'నువ్వు కొట్టినట్లు చెయ్.. నేను తిట్టినట్లు చేస్తా'

by Disha Web Desk 2 |
నువ్వు కొట్టినట్లు చెయ్.. నేను తిట్టినట్లు చేస్తా
X

దిశ, తెలంగాణ బ్యూరో: 'నువ్వు కొట్టినట్లు చెయ్.. నేను తిట్టినట్టు చేస్తా' అన్నట్లు బీఆర్ఎస్, కాంగ్రెస్‌లు వ్యవహరిస్తున్నాని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ విమర్శించారు. తెలంగాణలో రోజురోజుకూ బలోపేతమవుతున్న బీజేపీని దెబ్బతీయాలన్న ఎజెండాతో ఇటు బీఆర్ఎస్, అటు కాంగ్రెస్ కలిసే పని చేస్తున్నాయని ఆరోపించారు. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్, కాంగ్రెస్ పొత్తు ఖాయమని.. మేం చెప్పింది నిజమని రూఢీ చేసేలా కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి వ్యాఖ్యలు చేశారని మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. 2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్ పొత్తు పెట్టుకుంటాయన్న మా వాదన నిజమని ఇవాళ మరోసారి తేలిపోయిందని గుర్తుచేశారు.

ఇటీవల అసెంబ్లీ సమావేశాల్లోనూ కాంగ్రెస్ పార్టీపై సీఎం కేసీఆర్ ప్రశంసలు కురిపించారని, పార్లమెంటులోనూ రెండు పార్టీల ఎంపీలు కలిసే ఉన్నారని వివరించారు. ప్రజలు ఆలోచించుకోవాలని, రాష్ట్రంలో కేసీఆర్ ప్రజా వ్యతిరేక విధానాలపై మొదటి నుంచీ గట్టిగా పోరాడేది బీజేపీ మాత్రమేనని స్పష్టం చేశారు. ప్రజలు ఇచ్చిన ప్రతిపక్ష హోదాను సమర్థంగా నిర్వహిచలేక కేసీఆర్‌తో కాంగ్రెస్‌ లోపాయికారీ ఒప్పందం చేసుకుందని విమర్శించారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ దొందూదొందే నని, కాంగ్రెస్ కు ఓటేసినా.. బీఆర్ఎస్‌కు ఓటేసినా ఆ ఓటు కేసీఆర్ కే వెళ్లడం ఖాయమన్నారు. ప్రజలు వీరి నాటకాలు గ్రహిస్తున్నారని, కాంగ్రెస్, బీఆర్ఎస్ నీచ రాజకీయాలను అసహ్యించుకుంటున్నారని, ప్రజలు ఈ రెండు పార్టీలకు తప్పక గుణపాఠం చెప్తారని పేర్కొన్నారు.



Next Story

Most Viewed