ప్రభుత్వ వైఫల్యాలపై బీజేపీ గర్జన.. నేడు ‘చలో అసెంబ్లీ’కి పిలుపు

by Kema Shiva Kumar |   (  Updated:2026-03-23 03:42:39  IST  )

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు నేడు 'చలో అసెంబ్లీ'కి పిలుపునిచ్చారు.

ప్రభుత్వ వైఫల్యాలపై బీజేపీ గర్జన.. నేడు ‘చలో అసెంబ్లీ’కి పిలుపు
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ భారతీయ జనతా పార్టీ (BJP) ఇవాళ ‘చలో అసెంబ్లీ’ (Chalo Assembly) కార్యక్రమానికి పిలుపునిచ్చింది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు (Ramchander Rao) నేతృత్వంలో ఈ భారీ నిరసన కార్యక్రమం కొనసాగుతోంది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పార్టీ శ్రేణులు, నాయకులు పెద్ద ఎత్తున ఈ ముట్టడిలో పాల్గొనేందుకు తరలివస్తున్నారు. ఈ క్రమంలోనే పలు జిల్లాల్లో నాయకుల ముందస్తు అరెస్టుల కూడా కొనసాగుతున్నాయి. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఆరు గ్యారంటీలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని బీజేపీ ఆరోపించింది. రెండున్నరేళ్లు గడుస్తున్నా ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేరలేదని నేతలు మండిపడ్డారు.

అదేవిధంగా ఈ ఏడాది బడ్జెట్‌లో విద్య, వైద్య రంగాలకు కేటాయింపులు నామమాత్రంగానే ఉన్నాయని, కీలకమైన ఈ రంగాలను ప్రభుత్వం గాలికొదిలేసిందని బీజేపీ విమర్శించింది. భాగ్యనగర (Bhagya Nagar) అభివృద్ధికి వార్షిక బడ్జెట్‌లో తగిన నిధులు కేటాయించలేదని, ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్ (Greater Hyderabad) పరిధిలో మౌలిక సదుపాయాల కల్పనపై ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని రాంచందర్ రావు ధ్వజమెత్తారు. అన్ని వర్గాల ప్రజలపై భారం మోపుతూ.. కేవలం ఓటు బ్యాంక్ రాజకీయాల కోసమే ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటోందని బీజేపీ విమర్శించింది. అయితే, కమలనాథుల ‘చలో అసెంబ్లీ’కి పిలుపునిచ్చిన నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. అసెంబ్లీ పరిసరాల్లో చూట్టూరా భారీ భద్రతను ఏర్పాటు చేశారు.

Next Story