మునుగోడులో కోమటిరెడ్డి ఓటమికి కారణం అదే.. రఘునందన్ రావు కీలక వ్యాఖ్యలు

by Disha Web Desk 2 |
మునుగోడులో కోమటిరెడ్డి ఓటమికి కారణం అదే.. రఘునందన్ రావు కీలక వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: ఫోన్‌ ట్యాపింగ్‌ వ్యవహారంపై మాజీ ఎమ్మెల్యే, మెదక్ బీజేపీ ఎంపీ అభ్యర్థి రఘునందన్ రావు కీలక వ్యాఖ్యలు చేశారు. మంగళవారం నాంపల్లిలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రఘునందన్ రావు మాట్లాడుతూ.. ఫోన్ ట్యాపింగ్ కేసులో మొదటి ముద్దాయిగా కేసీఆర్‌ను రెండో ముద్దాయిగా హరీష్ రావును, మూడో ముద్దాయిగా సిద్దిపేట మాజీ కలెక్టర్ వెంకట్రామిరెడ్డిని చేర్చాలని ఆయన డిమాండ్ చేశారు. అసలు నిందితులను ముద్దాయిలుగా చేర్చకపోతే కేసు సంపూర్ణం కాదని అన్నారు. కుటుంబ సభ్యుల ఫోన్‌లు ట్యాపింగ్ చేసే అధికారం ఎవరికీ లేదని చెప్పారు.

గతంలో రేవంత్ రెడ్డి ఫోన్ ట్యాపింగ్ ద్వారా అరెస్ట్ చేశారని గుర్తుచేశారు. 2014 నుంచే ఈ ట్యాపింగ్‌లు నడుస్తున్నాయని అనుమానం వ్యక్తం చేశారు. దీనిపై ప్రభుత్వం చిత్తశుద్ధితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఫోన్ ట్యాపింగ్ జరిగినప్పుడు డీజీపీ, ఎస్ఐ‌బీ చీఫ్‌గా ఎవరెవరు ఉన్నారు.. ట్యాపింగ్‌కు పాల్పడిన అధికారులను ఎందుకు క్షమించారని ప్రశ్నించారు. గత డీజీపీ పీఏ శ్రీనాథ్ రెడ్డి అధికారిక ఖర్చులతో అమెరికా వెళ్లారని నిలదీశారు. ఇద్దరు అధికారులను అరెస్ట్ చేసి చేతులు దులుపుకోవడం కాదని.. సీరియస్‌గా తీసుకోవాలని ప్రభుత్వానికి సూచించారు.

ఫోన్ ట్యాపింగ్ కారణంగానే మునుగోడు ఉప ఎన్నికల్లో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఓటమి పాలయ్యారని కీలక వ్యాఖ్యలు చేశారు. కాగా, మరోవైపు ఫోన్‌ ట్యాపింగ్‌ల కేసులో సంచలన విషయం వెలుగులోకి వస్తున్నాయి. ఈ కేసులో ప్రధాన నిందితుడు మాజీ డీఎస్పీ ప్రణీత్ రావు వెల్లడించిన విషయాల ఆధారంగా అదనపు ఎస్పీలు భుజంగరావు, తిరుపతన్నలను అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ఫోన్ ట్యాపింగ్ ద్వారా అధికారులు భారీగా అక్రమ ఆస్తులు కూడబెట్టుకున్నట్లు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. దీంతో పలువురు అధికారులపై ACB ఫోకస్ చేసింది.


Next Story