నకిలీ ఓట్లపై బీజేపీ నజర్!

by Disha Web Desk 6 |
నకిలీ ఓట్లపై బీజేపీ నజర్!
X

ఓటరు లిస్టుపై కమలదళం ఫోకస్ పెట్టింది. అన్ని బూత్‌లలో జాబితాను పరిశీలిస్తున్నది. కార్యకర్తలు, మద్దతు దారుల పేర్లు మిస్ కావడం, నకిలీ ఓటర్లు కనిపిస్తుండడంతో సీరియస్‌గా ఉన్నది. ఈ విషయాన్ని అధిష్టానం దృష్టికి తీసుకెళ్లడంతోపాటు కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసేందుకు సిద్ధమవుతున్నది.

దిశ, తెలంగాణ బ్యూరో: జీహెచ్ఎంసీ ఎన్నికల సమయంలో అనేక ఓట్లు గల్లంతయ్యాయి. దీని ప్రభావం పార్టీ విజయావకాశాలపై పడిందని బీజేపీ భావిస్తున్నది. మరోసారి ఇలాంటివి రిపీట్ కాకుండా జాగ్రత్త పడుతున్నది. ఓటరు జాబితాలో మద్దతుదారుల పేర్లున్నాయో లేదో చూసుకోవాలని గతంలోనే పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేసింది. పార్టీకి మద్దతుగా నిలిచే వారి ఓట్లు గల్లంతయ్యాయని గుర్తించింది. లిస్ట్‌లో స్థానికుల పేర్లు లేకపోగా ఇతర రాష్ట్రాల నుంచి వలసవచ్చిన వారి పేర్లు ఉన్నాయని బీజేపీ నాయకులు చెబుతున్నారు. శేరిలింగంపల్లి నియోజకవర్గంలో ఇల్లు కూడా లేని ఒక ఓపెన్ ప్లాట్ పై 50 ఓట్లు మైగ్రెంట్స్ పేరిట ఓటర్ జాబితాలో నమోదైనట్లు వెల్లడించారు. గతంలో వలస వచ్చిన వారి ఓట్లు అలాగే కొనసాగించి, స్థానికుల ఓట్లు లేకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మైగ్రెంట్స్‌గా వచ్చి వెళ్లిన వారి ఓట్లను ఎన్నికల అధికారులు ఎందుకు తొలగించలేదని ప్రశ్నిస్తున్నారు. దీని గురించి జాతీయ పార్టీ పెద్దలకు వివరించేందుకు పలువురు నేతలు ఈనెల 7వ తేదీన ఢిల్లీకి వెళ్తున్నారు. పార్టీ ఆదేశాలకు అనుగుణంగా ఏం చేయాలనేది నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు.

దమ్ముంటే ధైర్యంగా ఎదుర్కోవాలి

ముఖ్యమంత్రి కేసీఆర్‌కు దమ్ముంటే బీజేపీని నేరుగా, ధైర్యంగా ఎదుర్కోవాలి. కానీ, ఇలా బీజేపీ మద్దతుదారుల ఓట్లు తొలగించి కాదు. ఇలా చేయడం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమే అవుతుంది. ఎన్నికల సంఘం బోగస్ ఓట్లను గుర్తించి ఏరివేయాలి. స్థానికుల ఓట్ల గల్లంతు వ్యవహారంలో అధికారులు ఎంక్వయిరీ చేపట్టి నిజాలు రాబట్టాలి.

Also Read..

చెల్లెలి 'సెంటిమెంట్'.. కలసి వస్తుందని తెలంగాణ కాంగ్రెస్‌లో ఆశ!


Next Story

Most Viewed