ఆ కోపంతోనే నా ఇంటిపై కవిత దాడి చేయించింది: MP Arvind

by Disha Web Desk 2 |
ఆ కోపంతోనే నా ఇంటిపై కవిత దాడి చేయించింది: MP Arvind
X

దిశ, డైనమిక్ బ్యూరో: రైతులను కూలీలుగా మార్చిన ఘనత సీఎం కేసీఆర్‌దని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి ఎంపీ ఆరోపించారు. మంచి స్థాలాలు, ఎకరాల భూములు ఉన్న వారు కూడా ఇవాళ గల్ఫ్‌కు వెళ్లి కూలీలుగా పని చేసుకుంటున్నారని ఈ ఘనత కూడా కేసీఆర్‌కే దక్కుతుందన్నారు. కేంద్ర ప్రభుత్వం చేతుల్లో దర్యాప్తు సంస్థలు లేవని ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఏం జరుగుతుందో సీబీఐకే తెలుసన్నారు. మాకు నోటీసులు వస్తే సహకరిస్తామని కేసీఆర్, కేటీఆర్, కవిత చెప్పారని ఇప్పుడు సీబీఐ, కవిత మధ్య ఏం జరుగుతుందో తమకేం తెలుసన్నారు. మంగళవారం ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన ఆయన.. ప్రజా సమస్యలు, టీఆర్ఎస్ వైఫల్యాలపై బీజేపీ పార్టీ ఏర్పాటు చేసిన కమిటీ తరపున పలు అంశాలపై అధ్యయనాలు చేస్తున్నామన్నారు. వచ్చే నెలలో తమ కమిటీ పూర్తి నివేదిక సిద్ధం చేస్తుందని చెప్పారు. రైతులకు రుణమాఫీ చేస్తానని 2014లో మేనిఫెస్టోలో ప్రకటించిన టీఆర్ఎస్ 2018 వరకు రైతు రుణమాఫీ కోసం నయా పైసా విడుదల చేయలేదని మండిపడ్డారు. 2018 తర్వాత రూ.20,164 కోట్లు కేటాయిస్తే అందులో ఇప్పటి వరకు కేవలం రూ.1,171 కోట్లు మాత్రమే విడుదల చేశారని, అది కూడా రెండు వాయిదాల్లో విడుదల చేయడం వల్ల లక్షలాది మంది రైతులు రుణమాఫీ కాకుండా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. కేసీఆర్ రుణమాఫి చేస్తాడని నమ్మి లక్షలాది మంది రైతులు నాన్ ఫర్మార్ అసెట్‌గా మారిపోయి ఏ బ్యాంక్ కూడా రుణాలు పొందుకునే స్థితిలో లేకుండా పోయారని అన్నారు. కామారెడ్డి జిల్లాలో తన పిల్లల కళ్లెదుటే సెల్ టవర్‌కు ఉరేసుకుని ఓ రైతు ఆత్మహత్య చేసుకున్నాడని ఇది అందరినీ కలిచివేసిందన్నారు. సుమారు 475 మంది రైతులు కేవలం సిద్ధిపేట జిల్లాలోనే ఆత్మహత్యలు చేసుకున్నారని దీనికి సీఎం కేసీఆర్, మత్రి హరీశ్ రావు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

కరెంట్ స్కాం డబ్బులు లిక్కర్ స్కాంలో:

