పొత్తులపై బీజేపీ MP లక్ష్మణ్ కీలక వ్యాఖ్యలు

by Disha Web Desk 2 |
పొత్తులపై బీజేపీ MP లక్ష్మణ్ కీలక వ్యాఖ్యలు
X

దిశ, డైనమిక్ బ్యూరో: సీఎం కేసీఆర్ జాతీయ పార్టీ నిర్ణయంపై బీజేపీ రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ రియాక్ట్ అయ్యారు. జాతీయ రాజకీయాల్లోకి రావాలన్న కేసీఆర్ నిర్ణయాన్ని, ఆయన స్థాపించబోయే జాతీయ పార్టీని స్వాగతిస్తున్నామని చెప్పారు. శుక్రవారం హైదరాబాద్ లో మీడియాతో చిట్ చాట్ నిర్వహించిన ఆయన బీజేపీ పొత్తులపై కూడా స్పందించారు. తెలంగాణలో బీజేపీ క్లీన్ స్వీప్ చేయడమే తమ లక్ష్యమని చెప్పారు. త్వరలో బీజేపీలో భారీగా చేరికలు ఉంటాయని చెప్పారు. టీడీపీతో కలిసి పని చేసే ఆలోచన లేదని స్పష్టం చేశారు. ఏపీలో జనసేనతో పొత్తు కొనసాగుతుందని చెప్పారు. ఏపీలో అభివృద్ధి జరగడం లేదని అక్కడి ప్రజలు మార్పు కోరుకుంటున్నారని అన్నారు. కేంద్ర మంత్రి పదవిపై స్పందించిన ఆయన.. బీజేపీ పార్లమెంటరీ బోర్డు సభ్యుడిగా నియమించడమే కేంద్ర మంత్రి పదవిగా భావిస్తున్నట్లు తెలిపారు. వెంకయ్యనాయుడు తర్వాత పార్లమెంటరీ బోర్డు సభ్యుడిగా నియమితులైన రెండో తెలుగు వ్యక్తిని తానేనని ఆ విధంగా తనకు పార్టీ గుర్తింపునిచ్చిందన్నారు.

ఆ ఘనత మోడీదే:

దేశంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం రాజకీయాలకు అతీతంగా బలహీన వర్గాల కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నదని లక్ష్మణ్ తెలిపారు. ముషీరాబాద్ జవహర్ నగర్ కమ్యూనిటీ హాల్ లో ఏర్పాటు చేసిన నమో ఫోటో ఎగ్జిబిషన్ ను ఆయన ప్రారంభించి మాట్లాడారు. పేదలకు ఉపయోగపడే గరీబ్ కళ్యాణ్ యోజన పథకాన్ని మోడీ ప్రభుత్వం మరో మూడు నెలలు పెంచిందని చెప్పారు. కేబినెట్ లో బలహీన వర్గాలకు చెందిన 27 మందికి మంత్రులుగా అవకాశం కల్పించిన ఘటన ప్రధాని నరేంద్రమోడీకే దక్కుతుందన్నారు. మెడికల్ సీట్లలో ఓబీసీలకు 27 శాతం రిజర్వేషన్లు కల్పించారని చెప్పారు. గాంధీ జయంతి సందర్భంగా అక్టోబర్ 2న ఖాదీ మేళా పేరుతో చేనేత కార్మికుల కోసం ప్రత్యేక కార్యక్రమం నిర్వహించబోతున్నట్లు ఆయన వెల్లడించారు.

ఇవి కూడా చదవండి : 'బీజేపీ లాంటి పార్టీని నేనెప్పుడూ చూడలేదు'


Next Story