కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని రేవంత్ రెడ్డి కూడా అనుకోలేదు: ఈటల

by Disha Web Desk 2 |
కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని రేవంత్ రెడ్డి కూడా అనుకోలేదు: ఈటల
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని రేవంత్ రెడ్డి కూడా ఊహించలేదని బీజేపీ నేత, మాజీ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. సోమవారం విజయ సంకల్ప యాత్రలో భాగంగా నిర్వహించిన భారీ ర్యాలీలో ఈటల రాజేందర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అనూహ్యంగా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని అన్నారు. అసలు తెలంగాణలో ఆ పార్టీ పవర్‌లోకి వస్తుందని స్వయంగా సీఎం రేవంత్ రెడ్డితో పాటు ప్రభుత్వంలో మంత్రులుగా కొనసాగుతున్న వారెవరూ ఊహించలేదని విమర్శించారు. అధికారంలోకి రాలేము అని వారికి స్పష్టంగా తెలిసే అమలుకు సాధ్యం కాని హామీలు గుప్పించారు.

అధికారంలోకి వస్తాం.. పాలించే చాన్స్ వస్తుందని వారికి ముందే తెలిసి ఉంటే ఇలాంటి గ్యారంటీలు ఇచ్చే వారు కాదని అన్నారు. వారికి ఇప్పుడు వాస్తవ పరిస్థితులు అర్థం అవుతున్నాయని.. అందుకే గ్యారంటీలు పక్కనబెట్టి బీఆర్ఎస్, బీజేపీ ఒకటే అనే ప్రచారం చేస్తూ రాజకీయంగా పబ్బం గడుపుకోవాలని చూస్తున్నారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఎప్పటికీ బీఆర్ఎస్, బీజేపీ ఒక్కటి కాబోదని స్పష్టం చేశారు. కేంద్రంలో మరోసారి బీజేపీ బంపర్ మెజార్టీతో అధికారంలోకి రాబోతోందని అన్నారు. 370 పైచిలుకు సీట్లలో బీజేపీ జెండా పాతబోతోందని జోస్యం చెప్పారు. తప్పుడు ప్రచారాలు మాని కాంగ్రెస్ నేతలు ఇచ్చిన గ్యారంటీలను అమలు చేయాలని సూచించారు.


Next Story