24 గంటల ఫ్రీ విద్యుత్ ఇస్తానని టీఆర్ఎస్ పార్టీ 2014 మేనిఫెస్టోలో ప్రకటించిందని అయితే ప్రస్తుతం గ్రామాల్లో 6-10 గంటల వ్యవసాయ రంగానికి పవర్ కట్ కొనసాగుతోందని అన్నారు. అప్పులు చేస్తూ విద్యుత్ కొనుగోలు చేస్తున్నారని, ఈ విద్యుత్ కొనుగోలులో కుంభకోణం జరుగుతోందని ఆరోపించారు. కరెంట్ స్కాంలో వచ్చిన డబ్బులే లిక్కర్ స్కాం, ఫీనిక్స్ వంటి సంస్థలో పెట్టుబడులు పెడుతున్నారని అన్నారు. ఇవాళ అందరి దృష్టి కవితపై పెట్టారని నిజానికి కేటీఆర్ టెన్షన్‌లో ఉన్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశంలో అన్ని రాష్ట్రాల కంటే అధిక చార్జీలు వెచ్చించి విద్యుత్ కొనుగోలు తెలంగాణ ప్రభుత్వం కొనుగోలు చేస్తోందని, అలాగే తెలంగాణలోనే అత్యధిక విద్యుత్ ఛార్జీలు వసూలు చేస్తున్నారని అన్నారు. విద్యుత్ రంగం విషయంలో రాష్ట్ర ప్రభుత్వం శాస్త్రీయత విధానాలు అనుసరించడం లేదని ఆరోపించారు. గత అక్టోబర్‌లో తమ కమిటీ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో తొలిసారిగా విద్యుత్ రంగంలో టీఆర్ఎస్ సర్కార్ వైఫల్యాలపై ప్రెస్ మీట్ నిర్వహించామని, ఈ ప్రెస్ మీట్ తర్వాతే కోపంతో కవిత తన ఇంటిపై దాడి చేయించిందని ఆరోపించారు. దాడుల ద్వారా తమను ఆపాలనుకుంటే అంతకంటే మూర్ఖత్వం లేదని అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు ప్రాంతంలో కొత్తగా ఒక్క ఎకరం కూడా అదనంగా పంట పండలేదని అన్నారు. దేశంలో సాయిల్ టెస్ట్ జరగని రాష్ట్రం ఒక్క తెలంగాణ మాత్రమే అన్నారు. తెలంగాణను సీల్డ్ బౌల్ చేస్తానని చెప్పిన కేసీఆర్ ఇవాళ్టి వరకు విత్తనాల మీద పరిశోధన కోసం వెచ్చించిన వ్యయం శూన్యం అన్నారు. కేసీఆర్ పాలనలో తెలంగాణ పరిస్థితి పెనం మీద నుంచి పోయ్యిలో పడినట్టుగా ఉందన్నారు. ప్రీమియం ఎక్కువుందని ఫసల్ బీమా ప్రీమియం కేసీఆర్ కట్టడం లేదని దానివల్ల రైతులు పంట నష్టాలతో ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని అన్నారు. రైతాంగాన్ని నాశనం చేసే పనిలో సీఎం నిమగ్నం అయ్యారని అన్నారు. కుర్చేసుకుని కూర్చొని పోడు భూముల సమస్య పరిష్కరిస్తానన్న సీఎం ఇప్పటి వరకు ఆ సమస్యను పరిష్కరించలేకపోయారని విమర్శించారు. తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ అల్లుడు హరీష్ రావుకు అగ్గిపెట్టె దొరకలేదు, పోడు భూముల సమస్య పరిష్కరించేందుకు ఇప్పుడు కేసీఆర్‌కు కుర్చీ దొరకడం లేదని ఎద్దేవా చేశారు.

ఎన్ఆర్ఐల సంక్షేమం ఏది?:

ఎన్ఆర్ఐ పాలసీ తీసుకొస్తామని గతంలో కేటీఆర్ ప్రకటించారని ఆ తర్వాత వారిని పట్టించుకోలేదని విమర్శించారు. ముఖ్యమంత్రి సీఎస్ సోమేష్ కుమార్ మాట వింటున్నాడో లేదో చెప్పాలన్నారు. ప్రధాని నరేంద్ర మోడీకి పేరు వస్తుందనే కారణంతో అనేక పాలసీలకు ప్రీమియంలు రాష్ట్ర ప్రభుత్వం చెల్లించడం లేదని ఆరోపించారు. ఎన్ఆర్ఐల విషయంలో ఏదైనా డేటా ఉందా అని ప్రశ్నించారు. ఎన్ఆర్ఐల సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేసిందన్నారు. దేశంలోనే అత్యధికంగా తెలంగాణ నుంచి గల్ఫ్ దేశాలకు వెళ్తున్నారని ఇక్కడి నుంచి వెళ్లిన వారు అక్కడ దుర్భర జీవితం గడుపుతున్నారని అన్నారు. అలాంటి వారిని తిరిగి రాష్ట్రానికి రప్పించడానికి ఎలాంటి కార్యక్రమాలు అమలు చేయడం లేదని మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వం ముద్ర యోజన, స్కిల్ ఇండియా, మేకిన్ ఇండియా వంటి కార్యక్రమాలు చేస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం ఏమి చేయడం లేదని ఆరోపించారు. రాష్ట్రంలో డబుల్ ఇంజిన్ సర్కార్ వస్తేనే అభివృద్ధి జరుగుతుందన్నారు. రాబోయే రోజుల్లో తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని గద్దెదించి బీజేపీ ప్రభుత్వం ఏర్పడుతుందన్నారు.

తెలంగాణ ప్రభుత్వంపై నివేదిక:

తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాలపై నివేదిక రూపొందిస్తున్నామని ఈ నివేదిక నెల లోపున పూర్తవుతుందని అర్వింద్ అన్నారు. జాతీయంగా, అంతర్జాతీయంగా సైంటిఫిక్ ఆయా అంశాలపై అధ్యయనం చేసి నివేదిక రూపొందిస్తున్నామని చెప్పారు. తాము ఇవ్వబోయే నివేదిక రాబోయే రోజుల్లో టీఆర్ఎస్ ప్రభుత్వంపై చార్జిషీట్ వేయడానికి, బీజేపీ ఎన్నికల ప్రణాళిక రూపకల్పనకు ఉపయోగపడుతుందని అన్నారు. తాము అధ్యయనం చేస్తున్న సమస్యలలో 50 నుంచి 60 శాతం సమస్యలు సీఎం కేసీఆర్ కు తెలుసునని అయితే వాటిని పరిష్కరించే మనసు ఆయనకు లేదన్నారు. దోచుకోవడంపై ఉన్న చిత్తశుద్ధి ప్రజా సమస్యలు పరిష్కరించడంలో చూపించడం లేదని విమర్శించారు.

Also Read: సీఎం ఇలాకాలో ఆత్మహత్యల పరంపర.. ఈటల ఫైర్


Next Story

Most Viewed