ఎక్కడైనా, ఎప్పుడైనా చ‌ర్చకు రెడీ.. మంత్రి ఉత్తమ్‌కు బీజేఎల్పీ నేత ఏలేటి సవాల్

by Gantepaka Srikanth |

ఎక్కడైనా, ఎప్పుడైనా చ‌ర్చకు రెడీ.. మంత్రి ఉత్తమ్‌కు బీజేఎల్పీ నేత ఏలేటి సవాల్

ఎక్కడైనా, ఎప్పుడైనా చ‌ర్చకు రెడీ.. మంత్రి ఉత్తమ్‌కు బీజేఎల్పీ నేత ఏలేటి సవాల్
X

దిశ, తెలంగాణ బ్యూరో: హిల్ట్ పాల‌సీ అత్యంత పారదర్శకంగా ఉందని, ఎలాంటి కుంభకోణానికి ఆస్కారం లేదంటున్న మంత్రి ఉత్తమ్ ఈ విధానంపై బ‌హిరంగ‌ చ‌ర్చకు సిద్ధమా అని బీజేఎల్పీ నేత ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్‌రెడ్డి స‌వాల్ విసిరారు. ఓపెన్ డిబేట్‌కు మంత్రి సిద్ధప‌డితే శ‌నివారం ఉద‌యం 11 గంట‌ల‌కు అసెంబ్లీ మీడియా పాయింటులో జ‌ర్నలిస్టుల స‌మ‌క్షంలో చ‌ర్చకు తాను సిద్ధమని వెల్లడించారు. లేదంటే డేట్, టైమ్, వేదికను మంత్రి ఖ‌రారు చేసినా తనకు అభ్యంత‌రం లేదన్నారు. ఎక్కడైనా, ఎప్పుడైనా చ‌ర్చకు సిద్ధమే అని సవాల్ విసిరారు. హైద‌రాబాద్ ఇండస్ట్రియల్‌ ల్యాండ్ ట్రాన్స్‌ఫ‌ర్మేష‌న్ పాలసీ ప్రతిప‌క్షాల‌కు అర్థం కాలేద‌న‌డం మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి దివాళాకోరుత‌నానికి నిద‌ర్శనమని విమర్శించారు. ప్రభుత్వ విధానంలో పార‌ద‌ర్శక‌త ఉంటే, దానిపై చ‌ర్చించేందుకు అసెంబ్లీని ఎందుకు స‌మావేశ‌ప‌రచ‌డం లేదని ప్రశ్నించారు. హిల్ట్ పాల‌సీ కాంగ్రెస్ ప్రభుత్వం కొత్తగా తెచ్చింది కాదని, గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలోనే చర్చ జరిగిందని అంటున్నారని.. బీఆర్ఎస్ హ‌యాంలో జ‌రిగిన అవినీతిని, అక్రమాల‌ను కాంగ్రెస్ ప్రభుత్వం ఆద‌ర్శంగా తీసుకుంటున్నదా అని ప్రశ్నించారు.

బీఆర్ఎస్ పెద్దల‌తో కాంగ్రెస్‌కు ఉన్న మ్యాచ్ ఫిక్సింగ్ ఏంటని ప్రశ్నించారు. హైదరాబాద్‌ను కాలుష్య రహితంగా, ప్రపంచస్థాయి నగరంగా తీర్చిదిద్దేందుకే పరిశ్రమలను నగరం బయటకు పంపుతున్నట్లు మంత్రి ఉత్తమ్ చెప్పారని.. ఎక్కడికి త‌ర‌లిస్తున్నారో, ఎక్కడ భూముల‌ను కేటాయించారో ఎందుక‌ు చెప్పడం లేదన్నారు. రూ.6 లక్షల30 వేల కోట్ల విలువైన భూముల‌ను కేవ‌లం రూ.5 వేల కోట్లకే క‌ట్టబెట్డడం కుంభ‌కోణం కాక మ‌రేంటని ప్రశ్నించారు. ఈ కుంభ‌కోణంలో మంత్రి ఉత్తమ్‌తో స‌హా మొత్తం కేబినెటుకు, కాంగ్రెస్ హైక‌మాండ్ పెద్దల‌కు భాగ‌స్వామ్యం ఉందని ఆరోపించారు. కాంగ్రెస్ స‌ర్కార్ చేస్తున్నది ల్యాండ్ క‌న్వర్షన్ కాదని.. ల్యాండ్ లూటీ అని అన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి ల్యాండ్ లూటీ మాఫియా డాన్‌లా, మంత్రులు ల్యాండ్ లూటీ గ్యాంగ్ స్టర్లుగా వ్యవ‌హ‌రిస్తున్నారని ఆరోపించారు. మంత్రి ఉత్తమ్‌కు దమ్ముంటే సీఎంని ఒప్పించి తక్షణ‌మే అసెంబ్లీని స‌మావేశ‌ప‌ర‌చాలని డిమాండ్ చేశారు. లేదంటే జీవో 27ను త‌క్షణ‌మే ర‌ద్దు చేయాలని.. లేదంటే బీజేపీ ఆధ్వర్యంలో భారీ ఉద్యమం చేపడతామని హెచ్చరించారు.

Next Story