మతోన్మాద పార్టీకి ఆ రెండు పార్టీలు ఎలా మద్దతిస్తాయో చెప్పాలి.. బీజేపీ నేత కాసం డిమాండ్

by Ramesh Goud |

మతోన్మాద పార్టీకి బీఆర్ఎస్, కాంగ్రెస్ ఎలా మద్దతిస్తాయో చెప్పాలని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాసం వెంకటేశ్వర్లు (BJP General Secretary Kasam Venkateshwarlu) అన్నారు.

మతోన్మాద పార్టీకి ఆ రెండు పార్టీలు ఎలా మద్దతిస్తాయో చెప్పాలి.. బీజేపీ నేత కాసం డిమాండ్
X

దిశ, వెబ్ డెస్క్: మతోన్మాద పార్టీకి బీఆర్ఎస్, కాంగ్రెస్ ఎలా మద్దతిస్తాయో చెప్పాలని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాసం వెంకటేశ్వర్లు (BJP General Secretary Kasam Venkateshwarlu) అన్నారు. హైదరాబాద్ ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల (HYD Loacl Body MLC Results) అనంతరం బీజేపీ ఆఫీస్ (BJP Office)లో మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన.. బీజేపీ, కాంగ్రెస్, ఎంఐఎం పార్టీలపై విరుచుకుపడ్డారు. ఈ సందర్భంగా కాసం మాట్లాడుతూ.. ఈ రోజు వచ్చిన ఫలితాలను చూస్తుంటే.. ఎంఐఎం(MIM), బీఆర్ఎస్(BRS), కాంగ్రెస్(Congress) పార్టీల అపవిత్ర కలయిక ఏ విధంగా ఉంటుందో రుజువు చేసిందని అన్నారు.

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును మొదటి నుండి వ్యతిరేకించిన పార్టీ, హైదరాబాద్ అభివృద్ధి చెందకుండా ఆపిన పార్టీ, కనీసం పాత పట్టణానికి మెట్రో కూడా రాకుండా అడ్డుకున్న పార్టీ ఎంఐఎం అని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్‌కౌంటర్లలో చనిపోయిన ఉగ్రవాదుల శవయాత్రలకు వెళ్లి సానుభూతి తెలిపిన పార్టీ, తీవ్రవాదులకు స్థావరాలు ఏర్పాటు చేసిన పార్టీ ఎంఐఎం, ఎంఐఎం నాయకులు అని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఎంఐఎం పార్టీకి మద్దతు ఇస్తున్నామని బాహటంగా చెప్పుకోలేని ధీన స్థితికి కాంగ్రెస్ పార్టీ దిగజారిపోయిందని, అదొక జాతీయ పార్టీనా అని హాట్ కామెంట్స్ చేశారు.

ఇక బీఆర్ఎస్ పార్టీ నాయకులను అసలు ఎన్నికల్లోనే ఓటు వేయకుండా చేసేంతా దీన స్థితికి బీఆర్ఎస్ వెళ్లిపోయిందని, ఇంతకంటే దరిద్రం తెలంగాణకు ఇంకొకటి ఉండదని విమర్శించారు. అలాంటి మతోన్మాద పార్టీకి ప్రత్యక్షంగా, పరోక్షంగా హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలలో ఎలా మద్దతు తెలిపారో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు తెలంగాణ ప్రజానీకానికి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. తెలంగాణలో పాకిస్థాన్ ను ప్రేమించే ఎంఐఎం, కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు ఒకటై చెలిమి చేసుకుంటున్నారని సంచలన ఆరోపణలు చేశారు. ఇక వాస్తవాలు ప్రజలకు తెలియజేసేందుకే హైదరాబాద్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేశామని, రాబోయే కాలంలో నిర్ణయాధికారం ప్రజలే తీసుకోవాలని బీజేపీ నేత సూచించారు.

Next Story