ఎంఐఎం పార్టీ మహిళా ద్రోహిగా చరిత్రలో నిలిచిపోతుంది: ఎంపీ బండి సంజయ్ తీవ్ర విమర్శలు

by Disha Web Desk 19 |
ఎంఐఎం పార్టీ మహిళా ద్రోహిగా చరిత్రలో నిలిచిపోతుంది: ఎంపీ బండి సంజయ్ తీవ్ర విమర్శలు
X

దిశ, తెలంగాణ బ్యూరో: మహిళా రిజర్వేషన్ల బిల్లును వ్యతిరేకించిన ఎంఐఎం పార్టీ.. మహిళా ద్రోహి పార్టీగా చరిత్రలో మిగిలిపోతుందని బీబీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ మంగళవారం ఒక ప్రకటనలో ఘాటు విమర్శలు చేశారు. మహిళా బిల్లు విషయంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు ద్వంద్వ విధానాలను మానుకోవాలని ఆయన పేర్కొన్నారు. అంతకంటే ముందే రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో మహిళలకు 33 శాతం సీట్లు కేటాయించి ఆయా పార్టీలు తమ చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని డిమాండ్ చేశారు. మహిళలకు రిజర్వేషన్లు కల్పించాలనే ఆలోచన దాదాపు 5 దశాబ్దాల నాటిదని, 1975లోనే లోక్ సభలో మహిళలకు రిజర్వేషన్లు కల్పించాలనే చర్చ జరిగిందని బండి గుర్తుచేశారు.

కాంగ్రెస్ అనుసరిస్తున్న ద్వంద్వ వైఖరి వల్ల గత మూడు దశాబ్దాలుగా మహిళా రిజర్వేషన్ బిల్లు ఆమోదానికి నోచుకోకపోవడం దురదృష్టకరమన్నారు. అటల్ బిహారీ వాజ్ పేయి ఆధ్వర్యంలో ఎన్డీఏ ప్రభుత్వం 1998 జూలైలో తొలిసారిగా మహిళా బిల్లు ప్రవేశపెట్టినప్పటికీ, కాంగ్రెస్, ఆర్జేడీ సహా విపక్షాలు వ్యతిరేకించడంతో ఆమోదం పొందలేదని మండిపడ్డారు. ఆ తరువాత వాజ్ పేయి ప్రభుత్వం మరో మూడుసార్లు మహిళా బిల్లు ప్రవేశపెట్టినప్పటికీ కాంగ్రెస్, మిత్రపక్షాలు చేసిన కుట్రల వల్ల ఆమోదానికి నోచుకోలేకపోయిందన్నారు.

యూపీఏ ఛైర్ పర్సన్‌గా పదేళ్ల పాటు పనిచేసిన సోనియా గాంధీ మహిళ అయినప్పటికీ.. పార్లమెంట్‌లో యూపీఏ కూటమికి పూర్తి మెజారిటీ ఉన్నప్పటికీ మహిళా బిల్లును ఆమోదించలేకపోయారంటే కాంగ్రెస్ మహిళా వ్యతిరేకి అనడానికి ఇంతకంటే నిదర్శనం ఏం కావాలని బండి పేర్కొన్నారు. ప్రధాని మోడీ ఆధ్వర్యంలోని ఎన్డీఏ కూటమికి పార్లమెంట్‌లో పూర్తిస్థాయిలో మెజారిటీ ఉన్నందున మహిళా బిల్లు ఆమోదం పొందడం ఖాయమని నొక్కిచెప్పారు. కాంగ్రెస్ సహా విపక్షాలన్నీ వ్యతిరేకించినా బిల్లును అడ్డుకోవడం అసాధ్యమని బండి ధీమా వ్యక్తంచేశారు.


Next Story