దాడి చేసిన వారిని తక్షణమే గుర్తించి అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు.


Next Story

Most Viewed