బీఆర్ఎస్ పార్టీ ఓ చచ్చిపోయిన పాములాంటిది.. ఎంపీ లక్ష్మణ్ ఫైర్

by Ajay Maddhiboyina |

బీఆర్ఎస్ ఓ చచ్చిపోయిన పాములాంటిద‌ని బీజేపీ నేత‌, ఎంపీ ల‌క్ష్మ‌ణ్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. బీఆర్ఎస్ గురించి ఎంత త‌క్కువ మాట్లాడుకుంటే అంత మంచిదని వ్యాఖ్యానించారు.

బీఆర్ఎస్ పార్టీ ఓ చచ్చిపోయిన పాములాంటిది.. ఎంపీ లక్ష్మణ్ ఫైర్
X

దిశ, వెబ్ డెస్క్: బీఆర్ఎస్ ఓ చచ్చిపోయిన పాములాంటిద‌ని బీజేపీ నేత‌, ఎంపీ ల‌క్ష్మ‌ణ్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. బీఆర్ఎస్ గురించి ఎంత త‌క్కువ మాట్లాడుకుంటే అంత మంచిదని వ్యాఖ్యానించారు. ఎంత లేపినా బీఆర్ఎస్ లేవ‌ద‌న్నారు. ప్ర‌జ‌లు న‌మ్మ‌కంతో ప్ర‌తిప‌క్ష హోదా ఇస్తే, ప్ర‌తిప‌క్ష నాయ‌కుడిగా అసెంబ్లీకి రాకుండా ప్ర‌జ‌ల స‌మస్య‌లు ప్ర‌స్తావించ‌కుండా, ప్ర‌జా స‌మ‌స్య‌ల‌పై ప్ర‌భుత్వాన్ని నిల‌దీయ‌కుండా ప్ర‌భుత్వంతో మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకున్నార‌ని విమ‌ర్శించారు. వాళ్లు ఒక‌రికొక‌రు లోపాయికార ఒప్పందం చేసుకుని స‌హ‌క‌రించుకుంటున్నార‌ని ఆరోపించారు. బీజేపీ తెలంగాణ‌లో అజేయ‌శ‌క్తిగా ఎదుగుతుంద‌ని దొడ్డిదారిన అడ్డుకునే కుట్రలు పన్నుతున్న విష‌యాన్ని తెలంగాణ ప్ర‌జ‌లు గ‌మ‌నిస్తున్నార‌ని చెప్పారు.

తెలంగాణ ప్ర‌జ‌ల ఆకాంక్ష‌ల‌కు అనుగుణంగా బీఆర్ఎస్ తో క‌లిసి ఉద్య‌మంలో ప‌నిచేశామ‌ని కానీ ఏ ఎన్నిక‌ల్లో పొత్తు పెట్టుకోలేద‌ని గుర్తు చేశారు. స్థానిక ఎన్నిక‌లైనా ఏ ఎన్నిక‌లైనా ఒంట‌రిగానే పోటీ చేశామ‌న్నారు. భ‌విష్య‌త్ లోనూ ఒంట‌రిగానే పోటీ చేస్తామ‌ని పొత్తులు ఉండ‌వ‌ని స్ప‌ష్టం చేశారు. మోడీ వ‌రుస‌గా మూడోసారి ప్ర‌ధాని అయ్యాక తెలంగాణ‌కు మొద‌టిసారి రాబోతున్నారని చెప్పారు. మే 10న సాయంత్రం ప‌రేడ్ గ్రౌండ్స్ లో జ‌న ఆగ్ర‌హ స‌భ నిర్వ‌హిస్తున్నామ‌ని తెలిపారు. స‌భ‌కు ముందు రైల్వే, ఇత‌ర కేంద్ర ప్రాజెక్టుల‌కు శంకుస్థాప‌న చేస్తార‌ని చెప్పారు. ఐదు రాష్ట్రాల ఎన్నిక‌ల్లో బీజేపీ గ‌ణ‌నీయ‌మైన విజ‌యాల‌ను సాధిస్తుంద‌ని ధీమా వ్య‌క్తం చేశారు.

Next Story