సౌత్ ఇండియాలో వ్యూహం మార్చిన బీజేపీ.. టీవీకే విజయ్ పై నజర్!

by Prasad Jukanti |   (  Updated:2025-10-04 11:03:34  IST  )

రాజకీయంగా టీవీకే విజయ్ కార్నర్ అవుతున్నారు.

సౌత్ ఇండియాలో వ్యూహం మార్చిన బీజేపీ.. టీవీకే విజయ్ పై నజర్!
X

దిశ, డైనమిక్ బ్యూరో: దేశరాజకీయాల్లో బలీయమైన శక్తిగా అవతరించిన బీజేపీకి (BJP) దక్షిణ భారతదేశం కొరకరాని కొయ్యగా మారుతోంది. సౌత్ ఇండియాలో (South India) విస్తరించాలన్న ఆ పార్టీ ఆకాంక్ష కలగానే మిగిలిపోతోంది. ఈ నేపథ్యంలో 2024 సార్వత్రిక ఎన్నికల సమయం నుంచే దక్షిణ భారత దేశంపై ప్రత్యేక నజర్ వేసిన కమల దళం.. ఇక రాబోయే రోజుల్లో తమ సత్తా చాటేందుకు వ్యూహం మార్చినట్లు టాక్ వినిపిస్తోంది. అందులో భాగంగా వచ్చే ఏడాది జరగబోయే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల కోసం ఇప్పటి నుంచే ప్రణాళికలు వేసుకుంటోందని తెలుస్తోంది. ఈ మేరకు త్వరలో భారీ సంచలనం నమోదు కాబోతున్నదనే చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతోంది.

టీవీకేతో బీజేపీ సంప్రదింపులు!:

వచ్చే ఏడాది జరగనున్న తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల కోసం ఇప్పటి నుంచే అక్కడి పార్టీలు ప్రయత్నాలు షూరూ చేశాయి. అధికార డీఎంకేతో పాటు బీజేపీ సైతం పోటాపోటీగా తమిళనాడులో కార్యక్రమాలు నిర్వహిస్తోంది. ప్రధాని మోడీ సైతం స్పెషల్ నజర్ వేయడంతో తమిళ పాలిటిక్స్ మరింత రంజుగా మారుతున్నాయి. ఈ క్రమంలో ఇన్నాళ్లు సినిమా ఇండస్ట్రీ ద్వారా ఫ్యాన్స్ ను మెప్పించిన విజయ్ (TVK Vijay) ఇకపై రాజకీయంగా ప్రజలను మెప్పించేందుకు ఉవ్విళ్లూరుతున్నారు. జాతీయ పార్టీలు, అధికార డీఎంకే పార్టీని టార్గెట్ చేస్తూ రాబోయే ఎన్నికల్లో పోటీకి సై అంటే సై అంటున్న విజయ్‍ని బీజేపీ సంప్రదించినట్లు జాతీయ మీడియాలో కథనాలు ప్రసారం అవుతున్నాయి. గత కొంతకాలంగా వరుస బహిరంగ సభల ద్వారా మంచి ఊపు మీదున్న విజయ్‍ని కరూర్‍ తొక్కిసలాట ఘటన డిఫెన్స్ లోకి నెట్టింది. 41 మందిని బలితీసుకున్న ఈ ఘటన తర్వాత విజయ్ సెంటర్ ఆఫ్ కార్నర్‍గా మారారు. తన జీవితంలో ఇలాంటి పరిస్థితి ఎన్నడు ఎదుర్కోలేదని విజయ్ చెప్పినట్లుగానే పొలిటికల్ కెరీర్‌లో విజయ్ ప్రస్తుతం అసలైన పరీక్ష ఎదుర్కొంటున్నారు. ఓ వైపు తమను డీఎంకే పూర్తి స్థాయిలో కార్నర్ చేస్తుంటడంతో అధికార పార్టీని విమర్శలను తిప్పికొట్టడం విజయ్ ముందున్న అసలైన టాస్క్ గా మారింది. ఈ క్రమంలో బీజేపీ వ్యాఖ్యలు విజయ్‍కు సపోర్ట్ గా ఉన్నాయనే టాక్ దక్షిణ భారత దేశ రాజకీయాల్లో ఆసక్తి రేపుతోంది. తాజా పరిణామాల నేపథ్యంలో విజయ్ ను ఎన్డీయే కూటమిలోకి లాగడమే బీజేపీ స్కెచ్ అనే చర్చ రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది.

సౌత్ పాలిటిక్స్ లో కీ చాప్టర్:

తమిళనాడు రాజకీయాల్లో టీవీకే పార్టీ గేమ్ చేంజర్ గా మారబోతోందనే చర్చ జరుగుతున్న వేళ కరూర్ దుర్ఘటన జరిగింది. దీంతో రాబోయే అసెంబ్లీ ఎన్నికల నాటికి అరవం పాలిటిక్స్ లో ఎలాంటి మార్పులు ఉండబోతున్నాయి? విజయ్ బీజేపీ వైపు బెండ్ అవుతారా? లేక గతంలో చెప్పినట్లుగా ఒంటరిగానే పోటీకి వెళ్తారా అనేది వేచి చూడాలి. అలా కాదని బీజేపీతో జతకడితే ఏంజరగనుంది అనేది ఇంట్రెస్టింగ్‍గా మారింది. జరుగుతున్న ప్రచారం మేరకు బీజేపీ, విజయ్ ఒక్కటైతే గనుక అది కాస్త సౌత్ పాలిటిక్స్ లో కీ చాప్టర్ గా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ పొత్తు బంధం సౌత్ ఇండియాతో పాటు ముఖ్యంగా తెలంగాణ, ఏపీ రాజకీయాల్లోకి బీజేపీ ఎలాంటి పాత్ర పోషించబోతోంది అనేది వేచి చూడాలి.

Next Story