రేపు రాష్ట్రానికి బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా రాక.. 20 వేల మంది కార్యకర్తలతో సభ

by Disha Web Desk 12 |
రేపు రాష్ట్రానికి బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా రాక.. 20 వేల మంది కార్యకర్తలతో సభ
X

దిశ, తెలంగాణ బ్యూరో : బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా శుక్రవారం తెలంగాణకు రానున్నారు. శుక్రవారం మధ్యాహ్నం శంషాబాద్ విమానాశ్రయానికి నడ్డా చేరుకుంటారు. అనంతరం రోడ్డు మార్గాన సంగారెడ్డికి బయలుదేరుతారు. జిల్లాలో కొత్తగా నిర్మితమైన బీజేపీ జిల్లా కార్యాలయాన్ని ఆయన ప్రారంభిస్తారు. అనంతరం వర్చువల్ గా భూపాలపల్లి, వరంగల్, జనగామ, మహబూబాబాద్ జిల్లాల్లోని పార్టీ కార్యాలయాలను ఆయన ప్రారంభించనున్నారు. తెలంగాణలోని మొత్తం 5 జిల్లాల్లో పార్టీ కార్యాలయాలతో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన అనంతపూర్, చిత్తూరు జిల్లాల పార్టీ కార్యాలయాలను సైతం నడ్డా వర్చువల్ గా ప్రారంభించనున్నారు.

ఈ సందర్భంగా సంగారెడ్డి జిల్లాలోని ఐదు అసెంబ్లీ నియోజకవర్గాలైన సంగారెడ్డి, పటాన్ చెరు, జహీరాబాద్, నారాయణ్ ఖేడ్, ఆందోల్ నియోజకవర్గాల నుంచి కనీసం 20 వేల మంది కార్యకర్తలు, నాయకులతో పాటు బీజేపీ ముఖ్య నేతలతో నడ్డా సమావేశాన్ని నిర్వహించనున్నారు. ఇదిలా ఉండగా భూపాలపల్లి జిల్లా పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవంలో బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, వరంగల్ జిల్లా పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవంలో హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్, జనగామ జిల్లాలో మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, మాజీ ఎంపీ డాక్టర్ బూర నర్సయ్య గౌడ్, మహబూబాబాద్ జిల్లాలో మాజీ ఎంపీ గరికపాటి మోహన్ రావు, మాజీ మంత్రి రవీంద్ర నాయక్ ముఖ్య అతిథులుగా పాల్గొంటారు.

సంగారెడ్డి జిల్లా పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవం అనంతరం నడ్డా తిరుగు పయనం సమయంలో శంషాబాద్ లో బీజేపీ రాష్ట్ర పదాధికారులు, జిల్లా అధ్యక్షులు, జిల్లా ఇన్ చార్జీలతో భేటీ కానున్నారు. ఈ సమావేశంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్, కేంద్ర పర్యాటక, సాంస్కృతిక ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి శాఖ మంత్రి కిషన్ రెడ్డి బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు, పార్లమెంటరీ పార్టీ బోర్డు సభ్యుడు డాక్టర్ లక్ష్మణ్, బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్ తరుణ్ చుగ్, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్ సునీల్ బన్సల్, పార్టీ జాతీయ కార్యదర్శి, తెలంగాణ రాష్ట్ర సహ ఇన్ చార్జీ అరవింద్ మీనన్ శంషాబాద్ లో నడ్డా నిర్వహించే సమావేశంలో పాల్గొంటారు.


Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !



Next Story

Most Viewed